యలమంచిలి: పాలకొల్లు రూరల్ సీఐ కుడుపూడి సతీష్ డీజీపీ డెస్క్ సిల్వర్ మెడల్ అవార్డుకు ఎంపికయ్యారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సాహించేందుకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది సీఐ సతీష్ను ఎంపిక చేస్తూ డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డి కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి. సతీష్ 2019లో నందిగామ సీఐగా పనిచేస్తున్న సమయంలో కూడా డీజీపీ బ్రౌన్జ్ డెస్క్ అవార్డు రావడం విశేషం. తనకు అవార్డు ప్రకటించిన డీజీపీ కె.రాజేంద్రనాథ్రెడ్డికి, సిఫారసు చేసిన ఉన్నతాధికారులకు, సహకరించిన తోటి సిబ్బందికి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు సీఐ సతీష్ను అభినందించారు.
కవి ప్రసాద్కు పురస్కారం
తణుకు: అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన జానపద స్వరగానం, పల్లె జానపద పట్టాభిషేకం కార్యక్రమంలో తణుకు కు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్కు పురస్కారం లభించింది. ఆయన రచించి గానం చేసిన దర్మాపురీ దానమ్మా అనే జానపద గేయానికి ప్రశంసలు లభించాయి. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి అరవ జయపాల, రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వోత్తమనాయుడు, తిరుపతి శాఖ కోశాధికారి ధనాశి ఉషారాణి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.