తండ్రి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే కొడుకు మృతి | Sakshi
Sakshi News home page

తండ్రి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే కొడుకు మృతి

Published Sun, Dec 26 2021 8:41 AM

Son Died The Day After The Fathers Funeral In Banjara Hills - Sakshi

సాకక్షి, బంజారాహిల్స్‌: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకు తండ్రి మరణించిన మరుసటి రోజే అనారోగ్యంతో మృతి చెందిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసుల సమాచారం మేరకు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌లాన్సర్‌లో ముంబైకి చెందిన డి.హరూల్‌రషీద్‌(70) నాలుగు నెలల నుంచి మహ్మద్‌ అఫ్జల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడు. ఈ నెల 21న తీవ్ర జ్వరంతో హరూల్‌ రషీద్‌ బాధపడుతుండటంతో ఆయన కోరిక మేరకు ముంబైలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న కొడుకు అబ్దుల్‌ సలాం హరూల్‌ రషీద్‌(48)కి సమాచారం ఇచ్చారు.

ఈ నెల 22న అబ్దుల్‌ సలాం హరూల్‌ రషీద్‌ హైదరాబాద్‌కు వచ్చి తండ్రి బాగోగులు చూసుకుంటుండగానే ఈ నెల 23వ తేదీన తండ్రి హరూల్‌ రషీద్‌ మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తెల్లవారి 24వ తేదీన మధ్యాహ్నం తిరిగి ముంబై వెళ్లేందుకు సలాం సన్నద్ధమవుతుండగా కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఇంటి యజమాని అఫ్జల్‌ హుస్సేన్‌ బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సలాం మృతి చెందాడు. ఒక్క రోజు వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement
Advertisement