చిత్తూరు రూరల్: వలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనవచ్చని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలోకి వెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై మీడియా జేసీని ప్రశ్నించగా, వలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలోకి వెళ్లొచ్చని తెలిపారు. ఎన్నికలలో కూడా పోటీ చేయవచ్చని వివరించారు. సోషల్ మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. ప్రచారంలో పాల్గొన్నా వారిని ఆపే అధికారం ఎవరికీలేదని వివరించారు. అధికారులకు మాత్రం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాణిపాకం హుండీ ఆదాయం రూ.78లక్షలు
ఐరాల: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం రూ.78లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెంకటేశు తెలిపారు. ఆలయంలో గత 14 రోజుల హుండీ కానుకలను బుధవారం ఉదయం స్వామివారి ఆస్థాన మండపంలో లెక్కించగా బంగారం 14 గ్రాములు, వెండి 910 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.5వేలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.20 వేలు, విదేశీ కరెన్సీ 1,066 డాలర్లు, ఇంగ్లాండ్ 15 పౌండ్స్, ఆస్ట్రేలియా 50 డాలర్లు, మలేసియా 1 రింగిట్స్తో కలిపి రూ.78లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీవైఈఓ వాణి, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవ రెడ్డి, ధనంజయ, సూపరిటెండెంట్లు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కాణిపాకం ఎస్ఐకి అవార్డు
ఐరాల: కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్కు డీజీపీ కామిడేషన్ డెస్క్ అవార్డు లభించింది. ఎస్ఐ రామ్మోహన్ 2022లో అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట పోలీసుస్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వర్తించే సమయంలో కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపి, అక్రమ రవాణా అరికట్టారు. రెండు హత్య కేసుల్లో డిటెక్ట్ చేసి, ప్రాపర్టీలను రికవరీ చేయడంతో ఆయనకు బుధవారం డీజీపీ కామిడేషన్ డెస్క్ అవార్డు లభించింది. దీనిపై పోలీసు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు.