పాడేరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు
పాడేరు (హుకుంపేట): రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. గురువారం పాత పాడేరులో ఎన్నికల పరిశీలకులు శ్రీకాంత్రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో జగనన్న గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. అదే విషయాన్ని ప్రజలకు వివరించి మద్దతు కోరాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారంపైన దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల పరిశీలకుడు శ్రీకాంత్రాజు మాట్లాడుతూ మండలంలోని 26 పంచాయతీలను ఆరు సెక్టార్లుగా విభజించామన్నారు. ఒక సెక్టార్కు ఐదు నుంచి ఆరు పంచాయతీలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, బూత్, సచివాలయ కన్వీనర్లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. పంచాయతీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని సెక్టార్ ఇన్చార్జిలుగా నియమించినున్నట్టు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో మాదిరిగా పార్టీ విజయానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఐదేళ్లలో పాడేరు నియోజకవర్గంలో రూ.1300 కోట్లతో అభివృద్ధి చేపట్టామన్నారు. ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఎంపీపీ సొనారి రత్నకుమారి, మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, వైస్ ఎంపీపీ కనకాలమ్మ, ఏఎంసీ చైర్మన్ సూరిబాబు, పార్టీ జోనల్ ఇన్చార్జి కే.విశ్వ, మాజీ ఎంపీపీ రమణమూర్తి,సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.