అడ్డతీగల: అంతరించిపోతున్న ఆదివాసీ ఆయుర్వేద వైద్యానికి గత వైభవం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. అడ్డతీగల శివారులో లయ స్వచ్ఛంద సంస్థకు అనుబంధమైన ఆదివాసీ వన మూలిక వనరుల కేంద్రం (వనంతరం)లో పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీ వన మూలికా వైద్యుల సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో మొదటి రోజు 200 మంది ఆదివాసీ వైద్యులు పాల్గొన్నారు. వన మూలికలకు చెందిన వివిధ రకాల మొక్కలు, దుంప, విత్తన జాతులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ చాలా మంది ప్రజలు కరోనా మహమ్మారి సమయంలో సంప్రదాయ ఆయుర్వేద వైద్యంపై ఆధారపడ్డారన్నారు. కరోనా తర్వాత ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. వన మూలికా వైద్యాన్ని విస్తృతంగా వ్యాప్తిలోనికి తీసుకురావడం ద్వారా ఆదివాసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎన్నో ఔషధ గుణాలు
ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగిన మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఏపీ మెడిషినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ బోర్డ్ సీఈవో డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ప్రకృతి వరప్రసాదినిగా ఉండే వన మూలికా మొక్కలను ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేస్తే మంచి పలితాలు వస్తాయన్నారు.వనమూలికా వైద్యుల సదస్సులు ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమన్నారు.ఆదివాసీలు పత్తి, పొగాకుకు బదులు ఔషధ మొక్కల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు.
అవగాహన కల్పించాలి
సంప్రద్రాయ వైద్య విజ్ఞానంపై రాబోయే తరానికి అవగాహన కల్పించాలని ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ కోఆర్డినేటర్ డాక్టర్ వరలక్ష్మి అన్నారు. ఔషధ మొక్కలు పెంచడంతో పాటు ఈ వైద్య విజ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మూలికా వైద్యులకు గుర్తింపు పత్రాలు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. వివిధ అంశాలపై పలువురు మాట్లాడారు.ఆయుష్ మెడికల్ ఆఫీసర్ దేశీయ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సబ్బిన శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, లయ స్వచ్ఛంద సంస్థ ఏరియా కోఆర్డినేటర్ జి.బుల్లియ్య తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
ఆడ్డతీగలలో ఆదివాసీ వన
మూలికా వైద్యుల సమ్మేళనం