ఎగసిన అభిమానం | Sakshi
Sakshi News home page

ఎగసిన అభిమానం

Published Thu, Nov 16 2023 1:02 AM

- - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: క్రికెట్‌ అభిమానుల కేరింతల ముందు సాగర ఘోష చిన్నబోయింది. వాంఖడే మైదానంలో సిక్సర్లు, ఫోర్ల మోత మోగుతుంటే.. తీరంలో అభిమానుల కోలాహలం అంబరాన్ని తాకింది. క్రికెట్‌ అభిమానులతో విశాఖ తీరం జనసంద్రంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను చివరి వరకు తనివితీరా ఆస్వాదించారు. భారత్‌–న్యూజిలాండ్‌ల మధ్య బుధవారం జరిగిన ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను ఆర్కే బీచ్‌లో ఆంధ్రా క్రికెట్‌ సంఘం భారీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేసింది. తొలిసారిగా అభిమానుల ప్రాంగణం పేరిట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఫ్లడ్‌లైట్లతో పాటు అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక టెంట్లు, ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కేరళ సంప్రదాయ వాయిద్య బృందాలను ఏర్పాటు చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఇంతమంది మధ్య మ్యాచ్‌ చూస్తే.. మైదానంలో మ్యాచ్‌ను చూసిన ఫీల్‌ కలిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. విరాట్‌ కోహ్లీ 50వ శతకం పూర్తి చేసిన సందర్భంలో అయితే కింగ్‌ కోహ్లీ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. భారత్‌ జట్టు అఖండ విజయం సాధించి ఫైనల్‌కు చేరడంతో విశాఖ నగర ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

1/2

2/2

Advertisement
Advertisement