breaking news
Underground Drip
-
భూగర్భ డ్రిప్తో కరువుకు పాతర!
⇒ కొత్త పోకడ ⇒ వాతావరణ మార్పుల నేపథ్యంలో బిందు సేద్యంలో కొత్తపోకడ.. భూగర్భ డ్రిప్కు ఆదరణ ⇒ తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటకు రక్షణ ⇒ సాధారణ డ్రిప్తో కన్నా.. భూగర్భ డ్రిప్తో అదనపు ప్రయోజనాలు ⇒ ఉద్యాన తోటలతోపాటు మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలకూ భూగర్భ డ్రిప్ అనుకూలమే.. ⇒ ఇజ్రాయెల్ సాంకేతికతతో భూగర్భ డ్రిప్తో వరిని సాగు చేస్తున్న కాలిఫోర్నియా రైతులు ⇒ వరి, గోధుమ సాగులో భూగర్భ డ్రిప్ వాడకంపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్షాకాలంలోనూ తిష్టవేస్తున్న కరువు రైతుల ఆశలను నిలువునా కాటేస్తున్నది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. భూతాపం పెరుగుతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా కరువు రక్కసి విస్తరిస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటేటా తామరతంపరవుతూ ఉంది. మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు కాటకాల పాలవ్వగా, 2010వ దశకంలో (2017 జూన్ నాటికి) 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యవసాయ కేంద్రాలైన కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను సైతం కరువు వణికిస్తోంది. ఈ పూర్వరంగంలో మరింత సమర్థవంతంగా నీటి వినియోగంపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి. రసాయనిక ఎరువులతో సాగయ్యే ఏక పంటల కన్నా... ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే మిశ్రమ పంటలకు కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం మన రైతులకూ అనుభవంలో ఉన్న సంగతే. పంట మొక్కలు, పండ్ల చెట్ల మొదళ్ల దగ్గర్లో భూమిపైన డ్రిప్లు, స్ప్రింక్లర్లతోపాటు.. రెయిన్గన్లు ఏర్పాటు చేసుకొని కొందరు రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత తక్కువ నీటితో పంటలు పండించ వీలయ్యే ‘భూగర్భ డ్రిప్’ పద్ధతి ముందుకు వస్తోంది. ఎడారిలోనూ సమర్థవంతంగా నీటి వినియోగంపై పరిశోధనలో ముందంజలో ఉన్న ఇజ్రాయెల్ భూగర్భ డ్రిప్ వాడకంలోనూ పైచేయి సాధించింది. ఏళ్ల తరబడి నిరవధికంగా సాగులో ఉండే ఉద్యాన తోటల్లో వినియోగించడం అమెరికాలోనూ అతికొద్ది మంది రైతుల అనుభవంలో ఉన్నదే. కరువు సమస్య తరచూ ఎదురుకాటంతో డెల్టా ప్రాంతాల్లోనూ పంటలకు సాగు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో.. కొద్ది నెలల్లో కోతకొచ్చే మొక్కజొన్న, సోయా చిక్కుళ్లను ఇప్పటికే భూగర్భ డ్రిప్తో సాగు చేసి.. కరువును సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు దిగుబడులనూ గణనీయంగా పెంచుకోగలిగినట్లు సమాచారం. భూగర్భ డ్రిప్ సంగతులు.. ♦ భూగర్భ డ్రిప్ అంటే.. పంట మొక్కలు, పండ్ల చెట్లకు నేలపైన కాకుండా.. వేర్ల దగ్గరలో నీటి తేమను అవసరం మేరకు తగుమాత్రంగా అందించే వ్యవస్థ. ముఖ్యంగా వరి సాగులో ఎకరానికి లక్షల లీటర్ల నీటిని ఆదా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది. ♦ భూమి లోపల పంటను బట్టి 4 నుంచి 30 అంగుళాల లోతులో శాశ్వత డ్రిప్ను ఏర్పాటు చేస్తారు. నీటి తేమ వేర్లకు క్రమం తప్పకుండా అందుతుంది. మట్టిలో తేమ పరిస్థితిని సెన్సార్ల ద్వారా గమనిస్తూ.. పంటకు అవసరమైనప్పుడు తగుమాత్రంగా నీటిని అందిస్తారు. ♦ ఏ రకం పంట వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్నదాన్ని బట్టి.. ఆ పొలంలో మట్టి గట్టిపడే లక్షణాన్ని బట్టి.. భూమికి ఎన్ని అంగుళాల లోతున డ్రిప్ పైపులు, లైన్లు వేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు. ♦ దీన్ని ప్రతి ఏటా మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి వేసుకుంటే పదేళ్లపాటు కదిలించాల్సిన అవసరం ఉండదట. కరువొచ్చినా ఉన్న నీటితోనే మంచి దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి.. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమేనని చెబుతున్నారు. ♦ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు పొలంలో తిరగడం వల్ల భూగర్భ డ్రిప్కు ఎటువంటి నష్టమూ ఉండదు. ♦ రెయిన్ గన్ల ద్వారా ఖర్చయ్యే నీటిలో సగంతోనే భూగర్భ డ్రిప్ ద్వారా పంటలు పండించవచ్చు. ♦ వరి తదితర పంట విత్తనాలు మొలకెత్తడానికి మొదట ఒక తడి పెడతారు. మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. పొలంలో భూమి పై భాగం పొడిగానే ఉంటుంది. ఫలితంగా కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ♦ మట్టిలో నీటి తేమ ఎంత లోతులో ఎంత ఉంది? అనేది ఎప్పటికప్పుడు గమనించి రైతు మొబైల్ లేదా కంప్యూటర్కు సెన్సార్లు సమాచారం ఇస్తాయి. నీరు పంటలకు అవసరం లేనంత కిందికి వెళ్తున్నదో లేదో తెలుసుకోవడానికి భూగర్భంలో అక్కడక్కడా సెన్సార్లు పెడతారు. ♦ భూగర్భ డ్రిప్తో అతి తక్కువ నీటితో, కరువు కాలంలోనూ పంట తీయవచ్చు. అయితే, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అధిక ఖర్చుతో కూడిన పనే. ఎకరానికి రూ. 35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా. ♦ అమెరికాలోని మిన్నొసోట రాష్ట్రానికి చెందిన మొక్కజొన్న రైతు బ్రియాన్ వెల్డె తన 58 ఎకరాల పొలంలో భూగర్భ డ్రిప్ను గత ఏడాదిగా వాడుతున్నారు. మొక్కజొన్న రైతుల సంఘం ఆర్థిక సాయంతో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 5 అడుగుల దూరంలో 14 అంగుళాల లోతులో.. 8 అంగుళాల వ్యాసార్ధం గల భూగర్భ డ్రిప్ పైపులను అమర్చారు. వీటి నుంచి డ్రిప్ టేపుల ద్వారా నీటిని మొక్కజొన్న మొక్కల వేర్లకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జూలైలో నీటి ఎద్దడి కాలంలోనూ తేలికపాటి ఇసుక నేలలో మొక్కజొన్న పంటను భూగర్భ డ్రిప్ వల్లనే కాపాడుకోగలిగానని, ఇదొక ఆశావహమైన ప్రత్యామ్నాయమని బ్రియాన్ వెల్డె అంటున్నారు. తొలుత ఎక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది రైతుకు లాభదాయకమేనన్నారు. ♦ రసాయనిక వ్యవసాయంలోనైనా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయంలోనైనా భూగర్భ డ్రిప్ లైన్ల ద్వారా ద్రవ రూప ఎరువులను అందిస్తూ.. మంచి దిగుబడులు పొందడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ♦ అంతర పంటలు సాగు చేసుకోవాలనుకుంటే అందుకు అనుగుణంగా అదనపు భూగర్భ డ్రిప్ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంటల వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదనతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు భూగర్భ డ్రిప్తో అధిక ప్రయోజనం చేకూరవచ్చు. ♦ మట్టి ఉష్ణోగ్రతలు, నేల స్వభావం, పంటల స్వభావం తదితర అంశాలను బట్టి భూగర్భ డ్రిప్ ప్రభావశీలత ఆధారపడి ఉంటుంది. బిందు సేద్యంలో ముందుకొస్తున్న ఈ కొత్తపోకడపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ దిశగా దీక్షగా కదిలితే కరువు పీడిత రైతుల్లో కొందరికైనా మేలు కలుగుతుంది. భూగర్భ డ్రిప్తో వరి, గోధుమ సాగుపై పంజాబ్ వర్సిటీ అధ్యయనం! పంజాబ్లోని 138 నీటి బ్లాక్లకు గాను 110 బ్లాక్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గోధుమ సాగులో డ్రిప్ వాడకంపై పరిశోధనలు చేపట్టింది. రెండేళ్ల క్షేత్రస్థాయి పరిశోధన అనంతరం.. రబీలో డ్రిప్తో గోధుమ పంటను సగం నీటితోనే సాగు చేయవచ్చని డాక్టర్ ఎ. ఎస్. బ్రార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. మొదట 4 అంగుళాల నీటితో పొలంలో నీటిని పారగట్టారు. గోధుమ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా 5 విడతలుగా (కేవలం 20% నీటితోనే) నీటి తడులు ఇచ్చారు. డ్రిప్ను వాడటం ద్వారా 15 రోజులు ముందుగా గోధుమ విత్తుకోవడం వీలవుతుంది. తద్వారా 10% దిగుబడిని పెంచే అవకాశం ఉందని ఆయన ఇటీవల ప్రకటించారు. రెండేళ్లుగా డ్రిప్పై అధ్యయనం చేసిన డా. బ్రార్ బృందం ఇప్పుడు భూగర్భ డ్రిప్పై దృష్టిపెట్టింది. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడానికి ఇటీవలే నిధులు విడుదలయ్యాయని డా. బ్రార్ తెలిపారు. రబీలో గోధుమతోపాటు, ఖరీఫ్లో వరి పంటను కూడా భూగర్భ డ్రిప్ ద్వారా పండించడానికి అవకాశాలున్నాయన్నారు. వరి, గోధుమ సాగుకు భూగర్భ డ్రిప్ను వాడే పద్ధతిని రైతులకు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండేళ్లలో సిఫారసు చేసే అవకాశాలున్నాయి. కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్తో వరి సాగు! అత్యధిక పరిమాణంలో సాగు నీరు అవసరమయ్యే వరి పొలాల్లో సైతం భూగర్భ డ్రిప్ వాడకానికి అమెరికాలోని కాలిఫోర్నియా రైతులు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో శ్రీకారం చుట్టారు. వరి పంటను భూగర్భ డ్రిప్తో పండించే సాంకేతికతపై విశేష పరిశోధనలకు ఇజ్రాయెల్లోని బెన్–గురియన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. వరి సాగుకు పేరొందిన మూడు అమెరికన్ రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. సేంద్రియ వరి సాగులో పేరుగాంచిన ‘లుండ్బెర్గ్ ఫామిలీ ఫామ్స్’ సంస్థ బెన్–గురియన్ విశ్వవిద్యాలయంతో గత ఏడాది ఒప్పందం చేసుకొని, తొట్టతొలిగా వంద ఎకరాల్లో భూగర్భ డ్రిప్తో వరి సాగుకు ఉపక్రమించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
భూగర్భ డ్రిప్తో తోటలు పదిలం!
► చెట్టుకు నీరు కాదు.. వేర్లకు నీటి తేమ ఇస్తే చాలంటున్న స్వచ్ఛంద సంస్థ – సి.ఇ.సి. ► స్వల్ప ఖర్చుతోనే పండ్ల తోటలు, కూరగాయ తోటలకు తీవ్ర కరువు, వడగాడ్పుల నుంచి రక్షణ ► సాధారణ డ్రిప్ ద్వారా ఖర్చయ్యే నీటిలో 75% నీటిని భూగర్భ డ్రిప్ ఆదా చేస్తుంది ► అనంతపురం జిల్లాలో నేల ఉష్ణోగ్రత.. నీటి ఆవిరి అత్యధికం: ఎఫ్.ఎ.ఒ. ► తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ భూగర్భ డ్రిప్తో పండ్ల తోటలను రక్షించుకుంటున్న రైతులు వాతావరణ మార్పుల వల్ల భూతాపం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉంది. దీంతో, పండ్ల తోటలను కాపాడుకోవడం రైతులకు కనాకష్టమవుతున్నది. డ్రిప్ ద్వారా ఇచ్చే నీరు చెట్లు వేళ్ల దగ్గరకు చేరకుండానే ఆవిరైపోతున్నది. చెట్లకు పైపుల ద్వారా వారం పది రోజులకోసారి, ట్యాంకర్ల ద్వారా 20 రోజులకోసారి నీరిచ్చినా.. 2–3 రోజుల్లోనే తేమ ఆరిపోతున్నది. వరుసగా ఆరోసారి కరువు ప్రాంతంగా ప్రకటితమైన అనంతపురం, ప్రకాశం తదితర తీవ్ర కరువు పీడిత ప్రాంతాల్లో ముదురు మామిడి తోటలు సైతం నిలువునా ఎండిపోతుండడంతో రైతులు తిరిగి కోలుకోలేనంతగా నష్టపోతున్నారు. పాతికేళ్ల తోటలే ఎండిపోతున్నాయి.. ఎడతెగని కరువుతో ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లెలో రైతుల మామిడి మానులే ఎండిపోతున్నాయి. తిప్పారెడ్డి అనే రైతు ఏడెకరాల మామిడి తోట నిలువునా ఎండిపోయింది. 26–30 ఏళ్ల నాటి తోట ఆయనది. నాలుగు బోర్లు వేయగా, గతంలోనే 3 బోర్లు ఎండిపోయాయి. తిప్పారెడ్డి గత ఏడాది సుమారు రూ. లక్షన్నర ఖర్చుతో ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోసి తోటను బతికించుకున్నాడు. ఇప్పుడు నాలుగో బోరు కూడా ఎండిపోయింది. చేతిలో డబ్బు లేక ఈ ఏడాది ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోయలేకపోయాడు తిప్పారెడ్డి. తోట నిలువునా ఎండిపోయింది. కోటి ఆశలతో పెంచుకున్న తోట మంచి కాపు ఇచ్చే వయసులో నిలువునా ఎండిపోతే.. చూడడానికి మనస్కరించక తిప్పారెడ్డి తన ఎండిపోయిన తోట దగ్గరకు కూడా రాలేని దైన్య స్థితి నెలకొంది. ఎందరో మామిడి, బత్తాయి తోటల రైతుల పరిస్థితి ఇదే మాదిరిగా అగమ్యగోచరంగా మారింది. ఈ విపత్తును ఎదుర్కొనే మార్గమే లేదా? ఉంది.. డ్రిప్తో నీటిని నేలపైన కాదు, వేళ్ల దగ్గర ఇవ్వటమే పరిష్కారం! మట్టిలో అడుగు లోతున వేర్లకు నీటి తేమను అందిస్తే తోటలను నిక్షేపంగా కాపాడుకోవచ్చని హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ (సి.ఇ.సి.) అనే స్వచ్ఛంద సంస్థ నిరూపిస్తోంది. డ్రిప్కు ఖర్చయ్యే నీటిలో పావు వంతు నీటితో, చెట్టుకు రూ. 50 ఖర్చుతోనే ఈ ‘భూగర్భ డ్రిప్’ను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతోంది. అనంతపురం, ప్రకాశం, రంగారెడ్డి, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో కొందరు రైతులు ఈ పద్ధతిలో పండ్ల తోటలను రక్షించుకుంటూ పచ్చగా ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఎండాకాలం తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చి పండ్ల తోటలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారి ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట ప్రాంతాల్లో తోటల యాజమాన్యం రైతులకు ఏటేటా సమస్యాత్మకంగా మారుతోంది. అనంతపురం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనప్పుడు మట్టి ఉష్ణోగ్రత (సాయిల్ టెంపరేచర్) అత్యధికంగా 66–67 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటున్నది. ఏప్రిల్/మే నెలల్లో రోజుకు 20–25 మిల్లీమీటర్ల నీరు అత్యధికంగా ఆవిరైపోతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది.పండ్ల తోటలన్నిటికీ డ్రిప్ ఉంది. అయితే, బోర్లు చాలా చోట్ల ఎండిపోయాయి లేదా బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. డ్రిప్ ద్వారా చెట్ల దగ్గర భూమి పైన పడిన నీటిలో చెట్ల వేళ్లకు అందుతున్నది చాలా తక్కువ. కొందరు రైతులు పైపులతో వారం లేదా 10 రోజులకు ఒకసారి ప్రతి చెట్టుకు 200–250 లీటర్ల నీరు ఇస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చి మామిడి చెట్లను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్ను రూ. 600 ఖర్చుతో తెచ్చి 8 చెట్లకు పోస్తున్నారు. ట్యాంకరు ఖర్చులో 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. 20 రోజులకోసారి ట్యాంకరు నీటిని పోస్తున్నారు. ఎక్కువ నీరు ఒకేసారి పోయడం వల్ల వేళ్లకు తెగుళ్లు కూడా వస్తున్నాయి. తోటలకు పైన చెప్పుకున్న ఏ పద్ధతిలో నీరిస్తున్నప్పటికీ.. అధిక పగటి ఉషోగ్రత, అధిక నేల ఉష్ణోగ్రత కారణంగా 3–4 రోజుల్లోనే నేలలో తేమ పూర్తిగా ఆరిపోతున్నది. ఈ సమస్యకు సులువైన, సమర్థవంతమైన పరిష్కారం భూగర్భ డ్రిప్. స్వల్ప ఖర్చుతో రైతులు ఏర్పాటు చేసుకోగలిగినది కావడం దీని మరో ప్రత్యేకత. చెట్టుకు రూ. 50 ఖర్చుతోనే.. భూగర్భ డ్రిప్ మట్టిలో తేమను మాయిశ్చర్ మీటర్ ద్వారా తెలుసుకుంటూ అవసరం మేరకు నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. నీటిని ఇచ్చినప్పుడు మట్టిలో తేమ 99 శాతం ఉంటుంది. ఈ తేమ ఎంత త్వరగా ఆరిపోతుందో నేల స్వభావం, భూమిలో సేంద్రియ పదార్థంపై ఆధారపడి ఉంటుంది. మట్టిలో నీటి తేమ 40–60 శాతానికి తగ్గినప్పుడు.. భూగర్భ డ్రిప్ ద్వారా మళ్లీ నీటిని తగుమాత్రంగా అందిస్తే సరిపోతుంది. పెద్ద చెట్టుకు మహా అయితే 50 రూపాయల ఖర్చుతో, అతి తక్కువ నీటితో కరువును తట్టుకునే చక్కని భూగర్భ డ్రిప్ను ఏర్పాటు చేసుకోవచ్చంటే ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. కరువు ప్రాంతాల్లో తోటలను తక్కువ నీటితోనే రక్షించుకోవడానికి ఈ పద్ధతి తోడ్పడుతుందని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. అనంతపురం, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాలతోపాటు.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, ద్రాక్ష తోటలు, కూరగాయ తోటల రైతులు భూగర్భ డ్రిప్ పద్ధతిని అనుసరిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారని గోపాల్ తెలిపారు. నీరు నేల మీద కాదు.. నీటి తేమను పీచు వేళ్ల దగ్గర నేల లోపల ఇవ్వాలన్నది సమర్థవంతంగా సాగు నీటి వినియోగానికి దోహదపడే విప్లవాత్మక ఆలోచన. డ్రిప్తో పోల్చితే 25% నీటితోనే మండే ఎండల్లోనైనా తోటలను బతికించుకోడానికి భూగర్భ డ్రిప్ ఉపకరించడం హర్షదాయకం. ‘భూగర్భ డ్రిప్ ’ పనిచేసేదెలా? నీటి కరువు సమస్యకు సి.ఇ.సి. సూచిస్తున్న చక్కని పరిష్కారం ఏమిటంటే.. భూగర్భ డ్రిప్ పద్ధతి. సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్(స్వర్) అని దీన్ని పిలుస్తున్నారు. మొక్క లేదా చెట్టు వేర్లకు అవసరానికి తగినంత నీటి తేమను అందించడం ద్వారా అతి తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని సాగు చేయగలగడమే ‘స్వర్’ ప్రత్యేకత. సాధారణ డ్రిప్ లైనుకు అదనంగా అగ్గిపెట్టె అంతటి పరికరాన్ని (బరీడ్ మోయిశ్చర్ డిఫ్యూజర్–బి.ఎం.డి.) జత చేసి, దాన్ని మట్టిలో పెట్టి కప్పేయాలి. చెట్టు ఎంత పెద్దదైనా నీటి తేమను, పోషకాలను గ్రహించేది పీచు వేళ్లు (యాక్టివ్ రూట్స్) మాత్రమే. చెట్టు దగ్గర్లో అడుగు లోతున మట్టి తవ్వి ఈ పరికరాన్ని పెట్టి మట్టి కప్పేయాలి. ఈ భూగర్భ డ్రిప్ పరికరం ఖరీదు మహా అయితే 12.50 రూపాయలు. పెద్ద చెట్టు చుట్టూతా 4 లేదా 5 పెడితే సరిపోతుంది. సాధారణ డ్రిప్ ద్వారా ఇచ్చే నీటిలో 25% నీటితోనే ఈ పద్ధతిలో నిరంతరాయంగా, తగుమాత్రంగా నీటి తేమను నేరుగా వేళ్లకు అందిస్తూ చెట్లను సునాయాసంగా బతికించుకోవచ్చు. పచ్చని చిగుళ్లు వేసేలా చక్కగా చూసుకోవచ్చు. ఎంత పెద్ద చెట్లనైనా బతికించుకోవచ్చు! సాగు నీటి గురించి మన ఆలోచన మారాలి. ‘నేల పైన’ ఎంత ఎక్కువ మోతాదులో నీరు ఇచ్చామని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. మేం చెబుతున్నదేమిటంటే.. చెట్టుకు నీరెంత ఎక్కువ ఇచ్చామని కాదు, ‘వేరుకు తేమ’ను ఎంత నిరంతరాయంగా ఇచ్చామని ఆలోచించాలి. 25–30 ఏళ్ల మామిడి చెట్టుకయినా సరే 12 నుంచి 28 అంగుళాల (సగటున అడుగున్నర) లోతులోనే నీటిని, పోషకాలను చురుగ్గా తీసుకునే వేళ్లు ఉంటాయి. పీచు వేర్లు ఉండే ప్రాంతంలో 12 అంగుళాల లోతులో భూగర్భంలో నీటి తేమను నిదానంగా అందించే పరికరాన్ని(బరీడ్ మోయిశ్చర్ డిఫ్యూజర్–బి.ఎం.డి.) ఏర్పాటు చేసి, దాన్ని డ్రిప్ లైన్తో అనుసంధానం చేస్తే చాలు. పీచు వేర్ల దగ్గరలో నీటి తేమను కొంచెం కొంచెంగా అందించడం ద్వారా మట్టిలో పోషకాలను వేర్లకు అందించే సూక్ష్మజీవరాశి చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా చెట్లకు మంచి పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి, ఎన్నో ఏళ్లుగా కొండంత ఆశతో పెంచుకుంటున్న చెట్లు దెబ్బతినకుండా బాగుంటాయి. గతంలో భూమిలో కుండను పాతిపెట్టి, అందులోకి డ్రిప్ ద్వారా నీటిని వదిలేవాళ్లం. ఇప్పుడు కుండకు బదులుగా బి.ఎం.డి. పరికరాన్ని వాడుతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి తోటలు సాగు చేస్తున్న చిన్న రైతులతో కలిసి పనిచేస్తూ ఈ వినూత్న పద్ధతిని ఆవిష్కరించాం, ఇప్పటికీ మెరుగుపరుస్తూ ఉన్నాం. ఈ ఆవిష్కరణ మా సంస్థకు రెండు అంతర్జాతీయ అవార్డులు తెచ్చిపెట్టింది. – కె. ఎస్. గోపాల్, డైరెక్టర్ (098481 27794), భూగర్భ డ్రిప్ పద్ధతి ఆవిష్కర్త, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సి.ఇ.సి.), హైదరాబాద్ నాలుగు రోజులైనా తేమ ఉంటున్నది.. కరువు వల్ల ఈ ఏడాది మా గ్రామంలో 20–25 ఏళ్ల మామిడి చెట్లు కూడా ఎండిపోయాయి. నా మామిడి తోటలో బోరుకు సోలార్ మోటారు పెట్టాను. ‘స్వర్’ భూగర్భ డ్రిప్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల తక్కువ నీటితోనే చెట్లను బతికించుకోగలుగుతున్నాం. నీరు ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత కూడా వేళ్ల దగ్గర తేమ ఉంటున్నది. – ఎం. బాబూ ప్రసాద్ (85009 86024), బుచ్చయ్యగారిపల్లె, బుక్కపట్నం మం. అనంతపురం జిల్లా మేలుగానే ఉంది..! మూడెకరాల మామిడి తోటలో 225 మొక్కలున్నాయి. మొక్కలు నాటి రెండున్నరేళ్లు అయింది. బోరులో నీళ్లు ఆగి ఆగి వస్తున్నాయి. తోటలో 3 డ్రమ్ములు పెట్టాను. పైపులతో నీరు పెట్టేవాడిని. నెల క్రితం భూమి లోపల డ్రిప్పు పెట్టుకున్నాను. వారానికోసారి నీళ్లు వదులుతున్నాను. పైకి తేమ కనపడదు. దీని వల్ల తక్కువ నీటితోనే మా తోటకు మేలుగానే ఉంది. చెట్లు పచ్చగా ఇగుర్లు వచ్చాయి. – ఎం. వెంకటనారాయణ (96186 46423), బుక్కపట్నం, అనంతపురం జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్