breaking news
strong growth
-
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్లాండ్పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్ బలంగా.. డిసెంబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో కొంత పెరిగినప్పటికీ, ఆర్బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్ బాండ్లు, ఎఫ్డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్బీఐ బులెటిన్ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్లో నికర ఎఫ్డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది. -
అంతర్జాతీయ అనిశ్చితిలోనూ భారత్ పురోగతి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆర్థికవేత్తలలో అధికశాతం మంది 2025లో బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. అయితే కొంత మందగమన సంకేతాలు ఉన్నప్పటికీ, భారతదేశం బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు విడుదలైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ అవుట్లుక్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన ఆర్థికవేత్తలో 56 శాతం 2025లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటాయని భావిస్తున్నారు. కేవలం 17 శాతం మెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2025లో భారత్, అమెరికాలు మాత్రం చక్కటి పురోగతి సాధిస్తాయని అంచనా. యూరోప్ ఎకా నమీ బలహీనంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయడ్డారు. చైనా వృద్ధిపై కూడా అనుమానాలే వ్యక్తం మయ్యాయి. -
ఫార్మా అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా రంగం గత నెల(మార్చి)లో పటిష్ట వృద్ధిని సాధించింది. 2022 మార్చితో పోలిస్తే 13 శాతం పురోగతిని అందుకుంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ రెండంకెల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు ప్రధానంగా మూడు రకాల చికిత్సలు దోహదపడ్డాయి. నిజానికి గతేడాది మార్చిలో ఫార్మా అమ్మకాలు 2 శాతం నీరసించాయి. కాగా.. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం ఈ ఫిబ్రవరిలో 20 శాతంపైగా జంప్చేశాయి. దీంతో 2022–23లో మొత్తం ఫార్మా విక్రయాల్లో 9.3 శాతం పురోభివృద్ధి నమోదైంది. అంతక్రితం ఏడాది 14.6 శాతం పుంజుకోగా.. 2020–21లో అమ్మకాలు 2.1 శాతమే బలపడ్డాయి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రయివేట్ వెల్లడించిన వివరాలివి. యాంటీఇన్ఫెక్టివ్స్, శ్వాససంబంధ(రెస్పిరేటరీ), నొప్పి నివారణ(పెయిన్ మేనేజ్మెంట్) విభాగాల నుంచి 30% ఆదాయం నమోదైనట్లు ఇండియా రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణనాథ్ ముండే పేర్కొన్నారు. ఇతర విభాగాలు అంతంతమాత్ర అమ్మకాలు మాత్రమే సాధించినప్పటికీ టాప్–10 థెరపీల నుంచి పరిశ్రమ ఆదాయంలో 87 శాతం లభించినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలోనూ 10–11 శాతం వృద్ధికి వీలున్నట్లు ఈ సందర్భంగా అంచనా వేశారు. జూన్ నుంచీ స్పీడ్ గతేడాది(2022) జూన్ నుంచి ఫార్మా రంగంలో రికవరీ ఊపందుకున్నట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతికూల అమ్మకాలు నమోదుకాగా.. 2022 జూన్ నుంచి 2023 మార్చి కాలంలో 12.6 శాతం పురోగతిని సాధించాయి. అక్టోబర్, జనవరిల్లో అమ్మకాలు కొంతమేర మందగించినప్పటికీ పటిష్ట వృద్ధి నమోదైంది. పరిమాణంరీత్యా అమ్మకాలు 4.5 శాతం పుంజుకోగా.. ధరలు 5.6 శాతం మెరుగుపడ్డాయి. కొత్త ప్రొడక్టుల విడుదల 2.9 శాతం మెరుగుపడింది. విభాగాలవారీగా ఏఐవోసీడీ గణాంకాల ప్రకారం 2023 మార్చిలో రెస్పిరేటరీ విభాగం 50 శాతం జంప్చేయగా.. యాంటీఇన్ఫెక్టివ్స్ అమ్మకాలు 32 శాతం ఎగశాయి. పెయిన్ మేనేజ్మెంట్ 18 శాతం వృద్ధి చూపింది. ఈ బాటలో గ్యాస్ట్రోఎంటరాలజీ, విటమిన్ల విభాగాలు 8 శాతం చొప్పున బలపడ్డాయి. గుండెసంబంధ(కార్డియాలజీ), మెదడు, నాడీసంబంధ(సీఎన్ఎస్) థెరపీ అమ్మకాలు 6 శాతం, చర్మవ్యాధులు 4 శాతం, స్త్రీసంబంధ ప్రొడక్టుల విక్రయాలు 3 శాతం చొప్పున పెరిగాయి. అయితే యాంటీడయాబెటిక్ విక్రయాలు 2 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి. కంపెనీల జోరిలా ఏఐవోసీడీ వివరాల ప్రకారం మార్చిలో కొన్ని ఫార్మా కంపెనీలు మార్కెట్ను మించి వృద్ధిని చూపాయి. ఇండొకొ రెమిడీస్ 28 శాతం, సిప్లా, ఎఫ్డీసీ 27 శాతం, అలెంబిక్ ఫార్మా 24 శాతం, గ్లెన్మార్క్ 22 శాతం చొప్పున పురోగతిని సాధించాయి. ఇక అబాట్ ఇండియా, ఆల్కెమ్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జీఎస్కే ఫార్మా అమ్మకాల్లో 14–18 శాతం మధ్య వృద్ధి నమోదైంది. ఇతర సంస్థలలో ఇప్కా ల్యాబ్ 13 శాతం, టొరెంట్ ఫార్మా, లుపిన్ 9 శాతం, ఎరిస్ లైఫ్సైన్సెస్ 7 శాతం, అజంతా ఫార్మా, జేబీ కెమ్, జైడస్ లైఫ్సైన్సెస్ అమ్మకాలు 4–5 శాతం స్థాయిలో బలపడ్డాయి. సన్ ఫార్మా, ఫైజర్ అమ్మకాలు 3–2 శాతం పుంజుకోగా, గతేడాది మార్చితో పోలిస్తే సనోఫీ ఇండియా అమ్మకాలు వార్షికంగా 9 శాతం నీరసించాయి. -
వచ్చే ఏడాది వృద్ధి పరుగులు!
దేశీయ వినిమయమే దన్ను...మోర్గాన్ స్టాన్లీ అంచనా ముంబై: వినిమయం దన్నుగా భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2016-17) పటిష్ట వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను ప్రముఖ వాల్స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. సంస్థ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు... ♦ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వాస్తవ వడ్డీరేటు సానుకూలంగా మారడం వంటి అంశాల నేపథ్యంలో వినియోగం బలపడనుంది. 1998 నుంచి 2002 వరకూ సాగిన రికవరీ సైకిల్కన్నా మంచి వృద్ధి తీరు ఉంటుంది. ♦ ముఖ్యంగా ప్రైవేటు వినియోగం భారీగా పెరగడానికి 7వ వేతన కమిషన్ అమలు ప్రధాన కారణం. కొత్త ఉపాధి సృష్టి అవకాశాలూ మెరుగుపడ్డం మరొక కారణం. ♦ వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు 5.8% ఉంటుంది. (కేంద్రానికి సంబంధించి 3.5%, రాష్ట్రాలకు సంబంధించి 2.3%). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఈ పరిమాణం 5.9 శాతం. గడచిన మూడేళ్లుగా ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు తగ్గుతూ రావడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతోంది. ♦ కార్పొరేట్ల అధిక రుణభారం, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు.. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసురుతున్న అంశాల్లో కీలకమైనవి.


