breaking news
State Information Commission
-
సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీచేయండి
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్(ఎస్ఐసీ)లలో పోస్టులను భర్తీచేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించడానికి ఎలాంటి సమాచార కమిషనర్లు అందుబాటులో లేరంటూ సమాచారహక్కు(ఆర్టీఐ)చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయండి. లేదంటే ఆర్టీఐ చట్టం నిరీ్వర్యమైపోతుంది’ అంటూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించింది. ‘ రాష్ట్ర సమాచార కమిషన్లలో అనుమతించిన పోస్టులు ఎన్ని? ఖాళీలెన్ని? పెండింగ్లో ఉన్న కేసులెన్ని? అనే వివరాలను నివేదించండి’ అని సిబ్బంది, శిక్షణ శాఖను ఆదేశించింది. -
ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ ఎంపిక
సాక్షి, అమరావతి : రాజ్యాంగ బద్దమైన రాష్ట్ర సమాచార కమిషన్కు ముఖ్య కమిషనర్ ఎంపిక ప్రక్రియను చంద్రబాబు సర్కారు అపహాస్యం చేసింది. తనకు గూఢచర్యం నెరిపే అధికారికి ఈ అత్యున్నత పదవికి కట్టబెట్టేందుకు నిబంధనలను తుంగలో తొక్కింది. రాష్ట్ర కేడర్కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జిల్లా జడ్జిలను కాదని.. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిని చీఫ్ కమిషనర్గా ఎంపిక చేసింది. ఇందుకోసం నిబంధనలను తుంగలో తొక్కింది. ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ను సైతం చిత్తుపేపర్లా మార్చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పారదర్శకతకు పాతరేస్తూ జైన్ ఎంపిక కోసమే ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేశారంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా విచారణలో ఉంది. అంతేకాదు.. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సమావేశానికి ప్రతిపక్ష నేతను ఆహ్వానించకుండానే చీఫ్ కమిషనర్ను ఎంపిక చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణ కేడర్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఏకే జైన్ను చీఫ్ కమిషనర్గా నియమించాలని బాబు సర్కారు ముందుగానే నిర్ణయించుకోవడంపై సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. చీఫ్ కమిషనర్ పోస్టుకు 20, కమిషనర్ పోస్టులకు 280 దరఖాస్తులు చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సమాచార హక్కు కమిషనర్లు, చీఫ్ కమిషనర్ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. దీంతో సమాచార హక్కు చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల పోస్టులను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అనంతరం 2017 ఆగస్టు 16వ తేదీన చీఫ్ కమిషనర్ పోస్టుకు, ముగ్గురు కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానిలో 2017 అక్టోబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అనంతరం అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్కు స్పందిస్తూ చీఫ్ కమిషనర్ పోస్టుకు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జిల్లా జడ్డీలు కలిపి మొత్తం 20 మంది, మూడు కమిషనర్ పోస్టులకు 280 మంది దరఖాస్తు చేశారు. ఏకే జైన్ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్ ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఒక సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ చేయాల్సి ఉంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన తేదీన సమావేశానికి రావాల్సిందిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన పాదయాత్రలో ఉన్నందున తన తరఫున ఒకరు వస్తారని ప్రభుత్వానికి సూచించారు. అయితే నిర్ధారించిన తేదీన సమావేశం జరగలేదు. తర్వాత 2018 జూలై 12న చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల ఎంపిక సమావేశం జరిగింది. ఇందులో చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ను, కమిషనర్లుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి బీవీ రమణకుమార్, అడ్వకేట్ ఎం.రవికుమార్, కట్టా జనార్దన్ను నియమించాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. అయితే చీఫ్ కమిషనర్గా ఎంపిక చేసిన ఏకే జైన్ అసలు దరఖాస్తు చేయలేదని, ఆయన నీతి ఆయోగ్లో సలహాదారుగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో ముగ్గురు కమిషనర్లను ఎంపిక చేస్తూ సంబంధిత ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ నర్సింహన్.. చీఫ్ కమిషనర్ లేకుండా కమిషనర్లు ఏం చేస్తారని, నోటిఫికేషన్ జారీచేసి కూడా చీఫ్ కమిషనర్ను ఎంపిక చేయకపోవడమేంటంటూ ఫైలును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై సీఎం చంద్రబాబు గవర్నర్తో మాట్లాడి మళ్లీ ఆ ఫైలును పంపగా గవర్నర్ ఆమోదం తెలిపారు. అనంతరం చీఫ్ కమిషనర్గా ఏకే జైన్ దరఖాస్తు చేసేందుకు వీలుగా గతంలో జారీచేసిన నోటిఫికేషన్ను కాదని.. కొత్తగా 2018 ఆగస్టు 24వ తేదీన మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గతేడాది సెప్టెంబర్ 10ని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దీంతో ఏకే జైన్ ఆగస్టు 31న నీతి ఆయోగ్ నుంచి రిలీవ్ అయి.. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్చేసి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చీఫ్ కమిషనర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. -
సమాచార కమిషన్లలో 30శాతం ఖాళీలు
న్యూఢిల్లీ: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో దేశవ్యాప్తంగా 30 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. సమాచార హక్కు చట్టం–2005 కింద సమాచారం ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2.5 కోట్ల ఆర్టీఐ దరఖాస్తులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో 48 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో 30.8% పోస్టులు ఇంకా భర్తీకాలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. 2005–16లో బాధ్యతారాహిత్యానికి సంబంధించి వేర్వేరు ప్రభుత్వ సం స్థలు, అధికారులపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రూ.1.93 కోట్ల జరిమానా విధించింది. -
సమాచారం ఇవ్వాల్సిందే..
రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ సాక్షి, విశాఖపట్నం : నిర్ణీత గడువులోగా అడిగిన సమాచారం ఇవ్వకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘స.హ.చట్టం-విజయాలు-తీర్పులు’ అనే అంశంపై శుక్రవారం జెడ్పీ సమావేశం హాలులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగలిగితేనే ప్రజాస్వామ్యానికి సార్ధకత చేకూరుతుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడిస్తే చట్టం మరింత ఫలవంతంగా వినియోగమవుతుందన్నారు. స.హ.చట్టం జిల్లా నోడల్ అధికారి, డీఆర్ఓ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆర్టీఐ లోగోను వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అధికార యంత్రాంగానికి అప్డేట్ సమాచారాన్ని తెలియజేస్తూ వివిధ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సహకార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలన్నారు. కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఈ చ ట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో హెల్ప్ టు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బి.ఎం.నాయుడు, రమేష్, కేవిఎస్ నరసింహం, వివిధ మండలాల సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.