shipping ministry
-
హర్ముజ్లో భారత నౌకల ప్రయాణం .. సీక్రెట్ స్ట్రాటజీ ఇదే..!
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి పలు దేశాల్లో లాక్డౌన్లు సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత సంక్షోభం సమయంలోనూ భారత నౌకలు మాత్రం నిరాటంకంగా హర్ముజ్లో రాకపోకలు సాగించాయి. దీనికి భారత అనుసరించిన వ్యూహాన్ని తాజాగా అధికారులు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్ముజ్ని మూసివేసింది. రుపక్షాల మధ్య ఏప్రిల్ 9న కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు మరియు దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిలో ప్రయాణించడానికి గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు సైతం భయపడుతుంటే, భారతీయ నౌకలు మాత్రం సురక్షితంగా ప్రయాణిస్తూ దేశానికి అవసరమైన ఇంధన సరఫరాను అందిస్తున్నాయి. ఈ దౌత్య సీక్రెట్ను తాజాగా ఓడరేవుల మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.ఈ హర్ముజ్లో భారత్ నౌకల ప్రయాణానికి ప్రధాన కారణం భారత విదేశాంగ శాఖ ఇరాన్తో అనునిత్యం దౌత్య చర్చలు జరపడేమన్నారు. అదే విధంగా ఏ నౌకలు ముందుగా ప్రయాణించాలనే ప్రాధాన్యతలను అనునిత్యం పర్యవేక్షించడం. దేశ ప్రయోజనాలకు అత్యవసరమైన చమురు, గ్యాస్, ఎరువుల నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అనునిత్యం ప్రణాళికలు వేస్తూ నౌకలు రవాణా జరిపేలా ప్రణాళికలు రచించామన్నారు. ప్రస్తుతం హర్ముజ్లో 13 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కాగా యుద్ధ ప్రారంభమైన నాటి నుంచి హర్ముజ్లో అత్యధిక నౌకలను నడుపుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ఇటీవలే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బిడబ్ల్యూ టైర్, బిడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి వంటి నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు అవసరాలలో 20 శాతం ఈ ఇరుకైన హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఈ మార్గంలో రవాణా మందగించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగి ఆసియా దేశాలపై ఆర్థిక భారం పడుతున్న తరుణంలో, భారత్ తన వ్యూహాత్మక చతురతతో ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. -
గతిశక్తి ప్లాన్ కింద 101 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 101 ప్రాజెక్టులను గుర్తించినట్టు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వినియోగం, ఉత్పత్తి కేంద్రాలను పోర్ట్లతో అనుసంధానించేందుకు గతిశక్తి పథకాన్ని కేంద్రం తీసుకురావడం గమనించాలి. సీఐఐ వర్చువల్గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సోనోవాల్ మాట్లాడారు. 24 రాష్ట్రాల పరిధిలో 11 జలమార్గాలు విస్తరించాయని.. వీటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించినట్టు తెలిపారు. ‘‘రవాణా వ్యయాలను తగ్గించడం భారత్కు కీలకం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దృష్టితో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అనుసంధానం విస్తృతికి 101 ప్రాజెక్టులను మా శాఖ గుర్తించింది’’ అని సోనోవాల్ వివరించారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన సాగర్మాలా, భారత్మాలా, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అమలు దశల్లో ఉన్నట్టు చెప్పారు. సాగర్మాలా ప్రాజెక్టు కింద పోర్టుల సదుపాయాల విస్తరణకు, నైపుణ్యాల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ శాఖా తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇతర పోర్ట్లతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దేశంలో రవాణా సదుపాయాల విస్తరణ, రవాణా వ్యయాలు తగ్గించే లక్ష్యాలతో రూ.100 లక్షల కోట్ల నేషనల్ మాస్టర్ప్లాన్ను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రారంభించడం గమనార్హం. మౌలిక, రవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నది ఇందులోని ఉద్దేశ్యం. దేశ వాణిజ్యం, వృద్ధిలో సముద్రరంగం కీలక పాత్ర పోషిస్తుందని సోనోవాల్ అన్నారు. సరఫరా వ్యవస్థ, రవాణా సామర్థ్యాలు బలోపేతం అయితే 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమవుతుందన్నారు. -
ప్రైవేటుకు జలమార్గాలపై పార్లమెంటరీ కమిటీ నో
న్యూఢిల్లీ: లాభదాయకమైన జాతీయ జలమార్గాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. నాలుగు, ఐదో జాతీయ జలమార్గాలను పీపీపీ పద్ధతిలో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈ మేరకు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై నియమితమైన పార్లమెంటరీ సంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. లాభదాయకమైన మార్గాలనే ప్రైవేటుకు అప్పగించాలన్న ఈ ప్రతిపాదనను సీతారాం ఏచూరి నేతృత్వంలోని కమిటీ ప్రశ్నించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిని కలుపుతూ గోదావరి, కృష్ణా నదులతోకూడిన మార్గాన్ని నాలు గో జాతీయ జలమార్గంగా, ఒడిశా, పశ్చిమబెంగాల్ను కలుపుతూ ఉన్న మార్గా న్ని ఐదో జాతీయ జలమార్గంగా 2008లో ప్రకటించగా.. ఇంకా రవాణా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు.


