breaking news
Nithari serial murders
-
నిఠారి హంతకులెవరు?
కనీవినీ ఎరుగని ఘోరం జరుగుతుంది. పత్రికల్లో పతాక శీర్షికవుతుంది. చానెళ్లలో ప్రధాన చర్చ నీయాంశంగా మారుతుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. కారకులను ఉరికంబం ఎక్కించాలంటూ జనం డిమాండ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్కౌంటర్ చేయాలని గొంతెత్తుతారు. తీరా కాలం గడిచాక, న్యాయస్థానాల్లో విచారణలు వాయిదాల్లో సాగాక నిందితులు నిర్దోషులుగా విడుదలవుతారు. అన్ని కేసుల్లోనూ కాకపోవచ్చుగానీ, కొన్నింటి విషయంలో ఇలాగే జరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం దక్కలేదని ఆక్రోశించాలో, అమాయకులకు విముక్తి లభించిందని భావించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. మరి దోషులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం పెనుసంచలనం సృష్టించిన ‘నిఠారీ హత్యల’ కేసుల్లో నిందితులుగా భావించిన సురేందర్ కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్లు తాజాగా అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటపడటం బహుశా ఎవరూ ఊహించని ముగింపు. ఎందుకంటే 2005–06 మధ్య వారిద్దరూ చేశారని చెప్పిన నేరాల జాబితా చాలా పెద్దది. వారి చేతుల్లో ఏకంగా 18 మంది బాలికలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. ఒంటరిగా కనబడిన నిరుపేద బాలికలకూ, మహిళలకూ మాయమాటలు చెప్పి బంగ్లాలోకి తీసుకెళ్లటం, వారిని హతమార్చటం నేరగాళ్లు అనుసరించిన విధానం. హత్యల తర్వాత మృతదేహాలపై కోలీ, పంధేర్లు లైంగికదాడి జరిపే వారనీ, నరమాంస భక్షణ చేసేవారనీ వచ్చిన కథనాలు వెన్నులో వణుకు పుట్టించాయి. మృత దేహాలపై లైంగిక దాడి తర్వాత శరీర భాగాలను ఇంటి వెనకున్న కిటికీ నుంచి విసిరేసేవారని కూడా ఆ కథనాల సారాంశం. ఎప్పటికప్పుడు వీరందరి అదృశ్యంపైనా ఫిర్యాదులొచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించటంవల్లే ఇన్ని హత్యలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీరా ఇన్నేళ్లు గడిచాక పోలీసులు సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయారనీ, వారి దర్యాప్తు ఆద్యంతం అస్తవ్యస్థంగా సాగిందనీ హైకోర్టు తేల్చింది. వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు మురికి కాల్వలో పుర్రె భాగం దొరకటంతో ఈ కేసుల డొంక కదిలింది. ఆ తర్వాత 8 మంది పిల్లల ఎముకలు ఇంటి వెనుక దొరికాయి. నిందితులపై 2009లో బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్, సైకలాజికల్ అసెస్మెంట్స్ వంటి శాస్త్రీయ పరీక్షలు చేశారని వార్తలొచ్చాయి. ‘హఠాత్తుగా నాలో దయ్యం నిద్ర లేచేది. ఎవరినో ఒకరిని మట్టుబెట్టాలన్న వాంఛ పుట్టుకొచ్చేది’ అని కోలీ చెప్పినట్టు కూడా మీడియా కథనాలు తెలిపాయి. నిందితులిద్దరిపైనా 19 కేసులు నమోదుకాగా, వీటిని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 12 కేసుల్లో కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించగా, రెండు కేసుల్లో పంధేర్ దోషిగా తేలాడు. అతనికి కూడా మరణశిక్ష పడింది. దోషులు అప్పీల్ చేసుకోగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక కేసులో మినహా అన్నింటి లోనూ కోలీ నిర్దోషిగా బయటపడ్డాడు. పంధేర్కు అన్ని కేసుల నుంచీ విముక్తి లభించింది. వీరిద్దరి పైనా బలమైన సాక్ష్యాధారాలూ లేవని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నోయిడా సెక్టార్లోని నిఠారి అప్పట్లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు పట్టణంగా మారింది. మన నేర న్యాయవ్యవస్థ మాత్రం ఎప్పట్లాగే లోపభూయిష్టంగా ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దాన్నే నిర్ధారించింది. మీడియాలో ప్రముఖంగా ప్రచారంలోకొచ్చి, ఆందోళనలు మిన్నంటే కేసుల్లో పోలీసు లపై వాటి ప్రభావం, ఒత్తిళ్లు అధికంగా వుంటాయనటంలో సందేహం లేదు.వాటిని సాకుగా చూపి ఆదరాబాదరాగా ఎవరో ఒకరిని నిందితులుగా తేల్చాలనుకోవటం సరికాదు. సాక్ష్యాధారాల సేక రణలో కూడా పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారనీ, నిందితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించి తేల్చటానికే ఉత్సాహం ప్రదర్శించారనీ హైకోర్టు తప్పుబట్టిందంటే దర్యాప్తు ఎలా అఘోరించిందో అర్థం చేసుకోవచ్చు. చాన్నాళ్లక్రితం కేంద్ర ప్రభుత్వ కమిటీ మనుషుల అదృశ్యాల వెనక శరీర అవయవాల వ్యాపారం సాగించే సంఘటిత ముఠాల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నిఠారి హత్యల విషయంలో ఆ కోణంలో దర్యాప్తు సాగలేదు. థర్డ్ డిగ్రీ విధానాలను ఉపయోగించటం ద్వారా పోలీసులు కేసు తేల్చేశారన్న అభిప్రాయం జనంలో కలిగించవచ్చుగానీ, న్యాయస్థానాల్లో విచారణ సమయానికి ఇవన్నీ మటుమాయమవుతాయి. సంశయాతీతంగా సాక్ష్యా ధారాలుండకపోతే, మమ్మల్ని కొట్టి ఒప్పించారని నిందితులు చెబితే చివరికి కేసు వీగి పోతుంది. కేవలం ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఇంతమందిని హతమార్చారనీ, మరెవరి ప్రమేయమూ ఇందులో లేదనీ నిర్ధారించాలంటే అందుకు దీటైన సాక్ష్యాధారాలుండాలి. అవి శాస్త్రీయంగా సేకరించాలి. ఎక్కడ అశ్రద్ధ చేసినా, ఏ చిన్న లోపం చోటుచేసుకున్నా మొత్తం కుప్పకూలిపోతుంది. దానికి తోడు ప్రతీకారంతో రగిలిపోతూ తక్షణ న్యాయం కావాలని రోడ్డెక్కే ధోరణులు మొత్తం దర్యాప్తును అస్తవ్యస్థం చేస్తున్నాయి. జనాన్ని సంతృప్తిపరచటం కోసం దొరికినవారిని నిందితులుగా తేల్చి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ సీబీఐ అప్పీల్ చేస్తుంది. అక్కడే మవుతుందన్నది చూడాల్సివుంది. అత్యాధునిక ప్రమాణాలతో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అంతరిక్షంలో ఘనవిజయాలు నమోదు చేస్తున్నాం. కానీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో, దానికి వృత్తిగత నైపుణ్యాలను అలవాటు చేయటంలో విఫలమవుతున్నాం. క్రిమినల్ కేసుల్లో సత్వర దర్యాప్తు, పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణ ప్రాణప్రదం. వాటిని విస్మరిస్తే కేసులు కుప్ప కూలు తాయి. నేరగాళ్లు తప్పించుకుంటారు. నిఠారి నేర్పుతున్న గుణపాఠాలివే. -
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
సీరియల్ రేపిస్ట్కు మరణశిక్ష
ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్ రేపిస్ట్తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్ సింగ్ త్రిపాఠి పనిమనిషి సురేందర్ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు. మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్ సింగ్ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి పవన్ కుమార్ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.