breaking news
mumbai session court
-
పోక్సో నిందితుడికి బెయిల్.. దేశంలోనే ఇలా తొలిసారి?
ముంబై: పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి(45).. అదీ కేసులో ఛార్జ్షీట్ దాఖలు కాకముందే బెయిల్ మంజూరు చేసింది ఓ న్యాయస్థానం. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన కోర్టుగా నిలిచింది ముంబై సెషన్ కోర్టు. ముంబై వకోలా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. తన మూడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ జనవరి చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు పొరుగింట్లోకి తరచూ వెళ్తుందని, ఈ క్రమంలో తన కూతురిపై పొరుగింట్లో ఉండే వ్యక్తి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. 20 రోజుల తర్వాత విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆమె, తర్వాత మరో రెండు రోజులు ఆగి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో చట్టం ప్రకారం నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ, ఛార్జ్షీట్ ఇంకా ఫైల్ చేయలేదు. సాధారణంగా ఛార్జ్షీట్ ఫైల్ అయ్యాకే.. బెయిల్ విషయంలో కోర్టును ఆశ్రయించొచ్చు. ఈ లోపు నిందితుడు బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించాడు. తన(నిందితుడు) క్లయింట్ ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడని, ఘటన జరిగినట్లు చెప్తున్న రోజున ఆఫీస్లోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నిందితుడి తరపు న్యాయవాది. అంతేకాదు.. రెండు ఇళ్ల మధ్య ఉన్న పైప్లైన్ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన క్లయింట్ను బద్నాం చేసే ఉద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు వాదించాడాయన. మరోవైపు.. ప్రాసిక్యూషన్ నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఈ పోక్సో కేసులో ఛార్జ్షీట్ కూడా ఇంకా ఫైల్ కాలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. నిందితుడు, బాధిత కుటుంబం పొరుగింట్లోనే ఉంటాడు గనుక అతని నుంచి వాళ్లకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉండొచ్చని, కేసును ప్రభావితం చేయొచ్చని వాదించారు. అయితే.. కోర్టు మాత్రం నిందితుడి తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. -
డ్రగ్ కేసు: రియా రిమాండ్ పొడిగింపు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో అరెస్టైన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కస్టడిని ముంబై సెషన్స్ కోర్టు పొడిగించింది. రియా సుశాంత్కు డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సెప్టంబర్ 9 అరెస్టు చేసి ముంబైని బైకుల్లా మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కస్టడిని అక్టోబర్ 20 వరకు పోడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్లో బెయిల్ కోరుతూ రియా ముంబై కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. కానీ కోర్టు తన పిటిషన్ రిజర్వులో ఉంచింది. అయితే దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవాంర వెల్లడించే అవకావం ఉన్నట్లు సమాచారం. (చదవండి: సుశాంత్ది ఆత్మహత్యే.. హత్య కాదు!) అయితే డ్రగ్ కేసులో నేర నిరూపణ కావడంతో రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలతో పాటు మరో ముగ్గురిని ముంబై సెషన్స్ కోర్టు అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపించింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ రియా ఆమె సోదరుడు షోవిక్తో సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారి బెయిల్ విచారణ సమయంలో యువకులకు వారు మాదకద్రవ్యాలను సరఫరా చేయలేదన్న నేర ఆరోపణ నిర్థారణకు వచ్చే వరకు వారికి బెయిల్ మంజూరు చేయోద్దని కోర్టును ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం డ్రగ్ వ్యవహారంలో డ్రగ్ సిండికెట్ క్రియాశీల సభ్యులు, సుశాంత్ మృతి కేసు సంబంధించిన ప్రారంభ దర్యాప్తును కూడా సమీక్షిస్తామని ఎన్సీబీ కోర్టుతో పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) చదవండి: అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి! -
పాక్ మౌనం వీడాలి
చాన్నాళ్ల తర్వాత ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ మీడియాలో హోరెత్తుతున్నాడు. అమెరికాలోని ‘గుర్తు తెలియని’ జైలునుంచి వీడియో లింక్ ద్వారా ముంబై సెషన్స్ కోర్టు ముందు రెండు రోజులుగా అతడిస్తున్న వాంగ్మూలాలు ముంబై నగరంపై ఎనిమిదేళ్లక్రితం జరిగిన ముష్కరదాడిలో పాకిస్తాన్ ప్రమేయాన్ని మరోసారి ధ్రువీకరిస్తున్నాయి. మూడోరోజైన బుధవారం ఎందుకనో అటువైపు నుంచి సాంకేతిక అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం అమెరికాలో 35 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న హెడ్లీ మరికొన్ని రోజులు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. అతను వెల్లడిస్తున్న అంశాలు నిజానికి కొత్తవేమీ కాదు. అయిదారేళ్లుగా అవన్నీ విన్నవే. ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత...అంటే 2009లో తొలిసారి షికాగోలో హెడ్లీ అరెస్టయ్యాడు. అప్పట్లోనే ముంబై దాడుల పథక రచనలో హెడ్లీ ప్రమేయం, అతనికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అందించిన సహకారం వగైరా అంశాలన్నీ ప్రపంచానికి వెల్లడయ్యాయి. 2010లో మన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అమెరికా వెళ్లి అతడినుంచి మరిన్ని విషయాలు రాబట్టారు. ఆ మరు సటి ఏడాది అమెరికా న్యాయస్థానం ముందు సైతం హెడ్లీ ఈ వివరాలన్నీ చెప్పాడు. తమ చిరకాల మిత్ర దేశం గనుకా, దాడులు జరిగింది తమ గడ్డపై కాదు గనుకా ఆ విషయంలో అమెరికా మౌనంగానే ఉండిపోయింది. మన దేశం అడిగి నప్పుడు దర్యాప్తు సంస్థ ముందు చెప్పిన విషయాలకు విలువేమున్నదని పాక్ దబా యించింది. ఇప్పుడు న్యాయస్థానం ముందు హెడ్లీ చెప్పాడు గనుక ఆ దేశం సంజా యిషీ ఇవ్వాల్సిన స్థితిలో పడింది. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్, కమాం డర్ జాకీవుర్ రెహ్మాన్ లఖ్వీలతోపాటు ఐఎస్ఐ అధికారుల ప్రమేయం గురించి కూడా అతను వెల్లడించాక నోరెత్తకుండా కూర్చోవడం పాకిస్తాన్కు సాధ్యంకాదు. పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై గత నెల మొదట్లో ఉగ్రవాదులు దాడి జరిపి సృష్టించిన బీభత్సంపై ఇప్పటికే మన దేశం కీలకమైన సాక్ష్యాధారాలను పాకిస్తాన్కు అందించింది. వాటిపై తగిన చర్యలు తీసుకున్నాక ఇరు దేశాలమధ్యా జరగాల్సిన చర్చలు ప్రారంభమవుతాయని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి. ఆ ఉదంతానికి సంబంధించి జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై దాడులు జరిగాయని, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చినా అందుకు సంబంధించిన పురోగతి ఏమిటో పాక్ ఇంతవరకూ చెప్పలేదు. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ను అరెస్టు చేసినట్టు కథనాలు రావడం, చివరికతను గృహ నిర్బంధంలో ఉన్నాడని గుప్పుమనడం కూడా అయింది. అందుకు సంబంధించి ఇంతవరకూ ఉలకని పాకిస్తాన్కు తాజాగా హెడ్లీ చెబుతున్న సాక్ష్యాలు నిస్సందేహంగా మింగుడుపడనివే. హెడ్లీ ఏకకాలంలో అమెరికా మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం ఏజెంటుగా పనిచేశాడు. అటు లష్కరే ఏజెంటుగా ఉన్నాడు. అదే సమయంలో ఐఎస్ఐ ఏజెంటుగా వ్యవహరించాడు. ఇదంతా రెండు దశాబ్దాలపాటు కొనసాగించాడు. ముంబై దాడులకు ముందు ఏడుసార్లు, ఆ తర్వాత ఒకసారి మన దేశానికొచ్చాడు. తన గురించి అనుమానం రాకుండా ఉండేందుకు వీసా దరఖాస్తులో అన్నీ తప్పుడు వివరాలిచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 2009 నుంచి హెడ్లీ తమ నిర్బంధంలో ఉన్నా అతను వెల్లడించిన అంశాలను అమెరికా మన దేశంతో పంచుకోలేదు. పాకిస్తాన్ను నొప్పించరాదన్న ఉద్దేశమా, అంతకుమించిన ప్రయోజనమేమైనా దీని వెనక ఉన్నదా అన్న సంగతి అమెరికాయే చెప్పాలి. అనేకానేకసార్లు ఒత్తిళ్లు తెచ్చిన తర్వాత 2010లో కొన్ని పరిమితులు విధించి హెడ్లీని ప్రశ్నించేందుకు ఎన్ఐఏను అనుమతించింది. అమెరికాపై దాడి చేసిన ఉగ్రవాదులు ప్రపంచంలో ఏమూలనున్నా దాడి చేసి పట్టుకుంటామని, అది తమ హక్కని చెప్పే అమెరికా అలాంటి హక్కే ఇతర దేశాలకూ ఉంటుందని గుర్తించడంలేదు. అతన్ని అప్పగించడం మాట అటుంచి, కనీసం ప్రశ్నించడానికి అతి కష్టంమీద అనుమతించింది. నవంబర్లో పారిస్లో జరిగిన ఉగ్రవాద దాడులు, ఆ మరుసటి నెలలో కాలిఫోర్నియాలో ఒక జంట కాల్పులు సాగించి పలువుర్ని పొట్టనబెట్టుకోవడంవంటి ఉదంతాల తర్వాత అమెరికా తన వైఖరిని మార్చుకున్నదనిపిస్తుంది. మార్పు రావడం మంచిదే అయినా దానికి మళ్లీ పరిమితులుండకూడదు. నిజానికి అమెరికా గనుక ముంబై దాడుల విషయంలో మన దేశానికి సహకరించదల్చుకుంటే 2011లో తమ న్యాయస్థానం ముందు హెడ్లీ ఇచ్చిన సాక్ష్యాలను అప్పట్లోనే అది పాకిస్తాన్కు అందజేసేది. అలాచేసి ఉంటే పాక్ దబాయింపులకు అప్పుడే కళ్లెం పడేది. ఐఎస్ఐ అధికారులను అరెస్టు చేయకతప్పని పరిస్థితి ఎదురయ్యేది. హెడ్లీ ఆ సమయంలో ఇచ్చిన సాక్ష్యాలతోపాటు మన దర్యాప్తు సంస్థలు సేకరించిన అనేక అంశాలను మన దేశం పాక్ న్యాయ కమిషన్ ఇక్కడికొచ్చినప్పుడు అందజేస్తే అనంతర కాలంలో పాక్ కోర్టు ‘ఇవేవీ సాక్ష్యాలు కాద’ని కొట్టిపడేసింది. అప్పుడు అమెరికా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. ఏమైతేనేం ఇన్నాళ్లకు హెడ్లీ మన కోర్టు ముందుకొచ్చి అన్ని వివరాలూ చెప్పాడు. అతను చెబుతున్న అంశాలు నేరుగా అక్కడి రాజ్యాన్నే దోషిగా నిలబెడుతున్నాయి. వీటి ఆధారంగా రేపో మాపో మన దేశం పాకిస్తాన్కు సవివరమైన నివేదికలను అందజేస్తుంది. అప్పుడు పాక్ ఏం చెబుతుందన్నది తేలుతుంది. ఎప్పటిలా తప్పించుకోవాలని చూస్తే భారత్-పాక్ మధ్య జరగాల్సిన చర్చలకు కొత్త అవరోధాలు ఏర్పడక తప్పదు. ఇరు దేశాలమధ్యా ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికైనా హెడ్లీ చెబుతున్న సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. లేనట్టయితే ప్రపంచంలో ఉగ్రవాద దేశంగా ముద్రపడక తప్పని స్థితి ఏర్పడుతుందని ఆ దేశం గ్రహించాలి.