breaking news
Milk produce
-
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
పాల ఉత్పత్తిలో భారత్ నెం1
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో భారత్ పాల ఉత్పత్తిలో నెం1గా నిలవనుంది. దీనికి కారణం జనభా పెరుగదలేనని ఐక్యరాజ్య సమితి, ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ(ఓఈసీడీ) రూపోందించిన (2017-2026) వ్యవసాయ అవుట్లుక్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తి మూడు రెట్లు అవుతుందని, భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్ స్థానంలో నిలుస్తుందని రిపోర్టులో సూచించారు. అంతేకాకుండా జనాభాలో చైనాను మించి అత్యధిక జనాభ గల దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. భారత్ ప్రస్తుత జనాభ 130 కోట్లు ఉండగా ఈ సంఖ్య 150 కోట్లకు చేరుతుందని ఓఈసీడీ అంచనా వేసింది. ఇక గోధుమల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం పెరగగా.. కేవలం ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 49 శాతం పెరుగుతోందని పేర్కొంది. భారత్, పాక్, చైనాలో గోధుమల ఉత్పత్తి ఎక్కువగా ఉండబోతుందని ఓఈసీడీ నివేదిక స్పష్టం చేసింది. ఇక రైస్ ప్రపంచ వ్యాప్తంగా 12 శాతం పెరగుతోందని, భారత్, ఇండోనేషియా, మయన్నార్, తైలాండ్, వియత్నంలో ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని పేర్కొంది. -
త్వరలో పశుగ్రాస బ్యాంకులు
కరువు, వరదల సమయంలో సరఫరా.. మిగతా సమయాల్లో లాభనష్టాలు లేని ధరకు అమ్మకాలు.. పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం.. దశల వారీగా జిల్లాకో పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిఏటా కొన్ని చోట్ల వరదలు.. మరి కొన్ని చోట్ల కరువు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశువులకు మేత దొరకని పరిస్థితి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, రైతులు పశువులను కబేళాలకు అమ్ముకోవడం పరిపాటి అవుతోంది. కరువు ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తరలించాలంటే పశుగ్రాస ఖరీదు కన్నా మూడింతలు రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆ ఎండుగడ్డిలో ఎలాంటి పోషకాలూ ఉండవు. ఈ సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్(పశుగ్రాస) బ్యాంక్’ అన్న వినూత్న పథకాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం రూ.2.10కోట్ల నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా పులివెందులలోని ‘ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ఆన్ లైవ్స్టాక్’(ఐజీకార్ల్) ఆవరణలో ‘ఫాడర్ బ్యాంక్’ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఐజీకార్ల్’లో వినియోగంలో లేని నిర్మాణాలు ఉండటం, పశుగ్రాసాన్ని పెంచేందుకు 600 ఎకరాల స్థలం ఉండటం లాంటి అనుకూలతల దృష్ట్యా పైలట్ ప్రాజెక్టుకు పులివెందులను ఎంచుకున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పశుగ్రాసాభివృద్ధి పథకం ఉన్నా.. కేంద్ర నిధులతో ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’(ఆర్కేవీవై) ప్రాజెక్ట్ కింద ‘పశుగ్రాసాభివృద్ధి పథకం’(యాగ్జిలరేటెడ్ ఫాడర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) అమలవుతోంది. మేలుజాతి గడ్డి విత్తనాలు, గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించే ‘ఛాప్ కట్టర్ల’ను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నారు కానీ వరదలు, కరువులు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో పశువులకు మేత అందించే ఏర్పాట్లేమీ ఈ పథకంలో లేవు. ఈ లోటును పూరించే విధంగా పశుసంవర్ధక శాఖ ‘ఫాడర్ బ్యాంక్’ పథకాన్ని రూపొందించింది. బ్యాంకు పనిచేస్తుందిలా.. ప్రభుత్వం స్థలంలో పశుగ్రాసాన్ని పండించడం, చుట్టుపక్కల రైతుల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేయడం, పశుగ్రాసానికి తగిన పోషకాలను జోడించి అత్యాధునిక యంత్రాల ద్వారా ‘బేళ్లు’గా చేసి గోదాముల్లో నిల్వచేయడం ద్వారా ‘ఫాడర్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తారు. వరికోత యంత్రాలు వచ్చినప్పటి నుంచి మాగాణుల్లో వినియోగంలోకి రాకుండా పోతున్న వరిగడ్డిని సేకరించి, తగిన పోషక లవణాలను జోడించి బేళ్లుగా తయారు చేసి పశుగ్రాస కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేస్తారు. పది లారీల్లో పట్టే గడ్డిని బేళ్లుగా తయారు చేస్తే ఒక లారీలోనే రవాణా చేయవచ్చు. అలాగే ఒక టన్ను ధాన్యాన్ని నిలువచేసేందుకు అవసరమైన స్థలంలోనే ఒక టన్ను పశుగ్రాసాన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. గాలి చొరబడకుండా ప్లాస్టిక్ కవర్తో ప్యాకింగ్ చేయడం వల్ల ‘మాగుడు గడ్డి’ని రెండేళ్లపాటు నిల్వ చేయవచ్చు. ఇలా పశుగ్రాసాన్ని బేలింగ్, ప్యాకింగ్ చేసే యంత్రాలను ‘ఫాడర్ బ్యాంక్’ పథకం కింద సమకూర్చుకోనున్నారు. పులివెందులలో పైలట్ ప్రాజక్ట్ను ఆరంభించి ఆ తర్వాత ఈ పథకాన్ని మిగతా జిల్లాలకు విస్తరించను న్నారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చదలవాడ, నెల్లూరు జిల్లా చింతల దీవి, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి, మెదక్జిల్లా గుర్గార్ పల్లి, కర్నూలు జిల్లా బనవాసి, గుంటూరు జిల్లా నకిరేకల్లలోని పశుపరిశోధనా స్థానాల్లో ‘ఫాడర బ్యాంక్’లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త పథకం అమలైతే పశువులకు కూడా ఆహార భద్రత ఏర్పరచినట్లవుతుందని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.