breaking news
kamalanagar
-
కమలామార్కెట్కు కళ!
- జూన్ నుంచి డీయూ క్లాసులు - దుకాణాల్లో భారీ రద్దీ న్యూఢిల్లీ: కొత్త ఆశలు, ఆశయాలతో ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో అడుగుపెట్టే విద్యార్థులు ఇప్పటి నుంచే పుస్తకాలు, దుస్తుల వంటివన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో క్యాంపస్ సమీపంలో ఉండే కమలానగర్, టిబెటన్ మార్కెట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దుస్తుల దుకాణ దారులకు తీరిక దొరకడం లేదు. పుస్తకాల దుకాణాలు ముందు చేంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెస్టారెంట్లు రుచికరమైన ఆహారానికి పెట్టిందిపేరు. ‘కమలానగర్లో మంచి ఆహారం దొరుకుతుందని మా సీనియర్లు చెప్పారు. మా స్నేహితులతోపాటు వెళ్లి అక్కడి పదార్థాలను రుచి చూసి రావాలనుకుంటున్నారు’ అని డీయూలో సీటు ఆశిస్తున్న అంబిక అనే విద్యార్థిని చెప్పింది. కమలానగర్ మార్కెట్ క్యాంపస్కు దగ్గర కాబట్టి ఇక్కడ పుస్తకాలు, ఆహారం, దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలుదారుల్లో దాదాపు 50 శాతం మంది విద్యార్థులేనని తెలిపారు. కొత్త సిలబస్కు అనువైన పుస్తకాలను కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంచామని పుస్తకాల దుకాణ యజమానులు చెప్పారు. సిలబస్కు అనుగుణంగా కొన్ని పుస్తకాలను తొలగించి, అవసరమైన వాటినే విక్రయిస్తున్నామని బుక్ల్యాండ్ యజమాని సచిన్ అన్నారు. పుస్తకాలే కాదు చౌకధరల దుస్తులకు కమలానగర్ మార్కెట్ పెట్టింది పేరు. ఆధునిక శైలి ఉట్టిపటే నియోన్, బ్లింగ్, ప్రింటెడ్ పలాజోస్ తరహా వస్త్రాలను ఈ తరం యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్న యువకుడు ఒకరు అన్నాడు. బ్యాండ్లు, రింగులు, క్లిప్స్ వంటి చిన్న చిన్న వస్తువులకూ బాగా డిమాండ్ ఉందని ఒక దుకాణంలో పనిచేసే అంబిక చెప్పింది. వినియోగదారుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్ ఇస్తున్నామని వివరించింది. గత కొన్ని కమలానగర్ మార్కెట్లో వ్యాపారం బాగా పెరిగిందని తెలిపింది. ఐడీ కార్డులతో సిమ్ ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు డీయూలో చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే సిమ్ కార్డులు పొందాలంటే స్థానిక చిరునామాను నిర్ధారించే ధ్రువపత్రాలు అవసరం. పరాయి రాష్ట్రాల వారికి ఇలాంటి పత్రాలు ఉండవు కాబట్టి డీయూ విద్యార్థి గుర్తింపుకార్డులు చూపిస్తే సిమ్కార్డులను యాక్టివేట్ చేసి ఇస్తున్నామని అమ్మకందారులు తెలిపారు. అంతేగాక ‘ఫస్ట్ రీచార్జ్’ ఆఫర్గా రూ.100 రీచార్జ్ చేసుకుంటే సిమ్కార్డుతోపాటు రూ.100 టాక్టైమ్ ఇస్తున్నామని చెప్పారు. ఇక్కడ 16 ఏళ్లుగా కొనసాగుతున్న మొమోస్ పాయింట్కు ఇప్పుడు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ‘నేను హన్స్రాజ్ కాలేజీలో చదువుకునేటప్పుడు మొమోస్ తినాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అందుకే నేను ఇక్కడ ఈ ఫలహారశాల పెట్టాను. మేం సొంతగా మసాలా మొమోను ప్రవేశపెట్టాం. దానికి ఇప్పుడు చాలా ఆదరణ ఉంది’ అని ఆయన వివరించారు. ఈ మార్కెట్లో కొత్తగా వెలిసిన రెస్టారెంట్లు వినియోగదారులను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నాయి. -
ఇక్కడ భద్రమేనా?
సాక్షి, అనంతపురం : నగరంలోని కమలానగర్కు చెందిన రేవతి ఇంటి ఖర్చుల నిమిత్తం సమీపంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లడానికి సిద్దమైంది. ఒక్కతే వెళ్లడానికి సాహసం చేయలేక.. పక్క ఇంట్లో ఉన్న సావిత్రిని సాయం అడిగింది. అక్కా.. కాస్త ఏటీఎం వరకు వస్తావా.. డబ్బులు డ్రా చేసుకుని వస్తామని పిలిచింది. అయ్యో.. ఇంట్లో కాస్త పని ఉంది.. ఏమనుకోకుండా నీవే వెళ్లిరా అని చెప్పింది. నిన్న బెంగళూరులో ఏటీఎం కేంద్రంలో జరిగిన సంఘటన టీవీలో చూసిన తరువాత ఒక్క దాన్నే ఏటీఎంకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని చెప్పింది. ఇది నగరానికి చెందిన ఒక్క రేవతి భయమే కాదు. జిల్లాలోని పలువురు మహిళలు సైతం భద్రతా వ్యవస్థ సరిగాలేని మన ఏటీఏం కేంద్రాలకు వెళ్లడానికి జంకుతున్నారు. బెంగళూరు నగరంలో ఏటీఎం కేంద్రంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్పై దుండగుడి దాడి నేపథ్యంలో నిత్యం ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనతో మహిళలు ఒంటరిగా ఏటీఎంలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏటీఎం కేంద్రాల నిర్వహణ విషయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు అమలు కావడం లేదు. అనంతపురంలో స్టేట్బ్యాంకు పరిధిలో దాదాపు 20 ఏటీఎం కేంద్రాలు పనిచేస్తుండగా, మిగిలిన వాణిజ్య బ్యాంకుల పరిధిలో ఆరు నుంచి 10 ఏటీఏం కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే కార్పొరేట్ బ్యాంకుల పరిధిలో మూడు నుంచి ఐదు వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రతి ఏటీఎం కేంద్రం వద్ద ఖాతాదారులు డబ్బు తీసుకుని వెళ్లే దాకా కల్పించాల్సిన భద్రత నామమాత్రంగా ఉంది. 50 శాతం ఏటీఏం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డు ఉండటం లేదు. కొన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలు పని చేయడం లేదు. ముఖ్యంగా ఏటీఎం కేంద్రాల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుల వద్ద ఆయుధం కాదు..కదా.. చిన్న కర్ర కూడా ఉండడం లేదు. దీంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటే నిస్సహాయ స్థితిలో చేతులు ఎత్తేయడం మినహా చేసేదేమి లేదు.