breaking news
Elaan Musk
-
అంతరిక్షంలో డేటా స్థావరాలు..
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన భారీ ఇంటర్నెట్ గిడ్డంగులలో అమర్చిన వేలాది శక్తిమంతమైన సర్వర్లు పని చేసే స్థలాలే డేటా సెంటర్లు. ఇప్పుడిక అంతరిక్షంలో కూడా వీటి స్థావరాలను నెలకొల్పటం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో, దానికి తగ్గ కంప్యూటింగ్ పవర్ కోసం ‘స్పేస్ఎక్స్’ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాయి. భూమి మీదున్న పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించడానికి ‘ఆర్బిటల్ డేటా సెంటర్లు’ ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, అంతరిక్షంలోని కఠిన వాతావరణం, కూలింగ్ సమస్యలు, అధిక ఖర్చుల దృష్ట్యా.. ఈ అత్యాధునిక సాంకేతికత ఎంతవరకు సాధ్యపడుతుందనేది పెద్ద ప్రశ్న.నింగి వైపు కంపెనీల చూపుఅంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టేందుకు టెక్నాలజీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భూమి మీద పడే పర్యావరణ భారాల్ని తగ్గించుకుంటూ, అంతరిక్షంలో సమృద్ధిగా దొరికే సౌరశక్తిని వాడుకోవడం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఆలోచనలోని ముఖ్య ఉద్దేశం. కానీ, అంతరిక్షంలో కంపెనీని నడపటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. యంత్రాలను చల్లబరచడం, మరమ్మతులను చూసుకోవడం, రేడియేషన్ ప్రభావం, అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాల వంటి సవాళ్లు కూడా ఉంటాయి.మస్క్ జోరు.. ఇన్వెస్టర్ల హోరు!అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారంటే, అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటుకు స్పేస్ఎక్స్ ప్రయత్నాలు మొదలు పెట్టటమే కారణం. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం రాకెట్ల మీద మాత్రమే డబ్బులు కుమ్మరించటం లేదు, మొత్తం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మీదే ఆశలు పెట్టుకున్నారు. వినడానికే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండే ‘ఆర్బిటల్ డేటా సెంటర్ల’ను నిర్మించేందుకు కుతూహలపడుతున్న కంపెనీల్లో స్పేస్ఎక్స్ చాలా పాపులర్ కావచ్చు కానీ, ఈ పోటీలో ఉన్నది అదొక్కటే కాదు.అదిరే ఐడియా.. బెదిరే భారండేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తే అక్కడ పుష్కలంగా సౌరశక్తి లభ్యం అవుతుంది. భూమి మీదలా స్థలం, నీళ్లు, కరెంట్ గ్రిడ్ల అవసరం ఉండదు. ప్రపంచమంతటా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో భూమి మీద పడుతున్న పర్యావరణ భారాన్ని, మౌలిక సదుపాయాల ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఈ ‘అంతరిక్ష డేటా సెంటర్లు’ ఒక మంచి ఆలోచన అని కంపెనీలు నమ్ముతున్నాయి. పైగా, ఈ డేటా సెంటర్ల వల్ల తమ ప్రాంతంలో సమస్యలు వస్తున్నాయని చాలా చోట్ల స్థానికులు చేస్తున్న ఆందోళనల తలనొప్పి కూడా తప్పుతుంది.అయితే, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి, ఒక పరిశ్రమ స్థాయిలో కంప్యూటింగ్ నెట్వర్క్ను అక్కడ నడపడానికి మధ్య చాలా తేడా ఉంది. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్ల ఎలక్టాన్రిక్ ఉపకరణాలు పాడైపోతాయి. కంప్యూటర్ల వల్ల విపరీతమైన వేడి జనిస్తుంది. అంతరిక్షంలో ఆ వేడిని చల్లబరచడం తేలిక కాదు. చిన్న మరమ్మతుకు కూడా భారీగా ఖర్చవుతుంది. ఇవన్నీ అటుంచి, కింది నుంచి పైకి పంపే ప్రతి కిలో బరువుకీ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.కరెంటుకు, నీళ్లకు ఖర్చు తక్కువభూమి మీద లాగే అంతరిక్షంలో కూడా డేటా సెంటర్లకు భారీ స్థాయిలో విద్యుత్తు అవసరం. అయితే అక్కడ ఈ విద్యుత్ అంతా సౌరశక్తి (సోలార్ ప్యానెల్స్) ద్వారానే లభిస్తుంది. అంతరిక్షంలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, మేఘాలు కూడా అడ్డుపడవు. కాకపోతే, మనం ఆ సోలార్ ప్యానెల్స్ను ఏ కక్ష్యలో పెట్టామనే దాన్ని బట్టి అవి తిరిగేటప్పుడు భూమి అడ్డువచ్చి కొంతసేపు నీడ పడే అవకాశం ఉంటుంది.‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతరిక్షంలో ఉండే ఇంకో ప్రతికూలాంశం ఏంటంటే... కూలింగ్. అంతరిక్షం వెనుక (నక్షత్రాలు, గ్రహాలు లేని శూన్యమైన ఖాళీ అంతరిక్షపు ఉపరితలం) ఉండే వాతావరణం చాలా చల్లగా (దాదాపు మైనస్ 270 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. డేటా సెంటర్ నుండి వచ్చే వేడిని రేడియేటర్ల ద్వారా ఆ ఖాళీలోకి వదిలేయొచ్చు. భూమి మీద ఎక్కువ నీళ్లు వాడుకునే కూలింగ్ సిస్టమ్స్ అవసరం అంతరిక్షంలో ఉండదు. కానీ, ఆ వేడిని బయటకు పంపే థర్మల్ రేడియేటర్ల కోసం చాలా విస్తారంగా స్థలం మాత్రం కావాల్సి ఉంటుంది.అంతరిక్షంలో వేడెక్కిన మిషన్ల మీదకు గాలి పంపి చల్లబరచడానికి అక్కడ గాలే ఉండదు. వేడి అంతా ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్’ (ఉష్ణ కిరణాలు) రూపంలోనే చాలా నిదానంగా బయటకు వెళ్లాలి. దీనివల్ల 10 మెగావాట్ల వేడిని బయటకు పంపించాలన్నా సరే, దాదాపు రెండు ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్ద రేడియేటర్ స్థలం కావాల్సి వస్తుంది. ఇప్పటికే అంతరిక్షం రద్దీగా మారిపోయింది. ఇప్పుడు వేల సంఖ్యలో ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లను స్పేస్లోకి పంపితే ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు, చిన్న చిన్న ఉల్కలు గనక ఈ డేటా సెంటర్ను బలంగా ఢీకొడితే... అది ముక్కలైపోవడమే కాకుండా, అంతరిక్షంలో ఇంకాస్త ఎక్కువ చెత్త తయారవుతుంది.స్పేస్ఎక్స్ డిజైన్ సిద్ధమైంది!ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం అంతరిక్ష డేటా సెంటర్ల డిజైన్లతో ముందుకు దూసుకెళ్తున్నాయి. స్పేస్ఎక్స్ ఈ మధ్యే తన ‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్ను ప్రకటించింది. దీన్ని ఒక ‘ఆర్బిటల్ డేటా సెంటర్ స్పేస్క్రాఫ్ట్’లా వాడాలని దాని ఆలోచన. కాకపోతే, ప్రస్తుతం భూమి మీదున్న డేటా సెంటర్లతో పోలిస్తే దీని సామర్థ్యం 100 నుండి 1,000 రెట్లు తక్కువ.అన్ని రకాల కంప్యూటర్ పనులని స్పేస్లో చేయడం కుదరదు. ఆర్థిక లావాదేవీలు (ఆన్లైన్ పేమెంట్లు), లైవ్ ఏఐ సర్వీసులు, క్లౌడ్ అప్లికేషన్లలో చిన్న ఆలస్యం ఉన్నా వ్యవస్థ అసలే నడవదు. కాబట్టి, ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అనుకునే పనులకి ఈ ఆర్బిటల్ డేటా సెంటర్లు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకు... శాటిలైట్ల నుండి వచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, రక్షణ రంగం లేదా నిఘా విభాగాల డేటా ప్రాసెసింగ్, స్పేస్ మిషన్ల శాస్త్ర పరిశోధన లాంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ మూడూ ఉండాలిక్లౌడ్ కంప్యూటింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. వీటన్నిటినీ ప్రస్తుతం నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శక్తిని ఇచ్చేది ఈ డేటా సెంటర్లే. అంటే, డేటా సెంటర్ అనేది కేవలం సర్వర్లతో నిండిన ఒక రూమ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే!మొదటిది విద్యుత్: ఒక డేటా సెంటర్ ఎలాంటి అవాంతరాలూ లేకుండా నడవాలంటే సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, స్టోరేజ్ సదుపాయాలు కావాలి. ఇవన్నీ నడవడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. ఏఐ రాకతో విద్యుత్ వాడకం మరింతగా పెరిగిపోయింది.రెండవది కూలింగ్ (చల్లబరచడం): సర్వర్లు వాడుకునే కరెంట్ అంతా చివరకు వేడి రూపంలోనే బయటకు వస్తుంది. ఆ వేడిని గనక వెంటనే బయటకు పంపకపోతే పరికరాలు పాడైపోతాయి. అందుకే ఎయిర్ కండిషనర్లు, చిల్లర్లు, కూలింగ్ టవర్లు ఉంటాయి. చాలా డేటా సెంటర్లలో కంప్యూటర్ల తర్వాత అత్యధిక కరెంట్ ఖర్చయ్యేది ఈ కూలింగ్ కోసమే.మూడవది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: కావలసినంత స్థలం, బిల్డింగులు, బ్యాకప్ పవర్ (జెనరేటర్లు), వాటర్ సిస్టమ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, రిపేర్లు చేయడానికి మనుషులు వెళ్లగలిగే సదుపాయం ఉండాలి.కొన్ని సమస్యలూ ఉన్నాయిడేటా సెంటర్ సామగ్రినంతా అంతరిక్షంలోకి చేర్చడానికి వరుసగా రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది, ఇది కింద ఉన్న జనాలకి నచ్చకపోవచ్చు. ఇప్పటికీ టెక్సస్లోని బోకా చికాలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ సెంటర్ దగ్గర స్థానిక యాక్టివిస్టులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ రాకెట్ టెస్టుల వల్ల చుట్టుపక్కల పర్యావరణం పాడైపోతుందని వాళ్ల వాదన. ఇక అన్నిటికంటే ముఖ్యంగా... డేటా మొత్తాన్ని భూమికి, అంతరిక్షంలో ఉన్న డేటా సెంటర్లకి మధ్య రేడియో వేవ్స్ లేదా లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. డేటా సైజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది.ఈ డేటా సెంటర్లను, వాటి సోలార్ ప్యానెళ్లను, రేడియేటర్లను ఒకేసారి స్పేస్లోకి పంపడం కుదరదు. వీటిని విడివిడిగా పంపి, అంతరిక్షంలోనే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్లోనే రిపేర్లు, అసెంబ్లింగ్ చేయగల కొత్త రకం టెక్నాలజీ కావాలి.మరొక ముఖ్యమైన సమస్య.. హార్డ్వేర్ మార్చడం. భూమి మీద అయితే పాతబడిపోయిన సర్వర్లను ప్రతి మూడు నుండి ఐదేళ్లకు ఒకసారి అప్గ్రేడ్ లేదా రీప్లేస్ చేస్తుంటారు. కానీ అంతరిక్షంలో ఈ మార్చడాలు, రిపేర్లు చేయడం చాలా కష్టం. ఒకసారి భూ కక్ష్యలోకి పంపిన హార్డ్వేర్ను అప్గ్రేడ్ చేయడం అంటే అపరిమితమైన ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఆ కంప్యూటర్ సిస్టమ్ను అప్డేట్ చేయలేకపోతే, అది గడువు తీరటానికి ముందే పనికిరాకుండా పోతుంది. టెక్నాలజీ ఇంత స్పీడ్గా మారిపోతున్న ఈ రోజుల్లో... ఇది చాలా పెద్ద ఆర్థికపరమైన భారం.దీనికి తోడు అంతరిక్షంలో ఉండే కఠినమైన వాతావరణం ఇంకో పెద్ద తలనొప్పి. అవి తిరిగే కక్ష్యను బట్టి... రోజులో చాలాసార్లు ఎండ తగిలినప్పుడు విపరీతమైన వేడి, భూమి నీడలోకి వెళ్లినప్పుడు విపరీతమైన చలిని తట్టుకోవాల్సి ఉంటుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
ప్రియమైన జాబిల్లి...
జలజలా జారిపడుతన్న జలపాతాన్ని చూస్తే...మనలాంటోళ్లు..‘‘అబ్బా.. ఎంత బాగుందో’’ అనుకుంటాం. అదే జలధార...ఓ కవి కంట పడితే.. ఉర్రూతలూగించే కవిత పుట్టుకొస్తుంది.. చిత్రకారుడి కుంచె కదిలి పాలనురగల్లో సప్తవర్ణాలు విరబూస్తాయి! చిత్రదర్శకుడి కెమెరా కన్ను.... మరిన్ని కోణాలను ఆవిష్కరించేస్తాయి! మరి.. ఈ కళాకారులు అందరూ ఒక్కసారి జాబిల్లి అందాలను చూస్తే... ఎంత కవిత్వం వస్తుంది ? ఎంత భావుకత ఉట్టిపడుతుంది ? జపాన్ కోటీశ్వరుడు యుసాకూ మెజవాతోపాటు వీరందరూ జాబిల్లిని చుట్టేయనున్నారు మరి! అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చంద్రుడిపైకి తొలిసారిగా టూరిస్టును పంపడానికి సన్నాహాలు చేస్తోంది. స్పేస్ ఎక్స్కి చెందిన బిగ్ ఫాల్కన్ రాకెట్ (బీఎఫ్ఆర్)లో 2023లో ఈ యాత్ర చేపట్టబోతోంది. జపాన్కు చెందిన బిలయనీర్ యుసాకూ మెజావా మొదటి స్పేస్ టూరిస్ట్గా రికార్డులకెక్కబోతున్నారు. అయిదు రోజుల పాటు జాబిల్లి అందాల్ని చూస్తూ గడపనున్నారు. చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతూ చుక్కలతో కబుర్లు చెబుతూ గొప్ప గొప్ప అనుభూతుల్ని మూటకట్టుకోనున్నారు. కళాకారుల సమేతంగా యూసకూ మెజవా ఆనందానికి ఇప్పుడు జాబిల్లే హద్దు. ఆయన ఈ యాత్రపై అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారుల్ని వెంట తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలు, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పాకళాకృతులు వంటి విభాగాల్లో రాణిస్తున్న వారిని తన వెంట తీసుకువెళతారు. స్వయంగా రాక్ డ్రమ్మర్ అయిన మెజవా కళాకారులైతే చంద్రుడిపై అనుభూతుల్ని తిరిగి భూమికి వచ్చాక అందరికీ అందంగా పంచుతారని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. కళాకారుల ఖర్చులు కూడా ఆయనే స్వయంగా భరిస్తారు. ఈ యాత్రకు ప్రియమైన జాబిల్లి అంటూ ప్రత్యేకంగా ఒక పేరు కూడా పెట్టేసుకున్నారు. 42 ఏళ్ల వయసున్న యుసాకూ మెజవా జపాన్లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే. మెజవా ఆన్లైన్ ఫ్యాషన్ దిగ్గజం కూడా. స్టార్ట్ టుడే కంపెనీతో జపాన్ ఫ్యాషన్ రంగంలో ఆయన ఒక ఐకాన్గా నిలిచారు. మెజవా మొదట్లో టీ షర్ట్లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్లు సేకరణ మొదలు పెట్టారు. ఎక్కడ అరుదైన పెయింటింగ్ల వేలం జరిగినా అక్కడ మెజవా ప్రత్యక్షమైపోతారు. లక్షల డాలర్లు పోసి పెయింటింగ్లు కొనేస్తున్నారు. అలా అమెరికా కళాకారుడు జీన్ మైకేల్ బాస్క్విట్ వేసిన ఒక పెయింటింగ్కు ఆయన ఫిదా అయిపోయారు. ఆ పెయింటింగ్ చూసిన తర్వాతే అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆలోచన కలిగింది. తనతో పాటు కొందరు కళాకారుల్ని కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాస్క్వట్ ఏమైనా చంద్రుడ్ని అత్యంత సమీపం నుంచి చూశారా ? లేదంటే అంతరిక్షం నుంచి భూమిని కానీ చూశారా ? అంత అద్భుతంగా పెయింటింగ్ వేయడం ఎలా సాధ్యమైందో అంటూ మెజవా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల శరీరాలు తట్టుకోగలవా ? స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ చంద్రుడిపైకి యుసాకూ మెజవా, ఆయనతోపాటు కొందరు కళాకారులు వెళతారని ప్రకటించిన దగ్గర్నుంచి అసలు వాళ్ల శరీరాలు ఈ ప్రయాణాన్ని తట్టుకోగలవా అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వ్యోమగాములకైతే జీరో గ్రావిటీలో ఉండే శిక్షణ అదీ కఠోరంగా ఇస్తారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నవారినే ఎంచుకుంటారు. మరి సామాన్యులు ఈ ప్రయాణాన్ని ఎంతవరకు తట్టుకోగలరు ? దీనిపై ఏరోస్పేస్ మెడిసన్ స్పెషలిస్టు డాక్టర్ పెట్రా ఇల్లిగ్ ఏమో ఏమైనా జరగొచ్చు అంటూ కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. అంతరిక్షంలోకి మొదటి సారి వెళ్లే వ్యక్తిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. భావోద్వేగాలు కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇక కడుపులో వికారం, వాంతులు దగ్గర్నుంచి గుండెపోటువరకు ఏమైనా రావొచ్చు. అయితే మెజావా కళాకారుల బృందం వెళ్లేది నాలుగైదు రోజులే కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని పెట్రా చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్లో ఉండాల్సి వస్తే మాత్రం మైక్రోగ్రావిటీలో ఉన్న సమయంలో కండరాల పటుత్వం తగ్గిపోవడం, ఎముకల బలహీనంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. టేకాఫ్ నుంచే ఆరోగ్య సమస్యలు వాస్తవానికి ప్రయాణికులకు సమస్యలు రాకెట్ టేకాఫ్ అయిన దగ్గర్నుంచి మొదలవుతాయి. చంద్రుడిపైకివెళ్లే క్రమంలో మన శరారానికి అలవాటైన గురుత్వాకర్షణ శక్తికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీని వల్ల గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అంతరిక్ష యాత్ర మొదలు పెట్టడానికి ముందే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భూకక్ష్య దాటిపోయాక బరువు తగ్గిపోవడం అన్నది సమస్యగా ఉంటుంది. చంద్రుడిపైకి వెళితే మన శరీరం ఒక్కసారిగా బరువుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల విరోచనాలు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇక అంతరిక్షంలోకి వెళ్లాక కడుపులో వికారం అన్నది సర్వసాధారణం. అది సర్దుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. చంద్రుడిపైకి ఈ యాత్ర నాలుగైదు రోజులే ఉంటుంది కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్లందరికీ కడుపులో వికారం, వాంతి వచ్చినట్టుగా అనిపించడం అనే సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఇక ఖగోళ రేడియో ధార్మికత అన్నది మరో సమస్య. బిగ్ ఫాల్కన్ రాకెట్ చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతుంది కాబట్టి ఈ రేడియేషన్ వారిని ఎక్కువగా బాధించే అవకాశాలున్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది మానసిక ఒత్తిడి. ఒక్కసారి స్పేస్ షిప్లోకి ప్రవేశించాక ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులైనా రావొచ్చు. ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదురు కావచ్చు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే మానసిక బలం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం వారందరికీ తగిన శిక్షణ ఇస్తామని ఎలన్ మస్క్ చెబుతున్నారు. స్పేస్ టూరిస్టులందరికీ తగినంత శిక్షణ ఇచ్చాకే చంద్రుడిపైకి యాత్ర ప్రారంభిస్తామని ఆయన వివరించారు. జపాన్ ఫ్యాషన్ ఐకాన్ మెజావా.. 42 ఏళ్ల వయసున్న యుసాకు మెజావా జపాన్లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే. మెజావా ఆన్లైన్ ఫ్యాషన్ దిగ్గజం కూడా. స్టార్ట్ టుడే కంపెనీతో జపాన్ ఫ్యాషన్ రంగంలో ఆయన ఒక ఐకాన్గా నిలిచారు. మెజావా మొదట్లో టీ షర్ట్లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు. -
హైదరాబాద్ టు వైజాగ్.. గంటలోపే?
గూడ్సు బండిలో వెళ్లేవాణ్ణి గోదావరి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? గమ్మత్తుగా ఉంటుంది. అమ్మో!! ఎంత స్పీడో! అనిపిస్తుంది. మరి గోదావరిలో వెళ్లేవారు కాస్తా... భోపాల్ శతాబ్ది ఎక్కితేనో? ఆశ్చర్యానికి అంతుండదు. ఆ వేగానికి కళ్లు తిరుగుతాయి!!. అవును మరి! దేశంలో గూడ్సు రైలు స్పీడు గంటకు పాతిక కిలోమీటర్లు. అదే గోదావరి అయితే రెట్టింపు... అంటే 57 కిలోమీటర్లు. ఇక భోపాల్ శతాబ్ది అయితే ఏకంగా గంటకు 150 కిలోమీటర్లు. దేశంలో అత్యధిక వేగంతో వెళుతున్న రైలు ఇదే. ఒకరకంగా హైస్పీడ్ రైలన్న మాట. ఇలాంటి రైళ్లను ఇంకా తెస్తామని, మరింత వేగంగా వెళ్లే హైస్పీడ్ రైళ్లను నడుపుతామని ప్రభుత్వాలు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నాయి. ఈ మధ్యే చర్యలు ఊపందుకున్నాయి కూడా. మన దేశంలో ఇవి అందరికీ ఎప్పుడు అందుబాటులోకొస్తాయో తెలీదు. కొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇదంతా ఎందుకంటే... మనం హైస్పీడ్ రైళ్ల కోసం మాట్లాడుకుంటుంటే... ప్రపంచం హైపర్లూప్ టెక్నాలజీవైపు పరుగు పెడుతోంది. అంటే... భూమ్మీద అతివేగంగా వెళ్లే రైలన్నమాట. ఇంకా చెప్పాలంటే... భూమ్మీదే కాదు. ఆకాశంలో వెళ్లే విమానాలూ దీని వేగాన్ని అందుకోలేవు. మూడేళ్ల కిందట టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ బయటపెట్టిన ఈ ఆలోచన... మరో మూడేళ్లలో అమెరికాలోని లాస్ ఏంజిలిస్లో పట్టాలెక్కడానిక్కూడా సిద్ధమవుతోంది. భారతదేశ నాయకత్వం చెబుతున్న హైస్పీడ్ రైళ్లు ఒట్టి దండగని, అవి భవిష్యత్తు తరాలకు పెను భారంగా మారతాయని కూడా ఈ హైపర్లూప్ టెక్నాలజీ కంపెనీలు చెబుతున్నాయి. ఇండియాలో రెండు కారిడార్లు దీన్ని అమలు చేయటానికి పనికొస్తాయని తాము గుర్తించినట్లు కూడా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో... అసలు ఈ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏఏ కంపెనీలు పనిచేస్తున్నాయి? ఎన్నాళ్లలో అమల్లోకి రావచ్చు? అసలు ఇండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందెవరు? అవన్నీ నిజమేనా...? ఈ వివరాల విశ్లేషణే ఈ వారం ‘ఫోకస్’. భూమి మీద విమానాన్ని మించిన వేగం హైపర్లూప్ సొంతం * గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి వీలు- వాక్యూమ్ ట్యూబ్తో ట్రాక్... దానిపై ట్యూబుల్లాంటి పెట్టెలు- గాలి నిరోధం ఉండకపోవటంతో తక్కువ ఇంధనం చాలు * ట్రాక్పై సోలార్ ప్యానెళ్లు... గాలి మరలతో విద్యుదుత్పత్తి * సొంత అవసరాలకు పోగా 30 శాతం ఇంధనం మిగిలే అవకాశం- 2013లో ఆవిష్కరించిన స్పేస్ ఎక్స్ అధిపతి ఇలాన్ మస్క్ * రెండేళ్ల కిందట నిధులతో సహా ఆవిర్భవించిన రెండు కంపెనీలు * అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాల్లో చురుగ్గా టెస్ట్ ట్రాక్ నిర్మాణం * 2019 నాటికి ప్రయోగాత్మక పరుగు పూర్తి! * యూరప్, అమెరికాల్లో పలు లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు * ఇండియాలోనూ రెండు లైన్లను గుర్తించామన్న హెచ్టీటీ * హైస్పీడ్ రైళ్లు దండగని, భవిష్యత్తు తరాలకు భారమని వ్యాఖ్య * దానిబదులు హైపర్లూప్ నిర్మిస్తే మంచిదన్న హెచ్టీటీ సీఓఓ * స్లొవేకియాతో హెచ్టీటీ ఒప్పందం; దుబాయ్తో కూడా? ఇలాన్ మస్క్. టెక్నాలజీ ప్రపంచంలో ఈయన గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాలో పుట్టి, కెనడాలో చదివిన ఈ టెక్ మేధావి... 12 ఏళ్లకే ఓ గేమ్ను తయారుచేసి విక్రయించాడు. పాతికేళ్లకే ఓ సాఫ్ట్వేర్తో... న్యూయార్క్ టైమ్స్, షికాగో ట్రిబ్యూన్ వంటి పత్రికల్ని తన క్లయింట్లుగా చేసుకున్నాడు. పేమెంట్ దిగ్గజం ‘పే పాల్’, ఎలక్ట్రిక్ కార్ల సంచలనం ‘టెస్లా’... ప్రయివేటు ‘నాసా’గా మారిన ‘స్పేస్ ఎక్స్’... ఇవన్నీ మస్క్ సంచలనాలే. చౌక అంతరిక్ష ప్రయాణాన్ని సుసాధ్యం చేస్తానని, అంగారకుడిపై కాలనీ నిర్మిస్తానని చెప్పటమే కాదు... అందుకోసం రాకెట్ల తయారీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ను ఏర్పాటు చేసి, విజయవంతంగా రాకెట్లను తయారు చేసి చూపించాడు మస్క్. వాక్యూమ్ ట్యూబ్ల వంటి సాధనాల్లో భూమ్మీద అతి వేగంగా ప్రయాణించొచ్చుననే కాన్సెప్ట్ను 2013లో మస్క్ బయటపెట్టి... దానికి ‘హైపర్లూప్’ అనే పేరు పెట్టాడు. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఎవరైనా అభివద్ధి చేయొచ్చునని ప్రకటించాడు. అది జరిగిన ఏడాదికి... ఈ టెక్నాలజీ కోసం తాము నిధులు సమీకరించామని ‘హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (హెచ్టీటీ)’ సంస్థ ప్రకటించింది. తరవాత... తామూ రేసులో ఉన్నట్లు ‘హైపర్లూప్ ఒన్’ అనే మరో సంస్థ ప్రకటించింది. వైమానిక రంగంలో బోయింగ్, ఎయిర్బస్ల మాదిరి హైపర్లూప్ రంగంలో ప్రస్తుతం ఈ రెండే క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? ♦ హైపర్లూప్ టెక్నాలజీని అమలు చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్గాల్ని ప్రతిపాదించారు. వాటిలో మొదటిది అమెరికాలోని లాస్ ఏంజిలిస్ - శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా. దూరం 560 కిలోమీటర్లు. 35 నిమిషాల్లో ప్రయాణించొచ్చనేది ఆలోచన. ♦ ఈ ఏడాది జనవరిలో... పారిస్ - ఆమ్స్టర్డ్యామ్ హైపర్లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ♦ పోలండ్లోని క్రాకో నుంచి గాన్స్క్ వరకూ 581 కిలోమీటర్ల మార్గాన్ని హైపర్ పోలండ్ సంస్థ ప్రతిపాదించింది. ♦ ఫిన్లండ్లోని హెల్సింకీ నుంచి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ వరకూ సముద్ర మార్గంలో టన్నెల్ ద్వారా 484 కిలోమీటర్ల హైపర్లూప్ వేయాలనే ప్రణాళికలూ ఊపందుకున్నాయి. ♦ హెచ్టీటీ సంస్థ లాస్ ఏంజిలిస్- శాన్ఫ్రాన్సిస్కో మార్గంతో పాటు ఇతర మార్గాలనూ చూస్తోంది. ♦ హైపర్లూప్ ఒన్ సంస్థ మాత్రం లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మార్గాన్ని ప్రతిపాదిస్తోంది. ♦ బ్రటిస్లావా - బుడాపెస్ట్ - వియెన్నా మధ్య హైపర్లూప్ను నడిపితే ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చెయ్యటానికి ఈ మధ్యే స్లొవేకియా ప్రభుత్వంతో హెచ్టీటీ ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది. ♦ దుబాయ్ ప్రభుత్వం కూడా హెచ్టీటీతో సంప్రతింపులు జరుపుతోందని, ఒప్పందం కుదిరితే తొలి హైపర్లూప్ అక్కడే పరుగు పెడుతుందని ఇంటర్నెట్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ♦ ఇండియాలో దీనికి అనుకూలమైన రెండు కారిడార్లను గుర్తించినట్లు హెచ్టీటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిబోప్ గ్రేష్టా ఇటీవలే చెప్పారు. ఇదీ టెక్నాలజీ..? హైస్పీడ్ రైళ్లలో ఉండే ఇబ్బందుల్లో ప్రధానమైనవి... 1. యంత్ర పరికరాల మధ్య ఘర్షణ, 2. గాలి నిరోధం. వేగం పెరుగుతున్న కొద్దీ గాలి నిరోధం ఎక్కువవుతుంది. దాన్ని అధిగమించాలంటే భారీ ఇంధనం కావాలి. ఇక ఘర్షణ వల్ల యంత్రపరికరాలు దెబ్బతినటం, నిర్వహణ వ్యయం భారీగా పెరగటం జరుగుతోంది. హైపర్లూప్లో వాడే ‘వాక్ట్రయిన్’లో ఈ రెండు సమస్యలూ ఉండవు. ఎందుకంటే వాక్ట్రయిన్ ఒక ట్యూబ్లో నడుస్తుంది. ఆ ట్యూబ్లో గాలి ఉండదు. వాక్యూమ్ లేదా పాక్షిక వాక్యూమ్ ఉంటుంది. దీంతో ఎంత వేగంగా వెళ్లినా గాలి నిరోధం ఉండదు. ఇక యంత్రపరికరాల మధ్య ఘర్షణ ఉండదు కనక నిర్వహణ వ్యవయమూ తక్కువే ఉంటుంది. పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం చేసి... ఆ ట్యూబ్లో చిన్న చిన్న ‘పోడ్’లాంటి వాక్ ట్రయిన్లు నడుపుతారన్న మాట. తొలి డిజైన్ ప్రకారం... ఈ పోడ్ల ఎత్తు కేవలం 7.4 అడుగులే ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 1,220 కి.మీ. హెచ్టీటీ.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న 500 మంది ఇంజినీర్ల బందమే ఈ కంపెనీ. వీరంతా వారానికోసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలుస్తుంటారు. వీరికి జీతాల్లేవు కానీ కంపెనీలో వాటాలున్నాయి. 2015లోనే సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేయాలనుకుంది. కానీ కుదరలేదు. అయితే కాలిఫోర్నియాలో టెస్ట్ ట్రాక్ను నిర్మించడానికి సంబంధించి స్థానిక భూ యజమానులతో ఒప్పందాలు పూర్తయినట్లు గతేడాదే సంస్థ ప్రకటించింది. ట్రాక్ నిర్మాణంలో సహకారినికి ఓర్లికాన్ లేబోల్డ్ వాక్యూమ్, ఏకామ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. గతేడాది నవంబరులో పనలు మొదలయ్యాయి. 150 మిలియన్ డాలర్ల వ్యయంతో (రూ.1,000 కోట్లు) రెండున్నరేళ్లలో ప్రయోగం పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. హైపర్లూప్ ఒన్.. లాస్ ఏంజిలిస్- లాస్వెగాస్ మధ్య హైపర్లూప్ నడపాలని ఆలోచిస్తున్నామంటూ 2015లో ప్రకటించటం ద్వారా ఈ సంస్థ తెరమీదికొచ్చింది. ఇంజినీర్లు, డెరైక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి... నిర్వహణ ఖర్చుల కోసం 9 కోట్ల డాలర్ల నిధులను సమీకరించినట్లు కూడా ప్రకటించింది. 100 మంది ఇంజినీర్లున్న ఈ సంస్థకు... ఇలాన్ మస్క్తో గట్టి సంబంధాలున్న షెర్విన్ పిషేవర్ సహ వ్యవస్థాపకుడు. స్పేస్ ఎక్స్కు లీడ్ ఇంజినీర్గా వ్యవహరించిన బ్రోగన్ బాంబ్రోగన్ మరో వ్యవస్థాపకుడు. అంతేకాదు! మస్క్కు నేరుగా దీంతో సంబంధాలు లేకున్నా ఆయన సన్నిహితులు పలువురు దీన్లో ఉన్నారు. ఎప్పకటిప్పుడు ఆయనకు అన్నీ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మే 11న హైపర్లూప్ ఒన్ తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా పరీక్షించింది. జులైలో... హెల్సింకీ- స్టాక్హోమ్ మధ్య హైపర్లూప్కు అవకాశాలు బాగున్నాయంటూ తమ అధ్యయన నివేదికను బయటపెట్టింది. ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం అర్ధగంటకు పరిమితమవుతుందని, నిర్మాణ వ్యయం 19 బిలియన్ యూరోలుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే. ట్రాన్స్పాడ్.. ఈ సంస్థ ట్యూబ్లో నడిచే వాహనాల్ని (పాడ్) డిజైన్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ఏడాది మార్చిలో కొత్త డిజైన్ను విడుదల చేసింది. వచ్చే నెల బెర్లిన్లో జరిగే ఇన్నో ట్రాన్స్రైల్ షోలో పూర్తిస్థాయి డిజైన్ను ఆవిష్కరిస్తామని చెబుతోంది. ఈ పాడ్ను వెయ్యి కిలోమీటర్లకన్నా ఎక్కువ వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. నియంత్రణ పూర్తిగా కంప్యూటర్ ఆధారంగానే ఉంటుంది. సోలార్ పవర్తో నడిచేలా చూస్తున్నారు. 2020 నాటికి తొలి పాడ్ను ఉత్పత్తి చేస్తామని సంస్థ చెబుతోంది. టొరంటో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ... మాంట్రియల్ -టొరంటో మధ్య దీన్ని నడపాలని కూడా ప్రతిపాదిస్తోంది. ఇది యూరప్లోని పలు వర్సిటీలు, ఏరోస్పేస్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ప్రయోగాలకు ట్రాక్లు... ⇒ హెచ్టీటీ, హెచ్ఒన్లతో పాటు హైపర్లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్ను బయటపెట్టిన స్పేస్ ఎక్స్ కూడా ప్రయోగాలకు సిద్ధమయింది. ⇒ కాలిఫోర్నియాలోని క్వే వ్యాలీలో 8 కిలోమీటర్ల టెస్ట్ ట్రాక్ను హెచ్టీటీ నిర్మిస్తోంది. ⇒ కాలిఫోర్నియాలోని హాతోర్న్లో 1.6 కిలోమీటర్ల టెస్ట్ట్రాక్ను స్పేస్ఎక్స్ చేపట్టింది. ⇒ నెవెడాలోని నార్త్ లాస్ వెగాస్లో హైపర్లూప్ ఒన్ టెస్ట్ ట్రాక్ను ఏర్పాటు చేస్తోంది.


