breaking news
Bidu Lands
-
‘సూర్య’ గ్రహణంపై లోకాయుక్త విచారణ
సాక్షి ఎఫెక్ట్.. * ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని మహబూబ్నగర్ కలెక్టర్కు ఆదేశం * ‘సాక్షి’ కథనంతో కదలిన అధికారులు * బీడుగా పేర్కొన్న భూముల్లో పొలాలు, పండ్ల తోటల గుర్తింపునకు చర్యలు సాక్షి, హైదరాబాద్, కేటిదొడ్డి: సాగు భూములను బీడు భూములంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై దాఖలైన పిటిషన్ను తెలంగాణ, ఏపీల ఉమ్మడి లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి ఇప్పటికే విచారణకు స్వీకరించారు. ఈ అంశంలో రెవెన్యూ అధికారుల బాధ్యతారాహిత్యంపై లోకాయుక్త విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అయితే మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలో సోలార్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 5,622 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. అక్కడి అసైన్డ్ భూములకు పరిహారం ఎగ్గొట్టేందుకు.. ఆ భూములన్నీ బీడుగా ఉన్నాయని, వాటి అసైన్మెంట్ను రద్దు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తలో పిటిషన్ నమోదైంది. తోటల గుర్తింపునకు అధికారుల కసరత్తు పచ్చని పంట పొలాలను బీడు భూములని పేర్కొంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పేద రైతులకు ‘సూర్య’గ్రహణం’ కథనం చర్చనీయాంశమైంది. దీనిపై ఉన్నతాధికారులు స్థానిక అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో కాలూర్తిమ్మన్దొడ్డిని బుధవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వీఆర్వో రవి సందర్శించి... అసైన్డ్ భూముల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరించారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు అధికారుల తీరును తప్పుబట్టారు. రైతుల ఆవేదనను ‘సాక్షి’ కథనం కళ్లకు కట్టినట్లు చూపిందని కుచినేర్ల, కాలూర్తిమ్మన్దొడ్డి గ్రామ రైతులు పేర్కొన్నారు. 6 నుంచి 10 ఏళ్ల తోటలున్న భూములను కూడా అధికారులు గుడ్డిగా బీడుగా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడమేమిటన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అలాగని అడ్డదారిలో, పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తాం సోలార్ ప్రాజెక్టు పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు రాష్ట్ర అసంఘటిత కార్మిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్రావు వెల్లడించారు. సోలార్ ప్రాజెక్టు పేరుతో 18 వేల మంది రైతుల కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల తరఫున తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు. -
బీడు భూములకు మహర్దశ
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని బీడు భూములకు మహర్దశ రానుంది. ప్రతి వర్షం చుక్క సాగుకు ఉపయోగకరంగా మరల్చడం, అడుగంటి పోతున్న భూగర్భజలాలు పెంపుకోసం ఇటు సాగునీటి వనరుల పెంపు, అటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న వాటర్ షెడ్ పనుల కోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పనుల కింద రూ. 23 కోట్లు మంజూరు అయినట్లు ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు విడుదలైన రూ.23.37 కోట్లతో జిల్లాలోని ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో రూ.705 లక్షలతో, చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 578.61 లక్షలతో, పాల్వంచలోని పాయకారి యానంబైలులో 634.64 లక్షలతో, కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి గ్రామంలో 419.72 లక్షలతో ఆయా ఏజెన్సీల ఆధ్వర్యంలో పనులు చేపడుతామని అధికారులు వెల్లడించారు. ఏరియా గుర్తింపుకు ప్రమాణాలు.. కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టే వాటర్ షెడ్ పనులకు రైతులకు, కూలీలకు ఉపయోగపడటంతోపాటు పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ల్యాండ్రెవెన్యూ న్యూఢిల్లీ సంచాలకులు వాటర్షెడ్ ఏరియాను గుర్తించేందుకు 13 ప్రమాణికాలను సూచించారు. ఇందులో వాటర్ షెడ్ పనులు చేపట్టే ప్రాంతంలో పేదరిక జనాభా శాతం,ఎస్సీ,ఎస్టీ జనాభాశాతం, సరాసరి దినసరి కూలిశాతం, చిన్న, సన్న కారు రైతుల శాతం, భూగర్భ జలాలస్థితి, తేమ సూచిక, వర్షాధారపు భూమి విస్తీర్ణం. తాగునీటి పరిస్థితి, కొరత, బంజర భూములు/క్షీణతకు గురైన భూములు, భూమి ఉత్పాదక శక్తి, వాటర్ షెడ్ పథకం అమలు చేస్తున భూములకు దూరం, సమమైన భూములలో వివిధ గ్రామాలు/ మైక్రో వాటర్షెడ్ సమూహాలు, గుట్టలలో ఉన్న వివిధ గ్రామాల సమూహం. మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా సగటున 1000-5000 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కొన్ని గ్రామాల సముదాయం ఒక్క ప్రాజెక్టుగా చేపడుతారని జిల్లా వాటర్ షెడ్ నిర్వాహకాధికారి విజయ్చందర్ తెలిపారు. ఎంపిక చేసిన ప్రాజెక్టును 4నుండి 7 సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నిరుపేదలకు జీవనోపాధి... వాటర్షెడ్ పథకంలో ప్రాజెక్టు నిధుల నుంచి 9 శాతం బడ్జెట్ కేటాయించారు. ఇందులో 5 శాతం నిధులు సెర్ఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. మిగిలిన 4 శాతం నిధులు డ్వామా పరిధిలో వాటర్షెడ్ పథకంలోని గ్రామాల్లో ఉన్న గ్రామ సమాఖ్యల ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, వ్యవసాయేతర జీవనోపాధికి సమకూరుస్తారు. ఈ నిధులను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ద్వారా ఖర్చు చేస్తారు. అదేవిధంగా వాటర్షెడ్ పథకంలో సహజ వనరుల యాజమాన్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి 56 శాతం నిధులు కేటాయించారు. క్షీణిస్తున్న సహజ వనరులైన భూమి, నీరు, పచ్చదనం, పశు సంపద, మానవ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. భూమిని ఎత్తు నుంచి పల్లపు ప్రాంతం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ పథకం సమన్వయంతో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి పనులు చేపట్టేందుకు కార్యక్రమం రూపొందించారు. దీనికింద చెక్డ్యామ్ లు, చెక్ వాల్స్, రాతి కట్టడాలు, ఫారంపాండ్, నాడెప్ కంపోస్ట్ ఎరువు గుంత, నీటి నిల్వ కందకాలు, చిన్న ఊట కుంట, ఊటగుంత, రోడ్డు ఇరువైపులా మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు.