breaking news
Banking bad loans
-
మొండి బకాయిలకు ఇక బ్రేక్
ఈ సమస్యనుంచి గట్టెక్కుతాం * ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ధీమా * పటిష్ట దేశాభివృద్ధే ఏకైక లక్ష్యమని ఉద్ఘాటన న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిలు (ఎన్పీఏ) తారస్థాయికి చేరిపోయాయని, ఇక్కడ్నుంచి పెరిగే అవకాశం లేదని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్టీల్, విద్యుత్, రహదారులు, చక్కెరసహా ఒత్తిడిలో ఉన్న ఆరు ప్రధాన రంగాలు- మెరుగుపడుతున్నాయని.. ఇది ఎన్పీఏల విషయంలో పరిస్థితి కుదుటపడ్డానికి దారితీస్తుందని అన్నారు. తగిన వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో దేశాభివృద్ధి మరింత వేగవంతం కావడం ఖాయమని పేర్కొన్నారు. గ్రామీణ డిమాండ్ పెరగడం, పెట్టుబడులు వేగవంతం కావడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడేవిగా వివరించారు. వేగవంతమైన దేశాభివృద్ధి రేటు సాధనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్... ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయా అంశాలను క్లుప్తంగా చూస్తే... సంస్కరణలపై వెనక్కు తగ్గం... సంస్కరణలపై ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా త్వరలో వస్తు సేవల పన్ను అమల్లోకి వస్తుందని విశ్వసిస్తున్నాం. యూపీఏ మిత్రపక్షాల్లో కొన్ని దీనికి మద్దతు నిస్తున్నాయి. కాంగ్రెస్ దీనిని అడ్డుకోవడం తగదు. ఏకాభిప్రాయ సాధనకు చేయాల్సింది అంతా చేస్తాం. లేదంటే పార్లమెంటరీ వోటే ప్రత్యామ్నాయం. ఇక దివాలా బిల్లు ఆమోదం తరువాత ముఖ్యమైన నాలుగైదు సంస్కరణల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ త్వరగా అమలు జరగడానికి ప్రభుత్వం తగినచర్యలు అన్నీ తీసుకుంటుంది. సింగపూర్తోనూ ‘పన్ను’ ఒప్పందం: మారిషస్ ద్వారా షేర్లలో పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును భారత్లో విధించడానికి సంబంధించి ఇటీవల ఆ దేశంతో జరిగిన ఒప్పందం కీలకమైనది. ఈ తరహా ఒప్పందాన్నే సింగపూర్తో కూడా చేసుకోవాల్సి ఉంది. ఇందుకు తగిన చర్చలను ఆర్థిక శాఖ అధికారులు జరుపుతున్నారు. అయితే ఎప్పటిలోగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయో చెప్పలేను. ఆర్బీఐతో సంబంధాల ‘పరిపక్వత’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో ఆర్థిక మంత్రిత్వశాఖకు పరిపక్వతతో కూడిన సంబంధాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ పరస్పర సహకారంతో ప్రభుత్వం-ఆర్బీఐ ముందుకు వెళుతున్నాయని కూడా జైట్లీ చెప్పారు. కాగా, ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ను మరోవిడత కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు... అది ఇప్పుడు అనవసర విషయం అంటూ సమాధానాన్ని దాటవేశారు. మాల్యాను వెనక్కు తెచ్చే యత్నం... బ్యాంకింగ్ రుణ ఎగవేతల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్మాల్యాను లండన్ నుంచి తీసుకురావడానికి భారత్ విచారణా సంస్థలు తగిన అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ‘మాల్యాను బహిష్కరించలేమంటూ బ్రిటన్ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో... ఆయనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి చార్జ్షీట్ దాఖలయిన తర్వాత బ్రిటన్ను ఆయనను ‘అప్పగించాలని’ కోరడానికి సంబంధించిన ప్రక్రియను భారత్ ప్రారంభిస్తుంది. రుణ బకాయిలను రాబట్టుకోడానికి బ్యాంకులు కూడా తగిన ప్రయత్నం అంతా చేస్తాయి. విచారణా సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తాయి’ అని ఆర్థిక మంత్రి చెప్పారు. -
మొండిబకాయిలను నైతికతతో ముడిపెట్టలేం
దీనికి అనేక కారణాలున్నాయ్.. ఆర్బీఐ గవర్నర్ రాజన్ న్యూయార్క్: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య తీవ్రమయిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ దీనిపై కీలక వ్యాఖ్య చేశారు. ఒక అకౌంట్ మొండిబకాయిగా మారడానికి పలు కారణాలు ఉంటాయని పేర్కొన్న ఆయన, ఈ అకౌంట్ల న్నింటికీ నైతికతను జోడించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మొండిబకాయిల సమస్యల్లో ఇరుక్కున్నవారిలో మంచి వారూ, చెడ్డవారూ... ఇద్దరూ ఉంటారని విశ్లేషించారు. న్యూయార్క్లో కొలంబియా లా స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొండిబకాయిల సమస్యను పరిష్కరించే క్రమంలో... దీనిని ‘నేరపూరిత అంశానికి’ దూరంగా ఉంచాలని సూచించారు. ఒక కంపెనీ మొండిబకాయి సమస్యలో కూరుకుపోవడంలో పలు కారణాలు ఉంటాయని అన్నారు. ‘మీ భాగస్వామి సరిగా పనిచేయకపోవచ్చు. తగిన సమయంలో అనుమతులు రాకపోవచ్చు. మీ లెసైన్సులను రద్దు చేసి ఉండవచ్చు. ఇవన్నీ మీకు ప్రతికూలంగా మారవచ్చు. ఇలా ఒకరు చేసిన తప్పుకూ మీరు నష్టపోయే వీలుంది. వీటిని నేరపూరితంగా పరిగణించలేం’ అని ఈ సందర్భంగా రాజన్ అన్నారు. ప్రభుత్వ ప్రకటన సానుకూలం... రుణ మంజూరు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేయడం పట్ల రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కీలకమైన అంశంగా పేర్కొన్న ఆయన, బ్యాంకుల్లో నిర్వహణా వ్యవస్థ మెరుగుదలపై తదుపరి దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్పీఏల సమస్య పరిష్కారంలో ఇది కీలక అంశమని సైతం అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారంలో తగిన చట్ట నిబంధనల వ్యవస్థ కూడా అవసరమని వివరించారు. ఈ అంశంపై ఇప్పుడు న్యాయవ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. వర్షపాతం, ద్రవ్యోల్బణం కీలకం.. తదుపరి వడ్డీరేటు కోత నిర్ణయం వర్షపాతం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని రాజన్ అన్నారు. భారత్కు ఈ ఏడాది భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయని అన్నారు. -
భారత్కు మొండిబకాయిల సమస్య: ఓఈసీడీ
కౌలాలంపూర్: వర్థమాన ఆసియా దేశాల్లో భారత్ వృద్ధి స్థాయిలు బాగున్నాయని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని, 2016-17లో ఈ రేటు 7.3 శాతానికి మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. 2016-20 మధ్య భారత్లో సగటు వృద్ధి రేటును 7.3 శాతంగా అంచనా వేస్తోంది. కాగా భారత్ వృద్ధి బాటలో బ్యాంకింగ్ మొండిబకాయిల అంశం ఒక సవాలని తన తాజా విశ్లేషణా పత్రం ప్రకారం. 2015లో వర్థమాన ఆసియా దేశాల వృద్ధి రేటు 6.5 శాతం. 2016 నుంచి 20 వరకూ ఈ రేటు సగటున 6.2%గా ఉంటుంది. భారత్ వృద్ధి ధోరణి కొనసాగుతుంటే... చైనా నెమ్మదిస్తుంది. ఆసియాన్ ప్రాంతం 2015లో 4.6% వృద్ధి రేటు సాధిస్తుంది.