భవిష్యత్తులో మంచి రోజులు | Good days in future | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో మంచి రోజులు

Aug 16 2015 3:07 AM | Updated on Aug 31 2018 8:24 PM

భవిష్యత్తులో మంచి రోజులు - Sakshi

భవిష్యత్తులో మంచి రోజులు

భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని, రెండు రాష్ట్రాల ప్రజలు, న్యాయవాదులు ఓర్పు, సహనంతో వ్యవహరించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు...

- న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుదాం  
- హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బొసాలే
సాక్షి, హైదరాబాద్:
భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని, రెండు రాష్ట్రాల ప్రజలు, న్యాయవాదులు ఓర్పు, సహనంతో వ్యవహరించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే అన్నారు. హైకోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన 69వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘అతి సమీప భవిష్యత్తులో అందరికీ మంచి జరగబోతోంది. మంచి రోజులు రానున్నాయి. అన్నీ సర్దుకుంటాయి. అప్పటి వరకు కలసి ఉండటంలో ఉండే మాధ్యురాన్ని ఆస్వాదిద్దాం.

ఈ పరిస్థితుల్లో ఇంతకంటే నేనేమీ చెప్పలేను’’ అని జస్టిస్ బొసాలే పేర్కొన్నారు. 69 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆశించినంత కాకున్నా గొప్ప అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వ్యవస్థల్లో దారులు మూసుకుపోయాక ప్రజలు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారని...అటువంటి వారికి అండగా నిలబడి న్యాయ వ్యవస్థ ఉందనే విశ్వాసాన్ని కలిగించాలన్నారు. హైదరాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో శిక్షణ పొందిన 75 మంది మీడియేటర్లు ఉన్నారని...కింది కోర్టుల్లో మీడియేషన్ ద్వారా పరిష్కరించేందుకు అవకాశమున్న కేసులను వీరికి సిఫార్సు చేయాలని సూచించారు.

ఢిల్లీ, ముంబై, బెంగుళూరు తరహాలో నవంబర్ నుంచి ఈ-కోర్టు విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జస్టిస్ బొసాలే తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో హైకోర్టులో కేసుల సమాచారం, నోటిఫికేషన్లు ఇతర సమాచారాన్ని మొబైల్ ద్వారా చూసుకునే అవకాశాన్ని ఇప్పటికే కల్పించామని...త్వరలోనే అన్ని ఫోన్లలో ఈ సమాచారాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. మరో రెండు రోజుల్లో మరిన్ని సర్వీసులను అందుబాటులో తేనున్నామని, కేసుల ఫైలింగ్, పరిశీలనలో వచ్చే అభ్యంతరాలను ఎప్పటికప్పుడు న్యాయవాదులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తామన్నారు.

న్యాయవాదులకు సంబంధించిన కేసులు విచారణకు వచ్చే ముందు రెండుసార్లు వారిని అప్రమత్తం చేస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపే విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతమున్న వాటికి అదనంగా 12 కొత్త కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు ఆయన అవార్డులు అందించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ ఏజీ పి.వేణుగోపాల్, ఏపీ, టీఎస్ బార్ అసోసియేన్ అధ్యక్షులు పీపీ పోసాని వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
 
తెలంగాణ న్యాయవాదుల నిరసన
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హైకోర్టు ఆవరణలో నిరసన తెలిపింది. పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ప్లకార్డులు పట్టుకొని న్యాయవాదులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కొంతం గోవర్దన్‌రెడ్డి, ఉపేంద్ర, శ్రీధర్‌రెడ్డి, తిరుమల్, ప్రవీణ్ కుమార్, చక్రధర్‌రెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement