జడ్జీల కొరత వల్లే కోర్టులపై భారం | The burden on the courts due to a shortage of judges | Sakshi
Sakshi News home page

జడ్జీల కొరత వల్లే కోర్టులపై భారం

Nov 6 2014 2:46 AM | Updated on Aug 31 2018 8:26 PM

జనాభాకు తగ్గ నిష్పత్తిలో న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడం వల్లే న్యాయస్థానాలపై కేసుల భారం పెరిగిపోతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

  • హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య
  • సాక్షి, హైదరాబాద్: జనాభాకు తగ్గ నిష్పత్తిలో న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడం వల్లే న్యాయస్థానాలపై కేసుల భారం పెరిగిపోతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత వల్లే ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాల్సి వస్తోందని పేర్కొంది. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు ఉంటే అసలు ట్రిబ్యునల్స్‌ను గానీ, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను గానీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతే లేదని తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) న్యాయపరిధిపై దాఖలైన కేసును విచారించే సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పాడ్డాయని, అందువల్ల ఏపీఏటీ కొనసాగడానికి వీల్లేదని, తెలంగాణ ఉద్యోగుల వివాదాలను విచారించే న్యాయపరిధి ఏపీఏటీకి లేదని ఆర్‌అండ్‌బీ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.లక్ష్మయ్యతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఏపీఏటీని ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ‘‘న్యాయపరిధిపై స్పష్టత ఉండి తీరాల్సిందే. న్యాయపరిధి స్పష్టత లేకుండా పరిధి ఉందని అనుకోమనడానికి వీల్లేదు. దేశంలో జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేదు. అందుకే ఇన్ని ట్రిబ్యునళ్లు, కోర్టులు’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలు వినిపించాలని కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement