పెరవలి : స్నేహితుడి వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తూ మోటార్ సైకిల్ కాలువలోకి జారి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో వారిని మృత్యువు వెంటాడింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి పెరవలిలో చోటు చేసుకుంది. పెరవలి ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరవలి గ్రామానికి చెందిన మెరిపే జాన్ వెస్లీ (40), తానికొండ డానియేలు (43) ఇద్దరు మంచి స్నేహితులు. వీరు స్నేహితుడి ఇంటిలో వివాహ వేడుకలకు గురువారం సాయంత్రం తణుకు వెళ్లి అర్ధరాత్రి 1 గంటకు తిరిగి ఇంటికి వస్తున్నారు.
పెరవలి లాకుల వద్ద ఎటువంటి రైలింగ్ లేకపోవడం, అక్కడే మలుపు ఉండడంతో మలుపు తిరిగే క్రమంలో మోటార్ సైకిల్ జారి కాలువలో పడిపోయారు. మోటార్ సైకిల్ వంతెనపైనే ఒరిగిపోయి ఉండిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోటార్సైకిల్ను గుర్తించిన స్థానికులు బైక్ను గుర్తించి వారిని వెతకడం ప్రారంభించారు. తెల్లవారిన తరువాత వెస్లీ మృతదేహం లాకులకు అడ్డుపడి లభ్యమైంది. డానియేలు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇరగవరం మండలం పేకేరు సమీపంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి పంపి అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాన్ వెస్లీ
ఈ ప్రమాదంలో మృతి చెందిన జాన్ వెస్లీ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడుగా ఉన్నారు.అతడి మృతి విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వెస్లీ పెరవలి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా, పలు సంఘాలకు అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే వెస్లీ మృతి తీరని లోటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చావులోనూ వీడని స్నేహం
వెస్లీ, డానియేలు మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉండేవారు. ఇద్దరూ ఒకేసారి మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. వెస్లీకి భార్య సునీత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా, డానియేలుకి భార్య సౌజన్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.