గంజాయి కావాలా నాయనా..!

Marijuana Smuggling in Hyderabad - Sakshi

నగరంలో గుప్పుమంటున్న గంజాయి  

ఆన్‌లైన్‌లో, వాట్సాప్‌లో ఆర్డర్‌లు

పాన్‌ షాప్‌లు, కిరాణా దుకాణాలు, టీ స్టాల్‌లే అడ్డాలు  

సాక్షి.సిటీబ్యూరో:  నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోను గుప్పుగుప్పు మంటు గంజాయిని పీల్చుతున్న యువత రోజు రోజుకూ పెరుగుతోంది.స్నేహితుల ప్రోద్బలంతో మొదట సిగరేట్‌తో ప్రారంభించి  మద్యం దాని తరువాత గంజాయికి అలవాటు అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఎక్సైజ్, పోలీసులకు పట్టుబడిన గంజాయి కేసులలో 85 శాతంకు పైగా కళాశాల స్థాయి యువతనే ఉండటం గమనార్హం. గంజాయి సేవిస్తు పట్టుబడిన వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించడం, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనబడటం లేదు. ఇటీవల పోలీసులు కొంత మందిపై పీడీ యాక్ట్‌లను సైతం నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ గంజాయి సేవించేటువంటి యువత పెరుగుతున్నారు. ఒకప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమ్మేవారు కానీ నేడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటం వల్ల యువత సలువుగా దీనికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.  2017 సంవత్సరంలో 63 కేసులు నమోదు చేయగా, 2018లో 195 కేసులు నమోదు చేసి 416 మందిని అరెస్టు చేశారు. అదే విధంగా 2019 లో 130 కేసులు నమోదు చేసి 639 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

వ్యాపారంగా మలుచుకుంటున్న వైనం  
గంజాయి సేవించే సమయంలోనే వాసన వస్తుంది కానీ తరువాత వాసన ఉండదు. దీని వల్ల గంజాయి తీసుకున్నట్లు గుర్తించడం కష్టం. దీనికి తోడు చాలా మంది యువత దీన్ని ఒక అనుభూతిగా భావించి అలవాటు అవుతున్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడ్డటు వంటి కొంత మంది కళాశాలల విద్యార్ధులు, యువత దీన్ని ఒక వ్యాపారంగా కూడ మలుచుకుంటున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో పట్టుబడిన చాలా కేసుల్లోను ఇది రుజువయిందని అంటున్నారు. దీనికి పెద్దగా పెట్టుబడి కూడ ఏమి లేకపోవడం, సులువుగా డబ్బులు వస్తుండటంతో దీనికి అలవాటు పడుతున్నారు. రూ. 500 నుంచి 1000 వరకు చేతిలో ఉంటే చాలు సరఫరా చేసే వారి నుంచి కొనుగోలు చేసి తమతో పాటు చదువుకునే తోటి విద్యార్ధులకు, ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో పరిచయం ఉన్న వారికి అమ్ముతున్నారు. 

గల్లీ గల్లీలోను లభ్యం
ఒకప్పుడు నగరంలోని ధూల్‌పేటతో పాటు  కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలు నేడు నగరం అంతటా విస్తరించాయి. గల్లీ గల్లీలోని పాన్‌ షాప్‌లు, కిరాణ దుకాణాలు, టీ స్టాల్‌లు గంజాయి అమ్మకాలకు అడ్డాలుగా మారిపోయాయి.  పెద్దగా పెట్టుబడి లేకుండా సంపాదన కూడ అధికంగా ఉండటంతో గంజాయి  అమ్మకాలకు అలవాటు పడుతున్నారు. 

టెక్నాలజీ వినియోగం  
గంజాయికి అలవాటు పడ్డటువంటి యువత అధిక శాతం మంది టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. వారికి కావాల్సిన గంజాయిని సెల్‌ఫోన్‌ , వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పట్టుబడే అవకాశం ఉండదని భావించి ఆర్డర్‌ చేసి గంజాయిని తెప్పించుకుంటున్నారు. కొంత మంది గంజాయి సేవించేటువంటి వారు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని దాంట్లో రిఫరెన్స్‌ ద్వారానే కొత్త వారిని చేర్చుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొత్త వారికి నేరుగా కాకుండా అప్పటికే పరిచయం ఉన్నటువంటి వారి ద్వారా మాత్రమే అమ్ముతున్నారు.  ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, డైరక్టరేట్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టోచ్చిన్నట్లు కనబడుతుంది. దీంతో గంజాయి రవాణ, అమ్మకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top