లింగసముద్రం(వలేటివారిపాలెం): కుమారుడు పాఠశాలకు వెళ్లలేదని ఓ వ్యక్తి కుమారుడితో పాటు భార్య, బామర్దులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన మండలంలోని ఆర్ఆర్ పాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కేతినేని కొండయ్య కుమారుడు కణకాద్రి మొగిలిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కుమారుడు నాలుగు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో కోపానికి గురైన తండ్రి కొండయ్య పిల్లవాడితో పాటు ఆయన భార్య దత్తాత్రేయమ్మను కొట్టాడు. ఆమె పక్కనే ఉన్న తన అన్న పిల్లలు శింగమనేని దత్తాత్రేయ, చిన దత్తాత్రేయ దగ్గరకు చేరుకుంది.
విషయం తెలుసుకున్న భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన సోదరుడు మహేష్, చిన్నమ్మ కొడుకు చెన్నకృష్ణతో పాటు వెళ్లి నిద్రిస్తున్న దత్తాత్రేయ, చిన దత్తాత్రేయలపై దాడికి దిగాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దత్తాత్రేయను చూసి ఆయన భార్య వెంగమ్మ అడ్డు వచ్చి పెద్దగా కేకలు వేసింది. అప్పటికే కోపంలో ఉన్న కొండయ్య చేతిలో ఉన్న కర్రతో ఆమెను కూడా గాయపర్చాడు. తెప్పరిల్లుకున్న దత్తాత్రేయ అతని చేతిలో ఉన్న కర్ర లాక్కుకుని విసరడంతో మహేష్ తలపై గాయమైంది. గమనించిన ఇంటి పక్క వారు వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పి గొడవ సద్దుమణిగించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మహేష్ను ఒంగోలు తరలించారు.