
ఏమిటీ దుస్థితి
ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగరాభివృద్ధిని గాలికి వదిలేసింది
గుంటూరు : ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగరాభివృద్ధిని గాలికి వదిలేసింది. ప్రధానంగా ఇప్పటి వరకు ఆరుగురు కమిషనర్లను మార్చింది. ఈ విషయంలో సమర్థంగా పనిచేసే అధికారులకు బదిలీలే బహుమతిగా ఇస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
కమిషనర్లు మారగానే నగరాభివృద్ధికి సంబంధించి వారి ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. వచ్చిన కమిషనర్ నాలుగు నెలలకే బదిలీ కావడంతో అభివృద్ధికి సంబంధించినప్రతిపాదనలు అమలుకు నోచడం లేదు. కొత్తగా వచ్చిన కమిషనర్లు పాత ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదు.
ఫలితంగా నగరంలో అరకొర నీటి సరఫరా, గోతులతో నిండిన రోడ్లు, అస్తవ్యస్తంగా ట్రాఫిక్, ఆహ్లాదానికి కనీసం ఒక్క పార్కు కూడా లేని దుస్థితి దర్శనమిస్తోంది రూ.903 కోట్లు మంజూరు ... ప్రధానంగా కమిషనరు కన్నబాబు హయాంలో నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడళ్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కార్పొరేషన్ నూతన కార్యాలయం, మానస సరోవరం, గాంధీపార్కు, కొరిటెపాడు, బృందావన్గార్డెన్స్ చెరువు, గుజ్జనగుండ్ల, నల్లచెరువు వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం ఇప్పటికే రూ. 540 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 363 కోట్లు మంజూరు చేసింది. ఇంకా ఉచిత వైఫై, డివిజన్ల వారీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం నాలుగు నెలలకే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది
.
నాలుగు నెలలకే అనురాధ బదిలీ.. కన్నబాబు తరువాత కమిషనర్గా అనురాధ బాధ్యతలు చేపట్టి నగరాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కన్నబాబు అమలు చేసిన అభివృద్ధి పనులతో పాటు తాగునీటి సరఫరా, విలీనగ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రూ.125 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ఏజెన్సీకి పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటి వరకు పనులు పట్టాలెక్కలేదు.
గాంధీపార్కు ఆధునీకరణతో పాటు పీవీకే నాయుడు మార్కెట్ నిర్మాణానికీ ఆమె కృషి చేశారు. ఆమె కూడా నాలుగు నెలలకే బదిలీ అయ్యారు. పారిశుధ్యం అంతంత మాత్రం.... రెండు నెలల క్రితం ఐఏఎస్ అధికారి ఎస్. నాగలక్ష్మీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని సైతం పట్టాలెక్కలేదు. మంచినీటి సమస్య తీవ్రమవుతోంది. కూడళ్ల అభివృద్ధి, సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కులు, చెరువుల అభివృద్ధి,మార్కెట్ , నూతన కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణం తదితర అంశాలు ఇప్పుడు మచ్చుకైనా వినిపించడం లేదు.
కమిషనర్ నిత్యం వార్డుల్లో పర్యటిస్తున్నా కిందిస్థాయి అధికారుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా నగరంలో పారిశుధ్యం అంతంతమాత్రంగానే ఉంది. మరో వైపు కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయింది. నగరాభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ఆమె రూపొందించలేకపోయారని, పాత వాటిని సైతం పట్టాలెక్కించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.