-
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
ఐటీ దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక రాజధాని అమరావతి పేరుతో బడా కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున అయాచిత లబ్ధి పొందారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. ఆ అక్రమార్జనకుగానూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం అందుకున్నారు కూడా. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు పొందారని ఐటీ శాఖ సాక్ష్యాధారాల్ని చూపుతోంది. కానీ, ఐటీ శాఖ సరిగా పరిశీలన చేయలేదని బుకాయిస్తున్నారు చంద్రబాబు. పైగా మనుగడలో లేని ఐటీ నిబంధనలను సాకుగా చూపి దర్యాప్తు ఆలస్యం చేసే ప్రయత్నం చేశారాయన. అయితే.. చంద్రబాబు లేవనెత్తిన టెక్నికల్ అభ్యంతరాలను ఇప్పటికే ఐటీ శాఖ తిరస్కరించింది. దీంతో కేసు మెరిట్స్ లోపలికి వెళ్లకుండా.. మరిన్ని టెక్నికల్పాయింట్స్ తెరపైకి తెచ్చి దర్యాప్తు ఆలస్యం చేయడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని సాకుల కోసం వెతుకుతోంది చంద్రబాబు అండ్ కో. లోకేష్ సన్నిహితుడికి కూడా.. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది. చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. -
విశాఖ రీతి సాహ కేసు.. నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: సంచలనంగా మారిన రీతి సాహ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ల పర్వం కూడా మొదలైంది. తాజాగా నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. సాధన హాస్టల్కు చెందిన ఇద్దరు, బైజూస్ యజమాన్యానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి, ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరి నిరక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. వెంకటరామ, కేర్ ఆసుపత్రిలో కూడా సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగాల్ పోలీసులు, సీఐడీ విశాఖలోనే మకాం వేసి దూకుడు పెంచారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు -
‘వివేకా కేసులో సునీత స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు. టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్షీట్లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’ దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.! షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు. బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. -
బాబు ‘బ్లాక్మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్ చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 2017లో బాబు మయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్షీట్లు, కీలకమైన మెసేజ్లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్మెంట్ ఇచ్చారు. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా? -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్అండ్టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
భార్యతో వివాహేతర సంబంధం.. కత్తితో నరికి..చెరువులో పడేసి..
స్టేషన్ఘన్పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ఘన్పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈనెల 25న హైదరాబాద్లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023 -
యువతిపై టీడీపీ నాయకుడు లైంగికదాడి
రాయదుర్గం: కుమార్తె వయసు కలిగిన ఓ యువతిపై టీడీపీ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతనికి బాధిత యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హులికల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... హులికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడైన బోయ సోమశేఖర్ (45) వరుసకు కోడలైన 20 ఏళ్ల యువతిపై ఎప్పటినుంచో కన్నేశాడు. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కారణంతో తరచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన సోమశేఖర్ ఆమె ఇంట్లోకి చొరబడి అస్యభకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా లైంగికదాడి చేశాడు. అనంతరం చెప్పులు అక్కడే వదిలి పారిపోయాడు. యువతి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి ఇంటికి రావడంతో జరిగిన దారుణం గురించి తెలియజేసి కన్నీటిపర్యంతమైంది. అదే సమయంలో చెప్పుల కోసం తిరిగి యువతి ఇంటి వద్దకు వచ్చిన సోమశేఖర్ను గుర్తించిన బాధితురాలి తండ్రి, బంధువులు చితకబాదారు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన రూరల్ సీఐ యుగంధర్ మంగళవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద (రేప్) కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. నిందితుడు సోమశేఖర్ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు. -
గుంతకల్లులో డ్రగ్స్ కలకలం
గుంతకల్లు టౌన్: గోవా నుంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అనంతపురం జిల్లా గుంతకల్లు వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.65 వేల విలువజేసే 12.890 గ్రాముల ‘మేథాంపేటామైన్’ అనే నిషేధిత డ్రగ్తో పాటు రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఎరెల్లి దయాకర్, మలికపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రాసిబట్టుల వివేక్ హైదరాబాద్కు వెళ్లి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిరువురు డ్రగ్స్కు బానిసలయ్యారు. హైదరాబాద్లో వీరికి పరిచయమైన స్నేహితులకు డ్రగ్స్ గురించి తెలియజేయగా, తమకు కూడా తెచ్చివ్వాలని వారు కోరడంతో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి సోమవారం సాయంత్రం గుంతకల్లుకు చేరుకున్నారు. అయితే రాత్రి వరకు హైదరాబాద్కు రైలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఏదైనా వాహనంలో వెళ్లేందుకు ఇద్దరు యువకులూ స్థానిక బీరప్పగుడి సర్కిల్లో వేచి ఉన్నారు. అందిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు యువకుల్నీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్ ఒక్కో గ్రాము రూ.5 వేల ధర పలుకుతుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం దగ్గర రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకవ్వడంతో కారు దగ్ధమైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారును రోడ్డు పక్కన నిలిపివేసి అందులో ఉన్న వ్యక్తులు తమ ప్రాణాలను దక్కించుకున్నారు. చదవండి: రంగారెడ్డి: వీడిన మైనర్ రాజా కేసు మిస్టరీ -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ మూకల దాడి
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్నాయక్ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్నాయక్ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్నాయక్ ఇంటిపై దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ప్రభాకర్నాయక్పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్పైనా దాడి చేశారు. గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్నాయక్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మోహన్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్నాయక్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ఏపీలో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్.. 6కోట్ల బంగారం స్వాధీనం
సాక్షి, విజయవాడ: ఏపీలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రూ.6.4కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారం భారీగా పట్టుబడింది. ఓ కారులో రూ.6.4 కోట్ల విలువైన 11.1 కిలోల బంగారం, రూ.1.5 లక్షల విదేశీ నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీలంక, దుబాయ్ దేశాల నుంచి బంగారాన్ని తీసుకువచ్చి, చెన్నై మీదుగా విజయవాడకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్ఫ్లాజా వద్ద విజయవాడ వైపు వస్తున్న ఓ కారులో తరలిస్తున్న 4.3 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు అభరణాలు, రూ.1.5 లక్షల విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడింది విదేశీ బంగారమని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని విశాఖలోని కోర్టులో హాజరు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి.. -
వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించిన ‘దిశ’
తెనాలిరూరల్ : వ్యక్తి వేధింపులు తాళలేని ఓ మహిళ దిశ యాప్ ఎస్ఓఎస్ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తిని దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలిలో నివాసముండే మహిళ తన కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ.రెండు లక్షలు అప్పుగా తీసుకుంది. కొన్ని నెలల తర్వాత వడ్డీతో సహా చెల్లించింది. అయినా శ్రీనివాసరావు ఆ మహిళకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. గతంలో అప్పు కోసం తన ఆఫీస్కు వచ్చినప్పటి ఫొటోలు, కాల్ రికార్డ్లున్నాయని బెదిరించేవాడు. బాధిత మహిళ తన భర్తకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినా శ్రీనివాసరావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం బాధిత మహిళకు, ఆమె భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు దిశ ఎస్ఓఎస్కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. తెనాలి వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. ఆమెకు శ్రీనివాసరావు పంపించిన అసభ్యకర సందేశాలను, అప్పు చెల్లించినట్టు ఉన్న వివరాలను పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావుపై ఐపీసీ సెక్షన్ 354 ఈ, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
భర్త చేతిలో భార్య దారుణహత్య
కృష్ణా :అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న మొగుడే భార్యను కడతేర్చి కాలయముడయ్యాడు. మండలంలోని కుమ్మమూరు ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం వీర్ల రమ్యతేజ (32) దారుణహత్యకు గురయింది. భర్త రామకృష్ణ సెల్ఫోన్ చార్జింగ్ వైరుతో రమ్యతేజను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అదే గ్రామానికి చెందిన రమ్యతేజ ప్రేమించుకుని గత 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గతంలో రామకృష్ణ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడని, ప్రస్తుతం స్థానికంగానే కూలీ పనులకు వెళుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రమ్యతేజ డ్వాక్రా గ్రూపుల తరపున వీఓఏగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భార్య రమ్యతేజపై గత కొంతకాలంగా భర్త రామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. ఏడాది కాలంగా ఇద్దరి మద్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. నెల క్రితం అత్త జయలక్ష్మిపై కూడా రామకృష్ణ దాడికి పాల్పడి తల పగులగొట్టినట్లు సమాచారం. రమ్యతేజ గత ఇరవై రోజుల క్రితం గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త రామకృష్ణ వద్దకు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు రమ్యతేజ హత్యకు గురయ్యిందనే సమాచారం గ్రామంలో కలకలం రేపింది. టబ్చైర్లో విగతజీవిగా పడిఉన్న కూతురిని చూసి తల్లి జయలక్ష్మి, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా ప్రాంతానికి తరలివచ్చారు. మృతురాలు రమ్యతేజకు ఇద్దరు కుమార్తెలు ఖ్యాతి (9), రిషిత (7) ఉన్నారు. వీరు ఉయ్యూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. రమ్యతేజ మృతదేహాన్ని పమిడిముక్కల సీఐ చలపతిరావు, ఎస్ఐ రమేష్ సందర్శించి పరిశీలించారు. మృతురాలి తండ్రి మెల్లంపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. భార్య రమ్యతేజను హత్య చేసిన అనంతరం భర్త రామకృష్ణ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
నాడు మైనర్ బాలిక..నేడు మేజర్
అనకాపల్లిటౌన్ : రెండేళ్ల క్రితం ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీఎస్పీ బి.సుబ్బరాజు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. మండలంలో తగరంపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 జూలై 13న రాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి నడిగట్ల శ్రీను ఫిర్యాదు మేరకు అదే నెల 15న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందింది. అస్సాం రాష్ట్రం గౌహతి నుంచి ఎలుసూరి ప్రసాద్బాబు అనే వ్యక్తి తగరంపూడిలో తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పరిచయం కావడంతో ఆమెను లోబర్చుకున్న ప్రసాద్బాబు అస్సాంకు తీసుకెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో నిందితుడి కోసం రెండేళ్లుగా కోల్కత్తా, ఒడిశా, తెలంగాణతో పాటు విశాఖపట్నం పలు ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో మైనర్ బాలికతో కలిసి ప్రసాద్బాబు ఉన్నట్టు తెలుసుకున్న ఐటీ కోర్ బృందం ఈ నెల 25న అతడిని భువనేశ్వర్ చందక పోలీస్స్టేషన్లో హాజరుపరిచి అక్కడ నుంచి అనకాపల్లికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. మైనర్ బాలిక ప్రస్తుతం మేజర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో వైద్యపరీక్షలకు తరలించి కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని చెప్పారు. నిందితుడిని ఈనెల 25న భువనేశ్వర్లో అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ప్రసాద్బాబుకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అతని తల్లిదండ్రులు గౌహతిలో ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కోడలు కూడా నివసిస్తోంది. నిందితుడ్ని శనివారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ ఎ.రవికుమార్, ఎస్ఐ సీహెచ్. నర్సింగరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ హెచ్సీ ఎస్.వి.రామకృష్ణ, రూరల్ కానిస్టేబుళ్లు పి.నరేంద్రకుమార్, ఎం.నరేష్, ఐటీకోర్ సిబ్బంది మూర్తి, దిలీప్, గ్రామీణ హెచ్సీ జె.రమేష్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతి వేగం
విశాఖపట్నం: అతివేగం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి బీచ్రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాలివీ.. లాసన్స్బే కాలనీకి చెందిన పెండ్యాల ప్రఖ్యాత్(20), సీతమ్మధారకు చెందిన కొల్లా అఖిలేష్, ఎండాడకు చెందిన ఆర్.సాయిలక్ష్మి స్నేహితులు. రుషికొండలోని గీతం కళాశాలలో ప్రఖ్యాత్, అఖిలేష్ సీఎస్సీ మూడో సంవత్సరం.. సాయిలక్ష్మి బీబీఏ చదువుతున్నారు. వీరు ముగ్గురూ శనివారం ఉదయం కళాశాలలో కలుసుకుని ఒకే కారులో భీమిలిలో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఐఎన్ఎస్ కళింగ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి.. అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రఖ్యాత్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గీతం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వెనుక సీటులో ఉన్న అఖిలేష్, సాయిలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. వీరికి గీతంలో చికిత్స అందించి ఇంటికి పంపించేశారు. ప్రఖ్యాత్ అతి వేగంగా కారు నడుపుతూ అదుపు చేయలేక డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రఖ్యాత్ తండ్రి అరవింద్ నగరంలో బిజినెస్మన్. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రఖ్యాత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ భరత్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో రమేష్ కృష్ణ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో ఏర్పడిన మనస్పర్ధలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ నెల 23వ తేదీన విశాఖకు వచ్చిన యువతి రమేష్ కృష్ణ.. అంతకు ముందే ఇండోర్లో ఉన్న ప్రియుడిని కలిసింది. చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మెడికో.. స్వస్థలం కేరళ, త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం. చైనా వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన రమేష్ కృష్ణ... విశాఖ నుంచి సింగపూర్కు కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్లడానికి దాబా గార్డెన్లోని ఓ లాడ్జిలో దిగింది. ఈ నెల 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: భర్త వేధింపులపై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్! -
భర్త వేధింపులపై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్!
నెల్లూరు(క్రైమ్): వారిద్దరు ఉన్నతోద్యోగులు. అయితే విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్త తనను వేధిస్తున్నాడంటూ భార్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడంతో పోలీసులు స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు. వివరాలిలా ఉన్నాయి. జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో దంపతులు తమ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త పశుసంవర్థక శాఖలో, భార్య వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి మధ్య కొంతకాలంగా మనస్పర్థలతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన వేదాయపాళెం పోలీసులు దంపతుల ఇంటికి చేరుకుని మాట్లాడారు. తర్వాత పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు యువతి దుర్మరణం
శ్రీకాకుళం: పలాస మండలం సరియాపల్లి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పిలి కల్యాణి(20) అనే యువతి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వ వార్డు శివాజీనగర్లో నివాసం ఉంటున్న ఇప్పిలి కల్యాణి అలియాస్ శిల్ప (20) శ్రావణ శుక్రవారం సందర్భంగా వేకువజామున తల్లితో పాటు వ్రతం ఆచరించింది. వివిధ రకాల ప్రసాదాలను తయారుచేసి చుట్టు పక్కలవారికి పంచిపెట్టింది. కాశీబుగ్గ గాంధీనగర్లో డాక్టర్ పొందల జగదీష్ నడుపుతున్న శ్రీకృష్ణా ఆస్పత్రిలో ఆమె ఫిజియోథెరపిస్టుగా పని చేస్తోంది. పేషెంట్ నుంచి కాల్ రావడంతో ఆమె వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి వెళ్లేందుకు తన స్కూటీపై బయల్దేరింది. సరియాపల్లి పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి విశాఖ–ఇచ్ఛాపురం ఎక్స్ప్రెస్ బస్సు ఆమె స్కూటీని ఢీకొట్టింది. తలపై పెద్ద దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైపోయాడు. మృతురాలిది పలాస పురుషోత్తపురం స్వగ్రా మం కాగా శివాజీనగర్లో అద్దె ఇంటిలో ఉంటున్నా రు. ఆమె తండ్రి ఇప్పిలి బాలరాజు జీడి కార్మికుడిగా పనిచేస్తుండగా తల్లి ఇప్పిలి పుణ్యావతి జీడి కార్మికురాలుగా రోజువారీ కూలి పనిచేస్తుంటారు. సోదరుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వేకువనే లేచి అమ్మవారికి పూజ చేసి లక్ష్మీదేవిలా కనిపించిన కుమార్తె గంటల వ్యవధిలో ఇలా విగతజీవిగా కనిపించడంతో ఆమె తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఫోన్కాల్ రావడమే తన బిడ్డపాలిట మృత్యువుగా మారిందని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. నలభై రోజుల కిందటే ఆమె కొత్త స్కూటీ తీసుకోవడం గమనార్హం. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు చేశారు. -
Vizag: లాడ్జిలో మెడికో ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే!
సాక్షి, విశాఖపట్నం: డాబా గార్డెన్స్లో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ గదిలో రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ.. సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకున్న ఆ యువతి.. డాబా గార్డెన్స్లోని లాడ్జిలో అద్దెకు దిగి.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో ఉందని టూ టౌన్ సిఐ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు
సాక్షి, అమరావతి: మార్గదర్శి తరహాలో పశ్చిమ బెంగాల్లో చిట్ఫండ్ కుంభకోణానికి పాల్పడిన ‘యూఆర్వో చిట్ఫండ్స్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. రామోజీరావు మాదిరిగానే చందాదారుల నిధులను మళ్లించిన యూఆర్వో చిట్ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చందాదారుల డబ్బులను తమకు చెందిన వివిధ వ్యాపార సంస్థలకు మళ్లించిన కేసులో ఆయన్ను అరెస్టు చేసి ఆయన్ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. బిశ్వప్రియ గిరికి న్యాయస్థానం సెప్టెంబరు 1 వరకు రిమాండ్ విధించింది. యూఆర్వో చిట్ఫండ్స్, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు ఒకే తరహాలో ఉన్నాయి. నిజానికి యూఆర్వో చిట్ఫండ్స్ కంటే మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు అనేక రెట్లు పెద్దవి కావడం గమనార్హం. రూ.200 కోట్లు మళ్లించిన యూఆర్వో చిట్ఫండ్స్ యూఆర్వో చిట్ఫండ్స్ ప్రమోటర్, డైరెక్టర్ బిశ్వప్రియ గిరి ఈ కుంభకోణానికి సూత్రధారి. చిట్ఫండ్స్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేశారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చందాదారుల సొమ్మును తమ సొంత వ్యాపార సంస్థల్లోకి మళ్లించారు. చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడ్డారు. రూ.200 కోట్లను ఇతర సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా మళ్లించారు. బిశ్వప్రియ గిరి కుటుంబానికే చెందిన అగ్రో ఇండస్ట్రీ, లైఫ్కేర్, ఆటోమోటివ్, హోటళ్లు–రిసార్టులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. చందాదారుల సొమ్మును తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఈ క్రమంలో చందాదారులకు సక్రమంగా చెల్లించలేక మోసానికి పాల్పడ్డారు. ఈడీ అధికారులు తనిఖీలు జరిపి పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. అంతకు మించి మార్గదర్శి మోసాలు యూఆర్వో చిట్ఫండ్స్ వసూలు చేసినట్లుగానే మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా తమ చందాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పి రశీదు రూపంలో అక్రమ డిపాజిట్లు సేకరించింది. బిశ్వప్రియ గిరి తరహాలోనే రామోజీరావు కూడా చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించారు. తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో చిట్ఫండ్ చందాదారుల డబ్బును పెట్టుబడులుగా పెట్టారు. అంతేకాకుండా వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా వాటిని మళ్లించారు. యూఆర్వో గ్రూప్నకు చెందిన బిశ్వప్రియ గిరి కేవలం కేవలం రూ.200 కోట్లు మాత్రమే మళ్లించగా రామోజీరావు అంతకు ఎన్నో రెట్లు అధికంగా రూ.వేల కోట్లను అక్రమంగా దారి మళ్లించడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అక్రమ పెట్టుబడులే రూ.1,035 కోట్లుగా ఉన్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గుర్తించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం, ఉషోదయ ఎంటర్ప్రైజస్లో 44.55 శాతం పెట్టుబడులుగా పెట్టారు. వాటి మార్కెట్ విలువ భారీగా ఉంటుదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి యూఆర్వో చిట్ఫండ్స్ మోసాల కంటే మార్గదర్శి చిట్ఫండ్స్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించిన కేసులో యూఆర్వో చిట్ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరి అరెస్టు అయ్యారు. మరి అంతకంటే భారీగా చందాదారుల నిధులను మళ్లించిన రామోజీరావుపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల గురించి సీఐడీ విభాగం ఇప్పటికే ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆధారాలతో సహా నివేదికను సమర్పించింది. -
ఘోర రోడ్డు ప్రమాదం
కృత్తివెన్ను (కృష్ణా జిల్లా): రెండు కార్లు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించింది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కృత్తివెన్ను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్ళమూరు తూర్పుచెరువు నుంచి ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు, కారు డ్రైవర్తో కలసి మొత్తం ఏడుగురు గుంటూరు బయలుదేరారు. అక్కడి దేవదాసు చర్చిలో దాసుబాబుకి మొక్కు తీర్చుకోవడానికి వీరంతరూ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. అల్లవరం మండలం మొగళ్ళమూరుకు చెందిన తెన్నేటి అనామణి, గోడికి చెందిన మడికి రాజేశ్వరి, మడికి మెరాకిల్, మడికి షారోన్ జ్యోతి, మడికి రమ్య, మడికి దాసుబాబు కారులో ఉన్నారు. మొక్కులు తీర్చుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. యలవర్తి అఖిలేష్, యలవర్తి రవి, దేవరకొండ నాగబసవయ్య, అజయ్కుమార్ నర్సాపురం నుంచి అవనిగడ్డకు కారులో వెళుతున్నారు. సంగమూడి సమీపానికి వచ్చే సరికి లారీని తప్పించబోయి రెండు కార్లు ఎదురెదురు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో గుంటూరు నుంచి మొగళ్ళమూరు వెళుతున్న కారులోని తెన్నేటి అనామణి (70) ఘటనా స్థలంలోనే మరణించింది. అదే కారు డ్రైవర్ అల్లవరం మండలం అల్లవరం పొలంనకు చెందిన పెయ్యిల బాలస్వామి(20) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఈ కారులోని రాజేశ్వరీతో పాటు నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. భర్తతో గొడవల కారణంగా ఐదు నెలలుగా రాజేశ్వరీ తన పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. భర్త మడికి చిరంజీవి ప్రైవేటు లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు ఈ ప్రమాదంలో మరో కారులోని నాగబసవయ్య, రవిలకు తీవ్రగాయాలు కాగా, అఖిలేష్, అజయ్కుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108, ఎన్హెచ్ అంబులెన్సుల్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులతో పాటు కృత్తివెన్ను పోలీసులు సకాలంలో స్పందించిన తీరు ప్రశంసనీయం. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బందరు రూరల్ సీఐ వీరప్రసన్నగౌడ్, బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు. -
కనిగిరి – వెలిగండ్ల రహదారిలో రక్తపు మరకలు
కనిగిరి రూరల్: కనిగిరి – వెలిగండ్ల రహదారిలో రక్తపు మరకలు అంటుకుంటున్నాయి. నిత్యం వాహన రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డు మార్గంలో గతంలో కే రాధ హత్య ఘటన, నేడు విద్యార్థిని బీ మంజుల హత్య చోటుచేసుకున్నాయి. ఒకే రహదారిలో రాత్రి 6–8 గంటల మధ్యలోనే హత్యలు జరిగాయి. అంతేగాక ప్రధాన రోడ్డుకు ఎక్కడో దూరంగా జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగినవి కాదు. కనిగిరి టు వెలిగండ్ల నిత్యం ఈ రోడ్డు మార్గంలో వందల వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. పల్లె గ్రామాలన్నీ పక్క పక్కనే రోడ్డు వెంబడే ఉంటాయి. కానీ దుండగులు మాత్రం ఈ దారినే ఎంచుకుని హత్యలు చేస్తున్నారు. అంతేగాక గతంలో హత్యకు గురైన రాధ మృతదేహం ప్రధాన రహదారిలో తారు రోడ్డుకు పక్కన 5 అడుగులు దూరంలోనే పడేశారు. అర్ధరాత్రి దాటే దాకా ఎవరూ గమనించ లేదు. గుర్తించలేదు. తాజాగా సోమవారం జరిగిన బీ మంజుల హత్యోదంతం కూడా అదే పరిస్థితి. కనిగిరి – వెలిగండ్ల ప్రధాన రోడ్డుకు 20 అడుగుల దూరంలో, కనిగిరి – సుల్తాన్పురం కాలినడక మార్గంలో రోడ్డుకు అడుగు దూరంలోనే మృతదేహం పడేశారు. మంజుల హత్య కూడా 6–7 గంటల మధ్యలోనే జరిగిందనేది పోలీసుల విచారణలో స్పష్టంగా తేలింది. దాన్నిబట్టి చీకటి పడక ముందే మంజుల హత్య జరిగిందని భావించవచ్చు. పోలీసింగ్ మరింత పెరగాలి.. నాలుగు నెలల వ్యవధిలో ఒకే రోడ్డులో సుమారు 10 కి.మీల దూరంలో రోడ్డు పక్కనే రెండు హత్యలు జరగడం పట్ల కనిగిరిలో చర్చనీయాంశంగా మారింది. కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేదా వెలిగండ్ల స్టేషన్ పరిధిలోని మొబైల్ టీం రాత్రి పూట కచ్చితంగా గస్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. వారంలో మూడు రోజులు కనిగిరి స్టేషన్ నుంచి వెలిగండ్ల వరకు, మరో మూడు రోజులు వెలిగండ్ల నుంచి కనిగిరి వరకు పోలీసింగ్ నిర్వహించి మరో నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేగాక కనిగిరి–పామూరు రోడ్డులోని డిగ్రీ కళాశాల ప్రాంతంలో.. కనిగిరి–పొదిలి రూట్లోని లారీ ఆఫీస్ అవుట్ కట్స్ ఏరియాలో, కనిగిరి–కందుకూరు రోడ్డులోని చిన ఇర్లపాడు అవుట్ కట్స్ ఏరియాలో, గార్లపేట రోడ్డులోని క్వారీ అవుట్ కట్స్ ఏరియాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తప్పనిసరిగా ప్రతి రోజు పోలీస్ గస్తీ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.