
106 కేజీల గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు
పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీసీఎస్, పటాన్చెరు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద పటాన్చెరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా...రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ఎనకపల్లి గ్రామం, పత్తు తాండకు చెందిన రాథోడ్ బీర్బల్, రాథోడ్ సురేష్, రాథోడ్ మారుతి, రాథోడ్ ప్రకాశ్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు కార్లను సీజ్ చేశారు. ఈ గంజాయిని విజయవాడ నుంచి మహారాష్ట్రకు తరలిస్తునట్లు విచారణలో వెల్లడైంది. పట్టుకున్న గంజాయి 106 కేజీలు ఉండగా...దీని విలువ రూ.26.70లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నెలలోగా టాయిలెట్స్
నిర్మించాలి: కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలలోగా టాయిలెట్స్ నిర్మించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి వల్లూరు మాట్లాడుతూ...40 మంది అబ్బాయిలకు ఒక టాయిలెట్, 30 అమ్మాయిలకు ఒకటి టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు. గురుకుల విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలన్నారు. వివిధ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికారులు పాఠశాలకు వచ్చినపుడు ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీసీఈవో జానకీరెడ్డి పంచాయతీ అధికారి సాయిబాబా, పీడీ డీఆర్డీఏ జ్యోతి, డీఎంహెచ్ఓ గాయత్రీదేవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్కు అవార్డు
సంగారెడ్డి: స్వయం సహాయక సభ్యులకు 2024 –25 సంవత్సరంలో బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో మెదక్ డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. అత్యుత్తమ సేవలందించినందుకుగాను డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డికి గురువారం మంత్రి సీతక్క ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ ఇలా మొదటిస్థానంలో నిలిచి అవార్డును అందుకోవడం ఐదవసారి అని తెలిపారు.
జోగిపేట మార్కెట్కు రూ.5.69 కోట్ల ఆదాయం
మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి
జోగిపేట(అందోల్): జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2024–25 ఆర్థిక ఏడాదికిగాను రూ.5.69 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని పొందగలిగామని పేర్కొన్నారు. జోగిపేట మార్కెట్ యార్డు, దేవునూర్ రైతు వేదికలో పీఏసీఎస్ల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారాయణఖేడ్, రాయికోడ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

106 కేజీల గంజాయి పట్టివేత

106 కేజీల గంజాయి పట్టివేత