వెంకటాపురం(ఎం): సొంత ఊరిలో స్నేహితులతో రంగుల పండుగ జరుపుకోవాలని వచ్చిన ఇద్దరు బీటెక్ మిత్రులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (21), తిమ్మాపూర్కు చెందిన ఉమ్మడి ఉమేష్ (21)లు స్థానిక జవహర్నగర్ మోడల్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం శృశాంత్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో, ఉమేశ్ నర్సంపేటలోని జయముఖి కశాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. వరుసగా ఆది, సోమవారం సెలవుదినాలు కావడంతో హోలీ పండుగకు ఇంటికి వచ్చారు. సోమవారం స్థానిక మిత్రులతో కలిసి హోలీ ఆడిన అనంతరం రామప్ప చెరువు దగ్గర కాల్వలో స్నానాలు చేశారు. ద్విచక్రవాహనంపై రామప్ప నుంచి వెంకటాపురం వైపు వస్తుండగా.. లక్ష్మీపురం వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. వెంకటాపురం ఎస్సై చల్లా రాజు ఘటనా స్థలిని పరీశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు.