విజయనగరం: భగవద్గీతను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉపకరిస్తే జీవితం నేపథ్యాన్ని తెలియజేస్తుందని, మానవ జీవితంలో శాంతి,ఆనందం, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకంగా ఉంటుందని విశాఖపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త, నిష్కామ ఫౌండేషన్ అధ్యక్షురాలు అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె పట్టణంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు శ్రీ మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ మద్భగవద్గీత రెండవ అధ్యాయం, సాంఖ్యయోగంపై ప్రవచించనున్నట్లు తెలిపారు. నేటి యువత భగవద్గీత గురించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ మాటూరు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కూరెళ్ల సరోజిని, రమేష్ల సహకారంతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో నరసింగరావు, కాపుగంటి వరహాలు, శెట్టి సూర్యకాంతం, జి.వీరభద్రరావు పాల్గొన్నారు.
జాతరలో ఆటో మాయం
భోగాపురం: మండల కేంద్రం భోగాపురంలో మూడురోజులుగా జరుగుతున్న కనకదుర్గతల్లి అమ్మవారి జాతరలో ఓ ఆటో మాయం అయింది. భోగాపురంలో జరుగుతున్న జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు డెంకాడ మండలం చుక్కవానిపేట గ్రామానికి చెందిన చుక్క సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి తన సొంత ఆటోలో భోగాపురం వచ్చాడు. ఈ క్రమంలో ఆటోను మార్కెట్ సెంటర్లో పార్కింగ్ చేసి కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వెవెళ్లాడు. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఆటో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ గురువారం తెలిపారు.
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
మక్కువ: మండలంలోని కన్నంపేట గ్రామానికి చెందిన చీపురు ఉమామహేష్(40) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వివాహ మంటపంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి షాక్కు గురయ్యాడు. స్థానికులు స్పందించి బొబ్బిలి సీహెచ్సీకీ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య లలిత ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.నరసింహమూర్తి తెలిపారు.