తాండూరు టౌన్: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడని పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ గురువారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. ఆయనకు సీపీఎం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. వివరాల ప్రకారం.. టీవీఎస్ ఫైనాన్స్ కంపెనీ వారి వద్ద బైక్ కొనుగోలు చేసి వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ తప్పుడు లెక్కలు చూపి డబ్బు చెల్లించాలని వేధిస్తున్నారని.. ఇదే విషయమై స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు కానిస్టేబుల్ సత్తార్ తనపై చేయి చేసుకున్నాడని , ఎస్ఐ కాశీనాథ్ దూషించాడని శ్రీనివాస్ ఆరోపించారు. ఇదే విషయమై ఎస్ఐను వివరణ కోరగా.. వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు సిబ్బందిని శ్రీనివాస్ దూషిస్తున్నాడని ఫైనాన్స్ కంపెనీవారు ఫిర్యాదు చేశారన్నారు. ఇదే విషయమై మాట్లాడుదామని లోపలికి రావాలని కోరిన కానిస్టేబుల్ సత్తార్ను శ్రీనివాస్ దూషించాడన్నారు. దీంతో వారిద్దరి మధ్య పెనుగులాట జరిగిందే తప్ప దాడి జరగలేదన్నారు. ఈ కేసు పూర్తి విచారాణ చేస్తానని పట్టణ సీఐ సంతోశ్కుమార్ తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగడం సరికాదని.. పూర్తి విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు రాజుగౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. కానిస్టేబుల్, ఎస్ఐపై చర్యలు తీసుకోని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
స్టేషన్ ఎదుట ఆందోదళన చేపట్టిన పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్