కోదాడ: చేసిన తప్పును కప్పి పుచ్చుకునే క్రమంలో కోదాడ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు అడ్డంగా దొరికిపోయారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో వేసిన నాలుగు బోర్ల మోటార్లు మాయం అయిన విషయాన్ని ‘ప్రభుత్వ నిధులు హాంఫట్’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం కోదాడ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద సమావేశం ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ల మద్య నెలకొన్న విభేదాలే గొడవకు కారణమని చెప్పుకొచ్చారు. అధికారుల తప్పిదం ఏమి లేదని, పత్రికలకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం వేసిన బోర్లు ఎండిపోవడంతో వాటిలో ఉన్న మోటార్లు చోరికి గురికాకుండా తెచ్చి స్టోరూంలో ఉంచామని కమిషనర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి బుధవారం స్టోర్రూం పరిశీలిస్తే రెండు పాత మోటార్లు, ఒక కొత్త మోటారు ఉన్నాయి. బోరు నుంచి తీస్తే అది పాతమోటారుగా ఉండాలి. కానీ స్టోర్రూంలో కొత్త మోటారు ఉంది. అంటే ఒక బోరులో అసలు మోటార్ వేయలేదని తెలుస్తోంది. బోర్ల విషయంలో గొడవ జరగడంతో ఆ కాంట్రాక్టర్ రెండు రోజుల క్రితం ఒక కొత్తమోటారు తెచ్చి స్టోర్రూంలో పెట్టినట్లు సమాచారం. మూడు మోటార్లకు సంబంధించి బోరులో వేసిన పైపులు 60 నుంచి 80 వరకు ఉండాలి. కానీ అక్కడ కేవలం 15 పైపులు ఉన్నాయి.ఎంబీ పరిశీలిస్తే ఎన్ని పైపులు కొన్నది తెలుస్త్తుంది.ప్యానల్ బోర్డులు, వైర్లు, ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
మూడు మోటార్లు తెచ్చి స్టోర్రూంలో వేసిన కోదాడ మున్సిపల్ అధికారులు