నెల్లూరు(టౌన్): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి రెండో రోజు శనివారం హిందీ పరీక్ష జరిగింది. మొత్తం 1,090 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా కేవలం 149 మంది మాత్రమే హాజరయ్యారు. 941 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రామారావు రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, అధికారులు కలిపి మొత్తం 18 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
ఊరూరా పోలీసుల జల్లెడ
● కార్డన్ సెర్చ్లో 80 బైక్లు స్వాధీనం
నెల్లూరు (క్రైమ్): జిల్లాలో పోలీసులు ఊరూరా జల్లెడ పట్టుతున్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్, నెల్లూరురూరల్ పోలీసుస్టేషత్తో పాటు సంగం, అనంతసాగరం, సోమశిల, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, కలువాయి, బిట్రగుంట, జలదంకి, రాపూరు, కలిగిరి పోలీసుస్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో శనివారం పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఇంట్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? తదితర వివరాలను సేకరించారు. రికార్డులు లేని 80 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు.