వర్గల్(గజ్వేల్): చదువుల తల్లి నెలవు వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం గురువారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. జన్మనక్షత్ర వేళ తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారి మూలవిగ్రహానికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. సర్వాలంకార శోభితులైన అమ్మవారికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన, లలితాపారాయణం, సప్తశతీ, చండీ పారాయణం, చండీ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమార్చన చేశారు. వేడుకలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
19న సిద్దిపేటలో సదర్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో ఈనెల 19న యాదవ సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సదర్ నిర్వహించనున్నారు. స్థానిక క్లాక్ టవర్ వద్ద సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సదర్లో హర్యానాకు చెందిన ఎద్దులు పాల్గొననున్నాయి. సిద్దిపేట పట్టణంలో తొలిసారిగా జరగనున్న సదర్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక కమిటీ ప్రతినిధి సందీప్ యాదవ్ తెలిపారు.
ముగ్గురు బీజేపీ
రెబల్స్ సస్పెన్షన్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన సాయికుమార్, గుమ్మడి శ్రీశైలం, గజ్వేల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన దాసరి భానుచందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
టెన్త్లో శత శాతం
ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి
వర్గల్(గజ్వేల్): టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం వర్గల్ మండలం నెంటూరు జెడ్పీఉన్నత పాఠశాలను సందర్శించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. టెన్త్ విద్యార్థులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక తరగతులకు రోజూ హాజరుకావాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కష్టపడాలన్నారు. కాంప్లెక్స్స్థాయి ఉపాధ్యాయులు విద్యార్థులలో సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మండల నోడల్ అధికారి వెంకటేశ్వరగౌడ్, కాంప్లెక్స్ హెచ్ఎం కనకరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీపీఎం ప్రజల పక్షం
చేర్యాల(సిద్దిపేట): ప్రజల పక్షాన ఉండి సమస్యలపై పోరాడేది ఒక్క సీపీఎం మాత్రమేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో సీపీఎం జనగామ అభ్యర్థి మోకు కనకారెడ్డితో కలిసి అబ్బాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశాయని ఆరోపించారు. మతతత్వ పార్టీ అయిన బీజేపికి రాష్ట్రంలో స్థానం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే బీఆర్ఎస్ది అసమర్థ పాలన అన్నది తేలిపోయిందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు.