
పేదింట సరస్వతి రత్నాలు
ప్రతిభ ఎవరి సొత్తు కాదు..సాధన చేస్తే విజయాలు ఒడిలో వాలిపోతాయి. అందుకు నిదర్శనం ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎందరో పేదింటి విద్యార్థులు..కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూలి పనులు చేస్తూ తమను చదివిస్తున్న తల్లిదండ్రుల రెక్కల కష్టానికి తగిన ఫలంగా రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. – సాక్షి నెట్వర్క్
మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి ..
మర్రిపూడి: మండలంలోని శివరాయునిపేట దళితవాడకు చెందిన నిహారిక పదో తరగతిలో 586 మార్కులు సాధించింది. తండ్రి ఆంజనేయులు బేల్దారి మేసీ్త్ర ..తల్లి కూలి పనిచేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తున్నారు. పనికి వెళితేనే కుటుంబం గడిచేది. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న నిహారిక కష్టపడి చదివింది. ఒక్కో రోజు బస్సు సమయానికి రాకపోతే కాలనీ నుంచి పాఠశాలకు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఎంతో ఆసరాగా నిలిచిందని నిహారిక తల్లిదండ్రులు తెలిపారు.