గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల్లో 1998కు ముందు అనేక సమ్మెలు జరిగాయి. గనులు, డివిజన్లు, ఏరియాల్లో కార్మికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సమ్మెకు పిలుపునివ్వడం చిన్నాచితకా కార్మిక సంఘాలకు సంప్రదాయంగా మారింది. తద్వారా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. ఇదేసమయంలో సంస్థ వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన క్రాఫ్ట్(వృత్తి) సంఘాలు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇలా డిసిగ్నేషన్వారీగా సింగరేణిలో ఏర్పడిన క్రాఫ్ట్ సంఘాలు ఏ చిన్న సమస్య వచ్చినా సమ్మెకు పిలుపునివ్వడంతో రోజుల తరబడి ఉత్పతి స్తంభించి పోయింది.
60కిపైగా వృత్తి సంఘాలు..
● సింగరేణిలో కోల్కట్టర్, టింబర్మెన్, బిట్ గ్రైండర్.. ఇలా క్రాఫ్ట్ సంఘాలు అనేకం ఏర్పడ్డాయి.
● ప్రధానంగా సంస్థ వ్యాప్తంగా సుమారు 60కిపైగా వృత్తి సంఘాలు ఆవిర్భవించాయి.
● యాజమాన్యం విధించిన మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా అప్పట్లో 50రోజుల పాటు సమ్మె సాగింది.
● అంతే కాకుండా గనుల్లో సమస్యలు ఏర్పడితే కాఫ్ట్ సంఘాలు వాటి పరిష్కారం కోసం సమ్మెకు దిగాయి.
● ఈక్రమంలో ఏటా సమ్మెల సంస్కృతి పెరిగి ఉత్పత్తికి విఘాతం కలిగింది.
● అన్ని జాతీయ సంఘాలు, సాజక్ కలిసి 03 మార్చి 1989లో సింగరేణి యాజమాన్యంతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయి.
● ఇలా బలంగా ఏర్పడిన సాజక్.. తమను జాతీయ సంఘాలు అంటరాని యూనియన్గా చూస్తున్నాయని, అందుకే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా తమకూ గుర్తింపు దక్కుతుందని యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.
● అయితే, జాతీయ సంఘాలు మాత్రం ఐదు కార్మిక సంఘాలను సమానంగా చూడాలని, కోలిండియా మాదిరిగా సింగరేణిలో జాతీయ సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.
రంగప్రవేశం చేసిన ఏపీవీఎన్ శర్మ..
సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మెలు తరచూ చోటుచేసుకోవడంతో 1998లో అప్పటికి సంస్థ సీ అండ్ ఎండీ ఏపీవీఎన్ శర్మ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇలా సింగరేణిలో తొలి సారి 1998 సెప్టెంబర్ 14న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల కాలపరిమి తితో జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించగా సాజక్ 23వేల ఓట్లు పొందింది. అప్పడు సింగరేణిలో సుమారు 1.20లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
హక్కులు సాధించాం
మేం సాజక్లో ఉండి అనేక పోరాటాలు చేశాం. అనేక కార్మిక హక్కులు సాధించాం. 1989లో జరిగిన ఒప్పందం చరిత్రాత్మికంగా నిలిచింది. ఎన్నికలను జాతీయ సంఘాలు వ్యతిరేకించినా మేం నిర్వహించాలని ఉద్యమించాం. దీంతో సింగరేణిలో ఎన్నికల సంస్కృతి మొదలైంది. ఆ తర్వాత ఐఎన్టీయూసీ జాతీయ నాయకుల ఆహ్వానం మేరకు సాజక్ను అందులో విలీనం చేశాం. – జనక్ప్రసాద్,
ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్
తొలుత వ్యతిరేకించాం
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలను మొదట్లో వ్యతిరేకించాం. కోలిండియా మాదిరిగా సింగరేణిలో కూడా ఐదు జాతీయ సంఘాలను సమానంగా చూడాలని, చర్చలకు ఆహ్వానించాలని కోరాం. అయితే యాజమాన్యం అంగీకరించలేదు. సాజక్ కూడా వ్యతిరేకించింది. దీంతో 1998లో సింగరేణిలో ఎన్నికలు జరిగాయి. తొలిసారి ఏఐటీయూసీ విజయం సాధించింది. – వాసిరెడ్డి సీతారామయ్య,
అధ్యక్షుడు, ఏఐటీయూసీ
సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం
ఆ క్రమంలోనే సంస్థలో ఎన్నికల నిర్వహణ
బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా వ్యూహం