నిజామాబాద్నాగారం: పార్లమెంట్ ఎన్నికలబరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు జీవన్రెడ్డి, అర్వింద్ది ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారామ్యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవన్రెడ్డి, అర్వింద్ల బంధం 2019 ఎన్నికల నుంచి కొనసాగుతోందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జగిత్యాలలో నిర్వహించిన ఓ సమావేశంలో వారిద్దరూ కలిసి పాల్గొన్నారని, అర్వింద్ జీవన్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఎంపీ కావడానికి అంకుల్(మామ) ఎంతో కష్టపడ్డారని, ఆయనకు తాను రుణపడి ఉన్నానని ప్రకటించారని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో వారి మధ్య ఒప్పందం రహస్యంగా ఉందని దీన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే కుట్రతో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తన 40 ఏళ్ల సుదీర్ఘరాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. చాలామంది రాజకీయ ఉద్ధండులను ఓడించిన వ్యక్తిగా బాజిరెడ్డి చరిత్రలో నిలిచారన్నారు. 48 గంటల విరామం తర్వాత మరింత రెట్టింపు ఉత్సాహంతో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై అక్రమంగా పెట్టిన కేసులను ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నుడా మాజీ చైర్మన్ సి ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొత్తూరు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, నాయకులు శంకర్, మహిపాల్యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.