నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ లోక్సభ స్థానానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో 3,35,863 మంది ఓటర్లు ఉన్నారు. మొదట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉండేవి. 2009లో ఏర్పడిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ లోక్సభ పరిధిలోకి వెళ్లాయి. దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చాయి. దీంతో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 14,96,593 మంది ఓటర్లు ఉన్నారు.
17 సార్లు జరిగిన ఎన్నికల్లో గెలుపు వీరిదే..
నిజామాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ బోణీ కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్(పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులు విజయం సాధించగా.. నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హరీశ్చంద్ర హెడా విజయం సాధించాడు. 1957, 1962లో జరిగిన వరుస ఎన్నికల్లో ఆయనే విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.నారాయణరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1971, 1975, 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రాంగోపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1984, 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టి.బాలాగౌడ్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 1991లో టీడీపీ అభ్యర్థి గడ్డం గంగారెడ్డి విజయం సాధించగా, 1996లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మచరణ్రెడ్డి గెలిచారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన గడ్డం గంగారెడ్డి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుయాష్కీగౌడ్ తొలిసారి గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు నిజామాబాద్ పరిధిలోకి వచ్చి చేరాయి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసిన మధుయాష్కీ గౌడ్ను ప్రజలు గెలిపించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత మారిన పరిస్థితి
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. నాడు జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. ఈ ఎన్నికలు ప్రతిష్టత్మకంగా జరిగాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇందూరు లోక్సభకు రాజకీయ ప్రాధాన్యం నెలకొంది. ఇక 2019లో జరిగిన ఎన్నిక చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఎలక్షన్ దేశం దృష్టిని నిజామాబాద్వైపు తిప్పింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 185 మంది పోటీ చేశారు. దీంతో ప్రత్యేకంగా బెంగళూరు నుంచి ఈవీఎంలను తెప్పించి ఎన్నికలు నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్తో 173 మంది రైతులు నామినేషన్ వేసి పోటీకి దిగారు. ఇక బీఆర్ఎస్ నుంచి రెండో సారి కవిత బరిలో దిగగా.. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ పోటీలో నిలిచారు. తొలిసారి ధర్మపురి అర్వింద్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక ప్రస్తుతం 18వ సారి ఎన్నికలు జరుగుతుండగా బీజేపీ నుంచి మరోసారి అర్వింద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచారు. మే 13న పోలింగ్ జరుగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరుగనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
అన్ని పార్టీలను ఆదరించిన
పార్లమెంట్ ఓటర్లు
ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన ఇద్దరు నేతలు
ఇండిపెండెంట్నూ గెలిపించిన ప్రజలు
1952లో తొలిసారి ఎన్నికలు
2019 ఎన్నికల బరిలో 185 మంది
దేశంలో హాట్టాపిక్గా మారిన
నిజామాబాద్ పేరు
నిజామాబాద్ లోక్సభ స్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని సైతం గెలిపించిన చరిత్ర ఇందూరుది. ఇద్దరు నేతలకు ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. 1952లో తొలిసారి ఎన్నికలు జరగగా.. 1967 మినహా.. 1991 వరకు హస్తం పార్టీ హవాయే కొనసాగింది. అనంతరం టీడీపీ ఏర్పాటుతో ఆ పార్టీ విజయపరంపరకు గండిపడింది. 1996లో, 2004, 2009లో మళ్లీ గెలిచినా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. 2014 బీఆర్ఎస్, 2019లో బీజేపీ గెలుపొందాయి.