కార్యదర్శులపై పనిభారం | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శులపై పనిభారం

Jun 5 2025 7:42 AM | Updated on Jun 5 2025 8:14 AM

రోజువారీ విధులను డీఎస్‌ఆర్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న ప్రభుత్వం

ౖ డెలీ రిపోర్టు పెట్టడం మా వల్ల కాదంటూ కార్యదర్శుల గగ్గోలు

పది రోజులుగా ‘డీఎస్‌ఆర్‌’ విధులకు దూరం

ప్రభుత్వం పునరాలోచించాలి

ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని పథకాలకు కార్యదర్శులు విధులు నిర్వహించాల్సిందే. ప్రస్తుతం కొత్తగా తెచ్చిన డీఎస్‌ఆర్‌ రిపోర్టుతో అందరికీ ఇబ్బందులే. దాని వల్ల కార్యదర్శులు రిపోర్టు పంపడంతోపాటు.. అధికారులు కూడా గంటల తరబడి రిపోర్టు కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. గ్రామాల్లో నెట్‌వర్క్‌ తక్కువగా ఉండటం వల్ల రిపోర్టు పెట్టేందుకు సమయం అధికంగా పడుతోంది. ఈ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

– ఖాసిం, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ మార్గదర్శకాలను

అమలు చేయాలి

డీఎస్‌ఆర్‌ యాప్‌లోనే డెయిలీ విధులకు సంబంధించిన నివేదికను పంపాలని ప్రభుత్వం మార్గదర్శకాలను తెచ్చింది. దానిపై కార్యదర్శులు కూడా వారి ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వానికి చెప్పుకున్నారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం డీఆఎస్‌ఆర్‌ యాప్‌లో కార్యదర్శులు డెయిలీ రిపోర్టు పెట్టాలి.

– వెంకయ్య, డీపీఓ

నల్లగొండ : ప్రభుత్వం మాపై పనిభారం మోపుతోంది. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నిర్వహించే విధులను ఏరోజుకారోజు డీఎస్‌ఆర్‌ (డెయిలి శానిటేషన్‌ రిపోర్టు) యాప్‌లో ఐరిష్‌ పద్ధతిన అప్‌లోడ్‌ చేయాలని ఇటీవల మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న పనులతోనే ఇబ్బందులు పడుతున్నామని.. ఈ డీఎస్‌ఆర్‌ యాప్‌తో ఉన్న సమయం కూడా రిపోర్టు పెడతానికే సరిపోతుందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారంతో ఇబ్బందులు పడుతున్నామని.. పదిరోజుల నుంచి కార్యదర్శులు ఈ డీఎస్‌ఆర్‌ అప్‌లోడ్‌ చేయడాన్ని బహిష్కరించారు.

జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు

జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో ప్రతి పంచాయతీకి ప్రభుత్వం కార్యదర్శులను నియమించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గ్రామాల్లో కార్యదర్శి ఉదయం 7 గంటలకే ఆన్‌లైన్‌ హాజరు వేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాంతో కార్యదర్శులంతా ఉదయం సమయంలో తాము వెళ్లలేమని ప్రభుత్వానికి విన్నవించడంతో అధికారులు కొంత వరకు సడలించి ఆన్‌లైన్‌లో హాజరు నమోదుకు అంగీకరించారు. అలా పంచాయతీ కార్యదర్శులు విధులు కొనసాగిస్తున్నారు. మే 24న పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యదర్శుల విధులపై కొత్తగా మార్గదర్శకాలను రూపొందించింది. గ్రామాల్లో నిర్వహించే శానిటేషన్‌తో పాటు డంపింగ్‌ యార్డులు, మొక్కల పెంపకం, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాల్లో చేసే పనులతో పాటు గ్రామంలో ఉండే గృహాల నుంచి తడి, పొడి చెత్త ఎన్ని గృహాల నుంచి సేకరించారు, ఎంత మోతాదులో సేకరించారు అనే రిపోర్టును ఈ డీఎస్‌ఆర్‌ యాప్‌లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలంటే కార్యదర్శి ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి ఐరీష్‌, లేదా వేలిముద్ర ద్వారా మాత్రమే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, మిషన్‌ భగీరథ తదితర ప్రభుత్వం పెట్టే కొత్త పథకాలకు కార్యదర్శులను వినియోగిస్తుంది. ఈ తరుణంలో కొత్త మార్గదర్శకాలతో వారు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.

10 రోజుల నుంచి యాప్‌ బహిష్కరణ

పంచాయతీ కార్యదర్శులు 10 రోజుల నుంచి డీఎస్‌ఆర్‌ యాప్‌లో రిపోర్టును అప్‌లోడ్‌ చేసే విధులను బహిష్కరించారు. ఇప్పటికే పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని.. చేతి నుంచే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని.. ప్రభుత్వం తెచ్చే ప్రతీ పథకానికి కార్యదర్శి తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని.. ఈ తరుణంలో పని వద్దకు వెళ్లి డీఎస్‌ఆర్‌ అప్‌లోడ్‌ చేయాలంటే ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయమంతా రిపోర్టులకే సరిపోతుందని.. ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement