జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల సమస్యలు తెలుసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ ఫారుఖీ అన్నారు. శాఖ పనితీరుపై శుక్రవారం మహబూబ్నగర్లోని విద్యుత్ భవన్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ విజిట్ చేస్తేనే విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్నారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా సమయంలోపు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతినెలా 9లోపు బిల్లింగ్ చేయాలని అప్పుడే కరెక్ట్గా బిల్లులు వస్తాయన్నారు. వినియోగదారులకు తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించి వారికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై, విధుల పట్ట నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతోపాటు ప్రతినెలా విద్యుత్ బిల్లుల వసూలుపై అధికార యంత్రాంగం దృష్టిసారించి వసూలు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులు వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే వానాకాలంలో విద్యుత్ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ లోడింగ్ గుర్తించి అక్కడ సరిపడా విద్యుత్ను సరఫరా చేయాలని, సబ్ స్టేషన్ల వారీగా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవాలని చెప్పారు. అంతకు ముందు జిల్లాకు తొలిసారిగా వచ్చిన సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీకి ఘన స్వాగతం పలికారు. ఎస్ఈ పీవీ రమేష్ సిబ్బందితో కలిసి మొక్కను అందజేశారు. సీఎండీ మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. కార్యక్రమంలో డీఈటీ చంద్రమౌళి, శివరాం, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.