కర్నూలు కల్చరల్: రాయలసీమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, కరువు తీరిపోవాలని.. ఇవన్నీ జరగాలంటే ప్రత్యేక రాలయసీమ రాష్ట్రం అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి రచించిన ‘మన సీమ కథలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. గాయకులు, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రచయితలు కలం ప్రహ్లాద, కానాపురం కృష్ణారెడ్డి తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ మన సీమ కథలు పుస్తకంలో రాయలసీమలోని అన్ని సమస్యలు కళ్లకు కట్టినట్లు బండి నారాయణ స్వామి పొందుపరిచారన్నారు. వాస్తవికతకు చాలా దగ్గరగా కథా వస్తువు ఉందన్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఉంటుందన్నారు. త్వరలో రాయలసీమ కరువు తీరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కథా రచయిత డాక్టర్ ఎం. హరికిషన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మారుతి, రాయలసీమ ఉద్యమం సంఘాల నాయకులు రవికుమార్, సీమకృష్ణ, అభ్యుదయ రచయితల సంఘం సభ్యులు సయ్యద్ జహీర్ అహ్మద్, పెరికల రంగస్వామి, ప్రమోద్ చక్రవర్తి, రాజా రమేష్, రాణి లీలావతి, చంద్రమౌళిని తదితరులు పాల్గొన్నారు.
‘మన సీమ కథలు’
పుస్తకావిష్కరణలో వక్తలు