పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారి తిరునాళ్లలో మూడోరోజు బుధవారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం శోభాయమానంగా సాగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తయిన ప్రభగా గుర్తింపు పొందిన ఈ దివ్య ప్రభోత్సవం 1928లో నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ఈవో కె. రమేష్నాయుడు ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచి దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ పర్యవేక్షణలో ఎస్ఐ పి. రాంబాబు పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఏఈ రాజు పాల్గొన్నారు.
నేడు అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ..
చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకునే కార్యక్రమం గురువారం సాయంత్రం 4.12 గంటలకు ప్రారంభమవుతుందని ఈవో తెలిపారు.