కాకినాడ రూరల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సన్ స్ట్రోక్ అడ్డంకిగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రచారానికి ముందుగా షెడ్యూల్ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు రోజులుగా వేసవి ఎండలు ఆందోళనకరంగా మారాయి. సుమారు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. దీనికితోడు ఉధృతంగా వీస్తున్న వేడిగాలులతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. బుధవారం 39 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఉదయం పది గంటలు దాటిన తరువాత ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. ఎన్నికల ప్రచారంపైనా ఆ ప్రభావం పడుతోంది. దీంతో మధ్యాహ్నం వాతావరణం చల్లబడిన తరువాత సాయంత్రం పూట అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు చేపడుతున్నారు. అభ్యర్థుల వెంట ప్రచారానికి వచ్చేవారు కూడా సాయంత్రం మాత్రమే బయటకు వస్తున్నారు. దీంతో ఎండ తీవ్రత ఉన్నంతసేపూ ఎన్నికల ప్రచారం సాగక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 13న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకు గాను అధికారులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్లను 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు.
ఉదయం నుంచే గ్రీష్మతాపంతో
బయటకు రాని ప్రజలు
సాయంత్రం ప్రచారానికి
పరిమితమవుతున్న అభ్యర్థులు
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ