కొత్తపల్లి: కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఒక వివాహిత ఉరి వేసుకుని మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పాడకు చెందిన కోటి అనిల్కు రాజోలుకు చెందిన కొండా అనూష (29)తో 2019 జూన్లో వివాహమైంది. వీరికి 4 ఏళ్ల మానస్ అనే కుమారుడు ఉన్నాడు. వివాహ సమయంలో రూ.3 లక్షల కట్నం, 3 కాసుల బంగారం, పలు లాంచనాలు ఇచ్చారు. అయినా అత్తమామలు, భర్త, ఇద్దరు ఆడపడుచులు అదనపు కట్నం కోసం అనూషను వేధిస్తున్నారు. పుట్టింటి వారితో మాట్లాడాలంటే భర్తే దగ్గర ఉండి ఫోన్ చేయించేవాడు. మనవడు మానస్తో కూడా మాట్లాడలేని పరిస్థితిని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వారి వేధింపులు తాళలేక అనూష బుధవారం ఉరి వేసుకుని మృతి చెందింది. ఆమె తల్లి కొండా నీల సత్యవతి ఫిర్యాదు మేరకు భర్త అనిల్, అత్తమామలు, ఆడపడుచులపై ఎస్సై స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించించారు.
మరో ఘటనలో..
కాకినాడ క్రైం: భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నగరబోయిన వెంకటేశ్వర్లు, వెంకట రమణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె శిరీష (25)కు అమలాపురం మండలం కామనగరువుకు చెందిన దంగేటి శ్రీనివాస్తో గతేడాది సెప్టెంబర్లో వివాహం చేశారు. శ్రీనివాస్ కాకినాడలోని రైస్మిల్లులో పనిచేస్తున్నాడు. వివాహం తర్వాత ఈ దంపతులు జగన్నాథపురం కోమలవారి వీధిలో నివాసం ఉంటున్నారు. అయితే అనుమానం, అదనపు కట్నం వేధింపులతో అత్త గంగారత్నం, భర్త శ్రీనివాస్ చేతిలో శిరీష నిత్యం నరకం అనుభవించేది. వారిద్దరూ పలుమార్లు ఆమెను శారీరకంగా వేధించారు. మనస్తాపం చెందిన శిరీష మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమె కాకినాడ జీజీహెచ్లో చేర్చగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త శ్రీనివాస్, తల్లి గంగారత్నంపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.