సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్తిక మాసం ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ఆరంభమైంది. ఈఓ టీవీ సూర్యనారాయణ ఆధ్వర్యాన అర్చకులు తెల్లవారుజామున గోపూజ, స్వామి వారికి అభిషేకాలు, పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తొలి పూజ నిర్వహించారు. వీటిని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలోని ధ్వజస్తంభం, రావి, మారేడు, జమ్మి చెట్లు, తులసి మొక్కల వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. కోనేరు జలాలను బిందెలతో తీసుకుని వచ్చి, ధ్వజస్తంభం వద్ద ఉన్న శివలింగానికి అభిషేకాలు చేశారు. అనేక మంది భక్తులు ఆలయంలో కార్తిక వన సమారాధన నిర్వహించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరఫున అన్నప్రసాద వితరణ చేశారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో లోవ దేవస్థానం ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆరు వేల మంది భక్తులు క్యూలో అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.92,235, పూజా టిక్కెట్లకు రూ.69,690, కేశఖండన శాలకు రూ.5,800, వాహన పూజలకు రూ.2,900, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెల రూపేణా రూ.8,650, విరాళాలు రూ.63,297 కలిపి అమ్మవారికి మొత్తం రూ.2,42,572 ఆదాయం సమకూరిందని వివరించారు.
జిల్లా సీనియర్స్
సాఫ్ట్ టెన్నిస్ బాల్ జట్ల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో జిల్లా సీనియర్స్ సాఫ్ట్ టెన్నిస్ బాల్ జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఈ ఎంపికలకు 40 మంది బాలురు, 30 మంది బాలికలు హాజరయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగే అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా జట్లను ఈ సందర్భంగా ఎంపిక చేశామని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ బాల్ సంఘం అధ్యక్షుడు సాయిబాబు తెలిపారు.
వెండి బిందె సమర్పణ
నల్లజర్ల: స్థానిక శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి పూర్వ వైద్యుడు శ్రీగంజాం శ్రీనివాసాచార్యులు అల్లు డు, కుమార్తె శ్రీభా ష్యం శేషావతారం, మంగతాయారు దంపతులు (నల్లజర్ల) ఆదివారం రూ.40 వేల విలువైన వెండి తీర్థపు బిందె సమర్పించారు.
అంతర్వేది ఆలయానికి
పోటెత్తిన భక్తులు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని సన్నిధికి ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక మాసంలో ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి పిల్లాపాపలతో వచ్చారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప, భవానీ దీక్ష భక్తులు కూడా తరలి వచ్చారు. ఆలయంలో నిర్వహించే సుదర్శన హోమంలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి సన్నిధికి సుమారు పది వేల మంది భక్తులు వచ్చినట్టు అంచనా వేశామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. క్యూ ల్లో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.