
ఉద్యాన సాగుకు రాయితీలు
భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటల సాగు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఉద్యాన పంట సాగువైపు రైతులు మొగ్గు చూపేందుకు వారికి ఆయా పంటల సాగు, యంత్ర పరికరాలపై రాయితీలు కల్పించనుంది. పండ్ల తోటలు, పూల సాగు, కూరగాయల సాగుకు సబ్సిడీలతోపాటు యంత్రాలు, యంత్ర పరికరాలు, సూక్ష్మనీటి సేద్యానికి 2025–26 ఏడాదికి ఉద్యానశాఖ రాయితీ అందిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 30వేల ఎకరాల ఉద్యాన పంటలు సాగవుతుండగా.. ఈ ఏడాది అదనంగా 5,200 ఎకరాలు పెంచాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్ధేశించింది.
కూరగాయల పంటలకు..
టమాట పంట ఎకరాకు రూ.9,600, క్యాబేజీ రూ.9,600, క్యాలీప్లవర్, రూ.9,600, మిర్చి నారుకు రూ.9,600 సబ్సిడీ ఇవ్వనున్నారు. మల్చింగ్ వేసుకునే రైతులకు ఎకరాకు రూ.8వేలు, తీగజాతి కూరగాయల సాగు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం ఎకరానికి రూ.లక్ష, పూల రైతులకు ఎకరాకు రూ.8వేలు రాయితీగా అందించనుంది.
ఆయిల్పామ్ సాగుకు..
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును పెంచాలనే లక్ష్యంతో ఎకరాకు మూడేళ్ల బిందుసేద్యంతో కలిపి రూ.50,818లను సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. గతేడాది వరకు ఆయిల్పామ్ సాగు 3,800 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,500 ఎకరాలు సాగు విస్తీర్ణాన్ని పెంచి 6300 ఎకరాలకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఈ ఏడాది జాతీయ వెదురు మిషన్ (ఎన్బీం)ద్వారా 50 శాతం సబ్సిడీతో ఎకరాకు రూ.24,000 చొప్పున 50 ఎకరాలకు సబ్సిడీ అందించనుంది.
యంత్రాలు..
ఉద్యాన పంటల సాగుకు 20 హెచ్పీ ట్రాక్టరుకు రూ.2.45లక్షల సబ్సిడీ, పవర్ టిల్లర్కు రూ.లక్ష, పవర్వీడర్కు రూ.75వేలు, బ్రష్కట్టర్స్ రూ.25వేలు సబ్సిడీ అందజేయనున్నారు.
సూక్ష్మ సేద్యం..
ప్రైమ్మినిస్టర్ క్రిషి సించాయి యోజన పథకం కింద పండ్ల తోటలతో పాటు కూరగాయలకు, మిరప, ఆయిల్పామ్ సాగుకు బిందు, తుంపర సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఇవ్వనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఉద్యాన పంటల సాగుకోసం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతోపాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు పోత్సాహం అందుతుంది. ఉద్యాన పంటలసాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్ను కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆసక్తిగల రైతులు వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి.
– సునీల్, ఉద్యాన పట్టు పరిశ్రమల జిల్లా అధికారి
పండ్ల తోటలకు ప్రోత్సాహకం
హెక్టారు మామిడి పంటకు రూ.19.200, నిమ్మ రూ.19,200, జామ రూ.19,200, అరటి రూ.16,800, బొప్పాయి రూ.7200, డ్రాగన్ప్రూట్ రూ.64,800, దానిమ్మ రూ.19,200, ముదురుమామిడి తోటల పునరుద్ధరణకు రూ.9,600 ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు.
పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు..
జిల్లాలో 30వేల ఎకరాల సాగు విస్తీర్ణం

ఉద్యాన సాగుకు రాయితీలు

ఉద్యాన సాగుకు రాయితీలు