చార్మినార్: చార్మినార్ శాసనసభ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేయడమే కాకుండా నామినేషన్ దాఖలు చేసిన తమ పార్టీ నాయకుడు షహబాజ్ఖాన్పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఉపసంహరణ కోసం మొగల్పురాలోని చార్మినార్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన షహబాజ్ ఖాన్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన షహబాజ్ ఖాన్ పై శాలిబండ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. 2018లో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్పై ఈ నెల 15న కేసులు నమోదు చేసినట్లు చెబుతున్న పోలీసులు..ఎవరు ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు చేయనప్పటికీ..అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే స్పందించి సంబంధిత పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ను కోరారు.