
పకడ్బందీగా బదిలీలు
– పర్యవేక్షించిన ఆర్జేడి శామ్యూల్
చిత్తూరు కలెక్టరేట్ : బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆర్జేడీ శామ్యూల్ అన్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తును పర్యవేక్షించారు. అనంతరం విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. ఆర్జేడీ మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా కసరత్తును నిర్వహిస్తున్నారని చెప్పారు.
సమస్యలు ఇవీ
బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియలో సిద్ధం చేసిన సీనియారిటీ జాబితాల్లో పేర్లు లేకపోవడం, అభ్యర్థన బదిలీలను కచ్చితమైన బదిలీలుగా చూపించడం, ఉద్యోగోన్నతి పొందిన గ్రేడ్–2 హెచ్ఎం, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా మార్పు తీసుకున్న వారి ఖాళీలను వెబ్సైట్లో చూపకపోవడం, క్లస్టర్ పాఠశాలలను ఎవరు ఎంపిక చేసుకోవాలనే దానిపై స్పష్టత లేకపోవడం, ప్రాధాన్యత కేటగిరీలో రెండు పోస్టులుంటే ఒకటి తప్పనిసరి అనేది అన్ని మండలాల్లో చూపకపోవడం వంటి అవకతవకలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలపై వందకు పైగా టీచర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. బదిలీల కసరత్తులో చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు పెంచాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
తప్పిదాలు సరిదిద్దాలి
ఈనెల 3వ తేదీన విడుదలైన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలో దొర్లిన పొరపాట్లను సవరించుకునేందుకు పెద్ద సంఖ్యలో టీచర్లు క్యూ కట్టారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆర్జేడీ దృష్టికి టీచర్ల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వెబ్ ఆప్షన్లకు తక్కువ గడువు ఉన్న విషయాన్ని వివరించారు. డీఎస్సీ 2008 టీచర్లకు కామన్ జాయినింగ్ తేదీ ఉండే విధంగా చూడాలన్నారు. ప్రిఫరెన్షియల్ క్యాటగిరీల వారికి ఖాళీల కేటాయింపులో నిబంధనలు పాటించాలన్నారు. వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు రేపటి వరకు గడువు పొడిగించాలన్నారు. క్లస్టర్ రిసోర్స్ టీచర్ పోస్టుల విధి విధానాలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి, నాయకులు చంద్రన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.