
తప్పిన లక్ష్మీ కాసులు.. చివరకు హుండీలోకి..
కాణిపాకం : కాణిపాక శ్రీవరసిద్ధి వినాయస్వామి దర్శనార్థం వచ్చిన ఓ భక్తురాలు బుధవారం ఆలయంలో లక్ష్మీకాసులు(బంగారు) పొగొట్టుకున్నారు. వివరాలు ఇలా..హైదరాబాద్కు చెందిన ఓ భక్తురాలు బుధవారం స్వామి దర్శనార్థం వచ్చారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రెండు లక్ష్మీ కాసులు కింద పడిపోయాయి. ఇది గమనించిన ఓ హోంగార్డు ఆ రెండు కాసులను తీసి ఓ వ్యక్తి చేతికి ఇచ్చాడు. ఆ వ్యక్తి రెండు కాసుల్లో ఒకటి హుండీలో వేసి..మరో కాసును జేబులో వేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన ఆలయ అధికారులు విచారణ మొదలు పెట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ కాసుల చేతుల మార్పిడిని గుర్తించారు. చివరకు బాధితురాలికి ఆ ఒక్క కాసును అందించారు. ఆమె ఆ కాసు కూడా వద్దని...అది కూడా దేవునికే అంకితమని...హుండీలో వేసి సంతృప్తిగా వెళ్లిపోయారు. ఇక ఆ కాసులను ఆ హోంగార్డు..ఎందుకు ఆ వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
గిరిజనులకు జీవనోపాధి
పలమనేరు : గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా జిల్లాలో ఎంపికై న పలమనేరు మండలంలోని జగమర్ల పంచాయతీ దేవళంపేటలోని గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి సూచించారు. బుధవారం జిల్లాలోని పలు శాఖల అధికారులతో దేవళంపేటలో గ్రామసభను నిర్వహించారు. ఇందులో జిల్లా భూగర్భజలశాఖ డీడీ గోవర్ధన్రెడ్డి, మత్స్యశాఖ ఏడీ రవీంద్రారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గుణశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. గిరిజనులకు సమగ్ర , స్థిరమైన అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఈ గ్రామంలో మొత్తం 194 కుటుంబాలుండగా ఇందులో 110 కుటుంబాలు గిరిజనులే ఉన్నారన్నారు. గిరిజనులకు విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధితో పాటు జీవనోపాధులను కల్పిస్తామన్నారు. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కలెక్టర్ ప్రతినెలా సమీక్షించనున్నట్లు తెలిపారు. మరోవైపు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ గ్రామస్తులతో మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, విధ్య, ఐసీడీఎస్, పీఆర్, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో పాటు అగ్రికల్చర్ ఏడీ శివకుమార్, ఏవో సంధ్య పాల్గొన్నారు.