
బదిలీలకు అడ్డదారులు
ఉద్యోగుల బదిలీల్లో కొన్ని ఉద్యోగుల సంఘాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. క్యాష్, పలుకుబడి ఉన్న వారికి సంఘాల్లో ఆఫీస్ బేరర్స్గా చేర్చుకుని సిఫార్సు లేఖలు అందజేస్తున్నారు. మరికొన్ని సంఘాలు ముడుపులు స్వీకరించి సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లు సమాచారం. కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కి ఉన్నచోటే కొనసాగేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవోలో ఉన్న మినహాయింపులను అవకాశంగా మార్చుకుని కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘంలో సభ్యత్వం లేనివారికి, ఓటరు జాబితాలో పేరు లేని వారికి రాత్రికి రాత్రే ఆఫీస్ బేరర్లుగా నియామక పత్రాలు ఇచ్చి బదిలీల నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
మినహాయింపులకు సిఫార్సు లేఖలు
జిల్లా పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ, ఇరిగేషన్, జిల్లా పరిషత్, పే అండ్ అకౌంట్స్, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీల్లో స్థానచలనం పొందాల్సి ఉంటుంది. అయితే వారు అడ్డదారుల్లో ఆఫీస్ బేరర్లుగా ధ్రువపత్రాలు పొంది బదిలీల నుంచి మినహాయింపులు కోరుతున్నారు. రెవెన్యూ శాఖలో ఆఫీస్ బేరర్ పత్రాలతో పాటు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సమర్పిస్తున్నారు. వీఆర్వోలు తమ స్థానాలను కొనసాగించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
నిబంధనలను నీరు గార్చే ప్రయత్నాలు
అడ్డదారులు తొక్కుతున్న కొన్ని ఉద్యోగ సంఘాలు
సంఘాల్లో కొత్తవారికి అవకాశాలు, సిఫార్సు లేఖలు
ఉన్నతాధికారులకు కుచ్చుటోపీ
నిబంధనల ప్రకారం ఒక సంఘంలో ఎవరెవరికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారో ఆ వివరాలతో పాటు ఎన్నికల అధికారి ధ్రువీకరించిన జిల్లా కార్యవర్గ లేఖను కలెక్టర్కు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో ఆయా సంఘాల అధ్యక్షులు.. ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఆఫీస్ బేరర్ పత్రాలు ఇచ్చేస్తున్నారు. తమ సంఘం తరఫున ఎంత మందికి లేఖలిచ్చారో ఆ విషయాలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన లేఖలను కలెక్టర్కు ఇవ్వకుండా కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆయా ఉద్యోగ సంఘాలు ఇస్తున్న లేఖలను కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సమగ్ర విచారణ చేయించాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
సంఘాల్లో పేర్లు మార్చేస్తూ..
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఆఫీస్ బేరర్లకు మూడు పర్యాయాలు పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యే దాకా బదిలీ చేయకూడదు. తాలూకా, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల వివరాలను కలెక్టర్ ద్వారా హెచ్వోడీకి పంపాల్సి ఉంటుంది. ఒక సంఘంలో 13 నుంచి 15 లేదా 20 మంది వరకు ఆఫీస్ బేరర్లు ఉంటారు. అందులో ఐదుగురికి మించి ఉద్యోగులు ఐదేళ్లు, తొమ్మిదేళ్లకు పైబడి సర్వీసు పూర్తి చేసిన వారు ఉండరు.. కాగా మొత్తం కార్యవర్గంలో 75 శాతం మందికి బదిలీల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ ఆయా సంఘాల పత్రాలు ఇస్తున్నారు. రాత్రికి రాత్రే గుర్తింపు పొందిన సంఘాల్లో సభ్యుల పేర్లను మార్చేసి కలెక్టర్కు నివేదికలు ఇస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

బదిలీలకు అడ్డదారులు