
బాలుడి మృతి కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడు: బాలుడు వెంకటేష్ మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐ మురళీనాయుడు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బాలుడు వెంకటేష్ మృతికి సంబంధించి సత్యవేడు మండలం నరసరా జు అగ్రహారం చెందిన ముత్తు(60) ధనభాగ్యం(55), రాజశేఖర్(32) అరెస్టు చేశామన్నారు. గూడూరు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన చెంచయ్య, అంకమ్మకు చెంచుకృష్ణయ్య, రామ లక్ష్మమ్మ, వెంకటేష్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భర్త చనిపోవడంతో బాలున్ని వదిలి..
అంకమ్మకు ఏడాది కిందట నరసరాజు అగ్రహారానికి చెందిన ముత్తు రూ.10 వేలు ఇచ్చి సత్యవేడుకు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక అంకమ్మ తన పిల్లలతో కలిసి బర్రెలు, బాతులకు కాపలాదారుగా ఉండేది. 3 నెలల కిందట అంకమ్మ భర్త చెంచయ్య చనిపోవడంతో సొంతూరుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి వెళ్లాలని యజమాని ముత్తు పట్టుపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె 9 ఏళ్ల కొడుకు వెంకటేశ్ను వారి వద్దే వదలివెళ్లింది. బాలుడితో ముత్తు వెట్టిచాకిరీ చేయించుకోవడంతో పాటు హింసించేవాడు. కొన్నాళ్లకు బాలుడు వెంకటేష్ను తీసుకొని యజమాని ముత్తు తమిళనాడులోని కంచి ప్రాంతానికి బాతులు మేపడానికి తీసుకెళ్లాడు. అయితే తల్లి అంకమ్మ కుమారుడితో ఫోన్లో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించగా మీ కొడుకు కనిపించడంలేదని ముత్తు తెలిపాడు. దీంతో ఆమె ఈ నెల 19న సత్యవేడుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా గుట్టురట్టయింది. కంచిలో ఉన్న సమయంలో బాలుడు అస్వస్థతకు గురి కావడంతో ఏప్రిల్ 11వ తేదీన కంచి సమీపంలోని లింగ ఆస్పత్రిలో చేర్పించగా.. 12న చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కంచి వద్ద పాలేరు నదిలో పూడ్చి పెట్టినట్లు నిందితుడు ముత్తు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు కంచికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికితీసి అక్కడి అధికారుల సమక్షంలో పంచనామా చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.