
ఒకరు కాదు...నలుగురు!
● డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల బీఈడీ లీలలు ● బీఈడీ విద్యార్థులుగా మారిన అధ్యాపకులు ● ఎస్వీయూ అధికారుల విచారణ ప్రారంభం
పలమనేరు: అధ్యాపకుడే విద్యార్థిగా మారిన ఘటనలో ఒకరు కాదు నలుగురు ఉన్నట్లు సమాచారం. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ అధ్యాపకుడు బంగారుపాళెంలోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలలో విద్యార్థిగా మారి, పలమనేరు డిగ్రీ కళాశాల సెంటర్లోనే బీఈడీ పరీక్షలు రాస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 27న ‘ఇక్కడ అధ్యాపకులు.. అక్కడ విద్యార్థులు’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం విదితమే. ఇలా ఉండగా ఇదే కళాశాలకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్ట్, కంప్యూటర్ ఆపరేటర్లు సైతం ఇక్కడ విధులు నిర్వహిస్తూ జీతాలు పొంది, అక్కడి బీఈడీ కళాశాలలో విద్యార్థులుగా ఇప్పుడు ఇదే సెంటర్లో బీఈడీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎస్వీయూ అధికారుల విచారణ చేస్తున్నట్టు సమాచారం.
అక్కడా.. ఇక్కడా హాజరు ఎట్టా..
ప్రైవేటు బీఈడీ కళాశాలలో కనీసం 40 శాతం హాజరున్న విద్యార్థులను ఆపై కొంత అపరాధంతో నిర్వాహకులు పరీక్షకు అనుమతిస్తుంటారు. అయితే ప్రభుత్వ కళాశాల అధ్యాపకులే అక్కడ విద్యార్థులు కావడంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యం వారి హాజరుపై ఏదోలా మ్యానేజ్ చేసిందనే మాట వినిపిస్తోంది. దీంతో ఏడాదిలో కనీసం 150 రోజులైనా వీరు ప్రైవేటు కాలేజీకి వెళ్లి ఉండాలి. అలాంటప్పుడు పలమనేరులో వారు విధులకు గైర్హాజరు అయి ఉండాలి. కానీ అలా జరగలేదు. వీరు ఇక్కడి కళాశాల పనిదినాల్లో పనిచేసినట్టుగానే నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో విచారణ చేసే అధికారులకు ఏమి సమాధానం చెప్పాలో అర్థంగాక కళాశాల ప్రిన్సిపల్ తలపట్టుకుంటున్నట్టు సమాచారం.
పది మంది వరకు ఉద్యోగులు...
బంగారుపాళెంలోని ప్రైవేటు బీఈడీ కళాశాలలో పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పలువురు అధ్యాపకులతోపాటు జిల్లాలోని పది మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు బీఈడీ విద్యార్థులుగా ఉన్నట్టు సమాచారం. దీనిపై సైతం యూనివర్సిటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
అదనపు జీతమొస్తుందని..
పీజీ, పీహెచ్డీలతో అధ్యాపకులైన వీరు బీఈడీ, ఎంఈడీ డిగ్రీలుంటే అదనపు జీతమొస్తుందనే ఇలా డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు మేధావులు చెబుతున్నారు.
బంగారుపాళెంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల
గాడి తప్పిన పరీక్షల నిర్వహణ
ప్రైవేటు కళాశాలల బీఈడీ పరీక్షలు ఓపెన్ స్కూల్ పరీక్షల్లా మారాయనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇష్టానురాజ్యంగా అనుకూలమైన చోట సెంటర్లను తెచ్చుకోవడం మొదలు మాస్ కాపీయింగ్ షరా మామూలుగా మారింది. బీఈడీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో పాటు అదే సెంటర్లోని అధ్యాపకులు పరీక్ష కలిసి రాస్తుండడంతో పరీక్షల తీరు గాడి తప్పిందనే విమర్శలున్నాయి. చిత్తూరు సెంటర్లో ఒకే బల్లపై ముగ్గురు విద్యార్థులు పరీక్షలు రాయడం, మాస్ కాపీయింగ్తో పరీక్షలంటేనే నమ్మకం పోయింది. ఇలా పరీక్షలు రాసి పాసై, రేపు ఉద్యోగాలు పొందే వారు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారో ఎస్వీయూ అధికారులే ఆలోచించాలి. ఈ విషయమై స్థానిక ప్రిన్సిపాల్ వెంకటేశును వివరణ కోరగా ఇక్కడున్న అధ్యాపకులు బీఈడీ విద్యార్థులుగా ఇదే సెంటర్లో పరీక్ష రాస్తున్న విషయం సాక్షిలో వచ్చే వరకు తెలిదని, ఇప్పుడు విచారిస్తున్నామని చెప్పడం కొసమెరుపు.