పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం జరిపారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నీవేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ జి.సుదర్శన్, భక్తులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన
ఎమ్మెల్యే కనకయ్య
ఇల్లెందు: మహబూబాబాద్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి శాలువాతో సత్కరించారు. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ పి.పరందామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్పోర్డ్స్ అథారిటీ ఆధ్వర్యాన నెల పాటు శిబిరాలు కొనసాగుతాయని, శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారులైతే వారి ప్రగతికి సంబంధించిన ధ్రువపత్రాలను జతచేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండి శిక్షణ ఇవ్వగలిగే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా అందజేయాలని డీవైఎస్ఓ సూచించారు.
మే 24న పాలిసెట్
● దరఖాస్తుకు ఈ నెల 26 వరకు గడువు
సింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే నెల 24న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కన్వీనర్ బి.నాగమునినాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈనెల 22వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, రూ.100 జరిమానాతో 24వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు.
విద్యాభివృద్ధిపై
ప్రత్యేక దృష్టి సారించాలి
● భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
భద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాల్లో విద్యాభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పీఓ ప్రతీక్ జైన్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు తిరిగి ప్రారంభించే నాటికి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో స్క్రాప్ ఉంటే సబ్ డివిజన్ కమిటీ ద్వారా పరిశీలించి తొలగించాలనానరు. ప్రత్యేక అధికారులు పాఠశాలలకు వైట్ వాష్, ఫ్లోరింగ్ రిపేర్, మంచాలు కటింగ్ చేయించి విద్యార్థులకు అందేలా చూడాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా వేసవి సెలవుల్లో పాఠశాలలను సందర్శిస్తూ ఉండాలని తెలిపారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ తానాజీ, ఎస్వో సురేష్బాబు, ఉద్యానవన అధికారి అశోక్కుమార్, ఏడీ భాస్కరన్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.